Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతని పాటల్లో పల్లె పరిమళం కన్పిస్తుంది. ఆ పాట పచ్చని పొలాల్లో పురుడోసుకుంటుంది. మట్టిని ముద్దాడుతుంది. అతడు రాసే అక్షరాల మధ్య చైతన్యం జ్వలిస్తుంది. పదాల్లో ఉత్తేజం ఉట్టిపడుతుంది. ఆ పాట విద్యార్థులకు ప్రేరణ కల్పిస్తుంది, యువకులను ఆలోచింపజేస్తుంది. ముసలొల్లకు ముచ్చటేస్తుంది. ఆ పాట సమాజంలో ఉన్న వెలితిని ప్రతిబింబిస్తుంది.. అందుకే అతని అక్షరాలు జనానికి దగ్గరయ్యాయి, అతని గాత్రం అందరికీ చేరువైంది. చిన్నతనం నుంచే సాహిత్యం, సంగీతంపై పెంచుకున్న మక్కువ అతన్ని గీత రచయితను చేసింది, గాయకున్ని చేసింది. అతనే జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన టేకుల గోపి. రచయితగా, గాయకునిగా పాటలు, వీడియో అల్బమ్లు చిత్రీకరించి అందరి మన్ననలూ పొందుతున్న ఈతరం కళాకారునిపై జోష్ కథనం...
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శాంతినగర్కు చెందిన టేకుల పుట్టింది పట్టణ ప్రాంతమే అయినా ఆయనకు ప్రకృతంటే ప్రేమ.. పక్షుల కిలకిల రాగాలతో పాటకు ప్రాణం పోయాలనుకుంటాడు. పొలాల మీద నుంచి వీచే పిల్లగాలులే అతని పాటకు రిథమ్గా చేయలనుకుంటాడు. కీచురాళ్ల శబ్ధాలనే పాటలో పొందుపరిచి మదిని పులకింపజేయటం ఆయనకు ఇష్టం.. సమాజంలో వెలితిని కడిగేయడానికి రాసే అక్షరాలకు ఇలాంటి సంగీతం అందించి తనదైన ప్రాచూర్యం పొందుతున్నాడు. గోపీ వృత్తిరీత్య ప్రయివేటు ఉపాధ్యాయుడు. సంగీతం, సాహిత్య నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావటంతో అతని దృష్టి కూడా అటువైపు పడింది. అయితే ఈ తరానికి భిన్నమైన సంగీతాన్ని, సాహిత్యాన్ని అందించాలని గోపీ అనుకున్నాడు. అందుకే ప్రకృతిని ప్రేమించాడు. అక్కడి నుంచే పాటలు రాయటం ప్రారంభించాడు.
గోపీ 2010లో హైద్రాబాద్లోని ఓ కళాశాలలో ఎంఏ తెలుగు పూర్తి చేశాడు. అప్పటికే గీత రచనపై, సంగీతంపై ఆసక్తి ఉంటంతో చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే తన అభిరుచిని మెరుగుపరుచుకున్నాడు. అలా మొదటి సారి 2011లో 'జీమ్యూజిక్' సంస్థను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన గోపీ అదే ఏటా 'తుంగభద్ర' పేరుతో ఆడియో సిడీని విడుదల చేశాడు. 2012 సునామీతో యుగాంతం అవుతుందనే పుకార్లపై మొదటి సారి గళమెత్తాడు. 'భయపడకు సునామి రాదు కొట్టుకుపోవు' అంటూ తన ఆలోచనలకు పదునుపెట్డాడు. అవే లిరిక్స్ను తానే సొంతంగా పాడి తుంగభద్ర ఆడియో సిడీని రిలీజ్ చేశాడు. ప్రజలు ప్రేరణ పొందే విధంగా ఉన్న ఈ పాట అప్పట్లో ఎక్కువ ప్రాచూర్యం పొందింది.
గోపీ పాటల పరంపర...
మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ పెరగటం, యూట్యూబ్, ఫేస్బుక్లలోనూ గోపీ ఆడియో, వీడియో అల్బమ్స్కు ఆదరణ లభిస్తూ రావటం గోపీకి మరింత స్ఫూర్తి నింపాయి. దీంతో యూట్యూబ్లో సొంత చానెల్ ద్వారా తన ప్రతిభను, స్ఫూర్తి నింపే పాటలను ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. ఇందలో భాగంగానే అతని నుంచి వచ్చిన బతుకమ్మ పాటలు, వీడియో అల్బమ్స్, ఫ్రెండ్షిప్డే విశేష ఆధరణ పొందాయి. సమాజంలో స్త్రీలు ఎదుర్కుంటున్న వివక్షపై, దాడులపై గోపీ తనదైన శైలిలో 'స్త్రీ భారతం' ఆడియో అల్బమ్ రిలీజ్ చేసి మరింత సామాజిక చైతన్యం చాటుకున్నాడు.
సోషల్ మీడియా వేదికగా...
సొంత బ్యానర్ను ఏర్పాటు చేసుకున్న గోపీ సొంతంగా వీడియో అల్బమ్స్ చేస్తున్నాడు. తన పాటకు తానే రాగం, తానం పల్లవి అయినట్టు వీడియో అల్బమ్స్ను కూడా సొంత బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. వీటిని యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా జనాలకు చేరవేస్తున్నాడు. చైతన్యం, సందేశం జ్వలించే పాటలు, పలెటూరి వాతావరణం కనిపించే సీన్లు, అందరిని ఏకం చేసి చిత్రీకరించిన వీడియోలు కావటంతో మంచి ఆదరణ ఉంది. ప్రతిభ ఉంటే ప్రపంచాన్నే గెలవొచ్చు అంటున్నాడు గోపీ. తన పాటలో అర్థం కానీ పదాలు పేర్చి జనాల్ని ఉర్రూతలూగించటం కన్నా సందేశాన్నిచే పాటలు, చైతన్యం నింపే వీడియోలు తీసి సామాజిక బాధ్యతను చాటుకుంటాను అంటున్నాడు. త్వరలోనే మరిన్ని అల్బమ్లు కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపాడు.