Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆశ్చర్యపరుస్తున్నాడు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా గుండ్లపేట్ గ్రామంలోని హూంగాహళ్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు ప్రతిరోజూ స్కూల్కి రాగానే బ్రష్ పట్టుకుని టాయిలెట్స్ శుభ్రం చేస్తాడు. జీవన మనుగడకు 'పచ్చదనం- పరిశుభ్రత' రెండూ అవసరమని పాఠాలు చెప్పడమే కాదు, దాన్ని నిరూపిస్తున్న అతని పేరు మహదేశ్వరస్వామి.
ఫిబ్రవరి 6, 1988న ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించాడు మహదేశ్వర స్వామి. ఆ రోజు నుంచి 30 ఏళ్లుగా రోజూ తన పాఠశాలలోని మరుగుదొడ్డిని స్వయంగా శుభ్రం చేస్తున్నాడు. పాఠశాలలో స్వీపర్ పనిచేసేందుకు మనుషులు ఉన్నప్పటికీ పిల్లలకు స్వచ్ఛత అలవాటు చేయాలంటే... 'టాయిలెట్ క్లీనింగ్ అనేది ఓ అంటరాని పని' అనే ఫీలింగ్ పొగొట్టేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడాయన. మనోడు చేస్తున్న పని కారణంగా పిల్లల్లో చాలా మార్పు కనిపించింది. ఇళ్లల్లో టాయిలెట్స్ స్వయంగా క్లీన్ చేసుకునేందుకు ఎటువంటి మొహమాటం చూపించడం లేదు ఆ ఊరి చిన్నారులు. అంతేకాకుండా పచ్చదనం పెంచే ఉద్దేశంతో స్కూల్ ఆవరణలో మొక్కలను పెంచుతున్నాడు మహదేశ్వరస్వామి. సొంత డబ్బుతో పాఠశాలలో పిల్లల కోసం ఓ గ్రంథాలయం కూడా ఏర్పాటు చేసిన హెడ్మాస్టర్... మిగిలిన ఉపాధ్యాయులకు... పిల్లలకు, ఆ ఊరి జనాలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.