Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువత న్యూస్ పేపర్ ఎందుకు చదవటం లేదు అనే ప్రశ్న ఆ యువకుడ్ని వేధించింది. నిద్రపొనీయకుండా కలవర పెడుతున్నది. రోజూ ఇవే ఆలోచనలు. ఓ ఉదయం ఒంటరిగా ఇంటి
ముందు తిరుగుతున్నాడు. అప్పుడే పేపర్ వేసి వెళ్తున్న పేపర్ బాయ్ ని చూశాడు. కనీసం ఇతనైనా న్యూస్ పేపర్ చదువుతున్నాడా? అనే మరో ప్రశ్న అతని మదిని తొలిచేసింది. ఆ
పేపర్ బారుతో మాట్లాడాలనే ఆసక్తి అతన్ని నిలవనీయలేదు. మరి ఆ తర్వాత ఏం చేశాడో ఈ రోజు జోష్లో తెలుసుకుందాం...
మరుసటి రోజు పేపర్ బాయ్ కోసం ఎదురుచూస్తున్నాడు. పేపర్ బాయ్ రాకతో అతని ముఖం వెలిగిపోయింది. ' బ్రదర్ ఈ పేపర్ మాకంటే ముందు నీ చేతికే వస్తుంది కదా చదువుతావా?' అడిగాడు. ' లేదు భయ్యా, నాకు ఎట్టా కుదుతుంది. పొద్దునే పేపర్ ఇంటి ముందు లేకపోతే జనం గోల చేస్తారు' అన్నాడు. ఆ సమాధానం అతనికి మరల నిరుత్సాహ పరిచింది. మళ్ళీ మథనం మొదలైంది.
అప్ డేట్ అవ్వాలి
రాజకీయ వార్తలు చదవాలంటే ఓ పేపర్. బిజినెస్ న్యూస్ కావాలంటే ఇంకో పేపర్. సినిమా సంగతులు తెలియాలంటే మరో మేగజైన్. ఫ్యాషన్ కోసం ఒకటి.. ఇంటీరియర్ కోసం మరొకటి. ఇలా ఎన్ని పేపర్లని కొనాలి. ఎన్ని మేగజైన్లని తెప్పించుకోవాలి. ఇవన్నీ మన అరచేతిలో ఇమిడిపోతే... అప్పుడు వచ్చింది అతనికి ఓ ఐడియా. అది జీవితాన్ని మార్చేసింది. ఈ ఐడియా ఏదో బావుంది. డిజిటల్ మీడియాకాలంలో కూడా అన్నేసి పేపర్లు, మేగజైన్లు కొనడమేంటి? అప్ డేట్ అవ్వాలి. ఆ దిశగా ఆవిష్కరణలు జరగాలి. ఐడియాలన్నీ ఏ కంప్యూటర్ లాబొరేటరీల్లోనో జరుగుతాయనుకుంటే పొరపాటే. కొన్ని కొన్ని ఇన్నోవేషన్స్ ఏ మాస్టర్ డిగ్రీ లేకున్నా బుర్రలో తళుక్కున మెరుస్తాయి. అలాంటి కథే ఇదే.
ఒకే ఒక్క యాప్తో
వెంకట కార్తీక్ రాజా అని 18 ఏండ్ల కుర్రాడు. మన తెలుగువాడే కాకపోతే బెంగుళూర్లో సిర్థపడిన ఫ్యామిలీ. సో ఇప్పుడు అతడు బెంగళూరుకు చెందిన కార్తీక్ రాజాగా మాట్లాడుకుంటున్నాం. ఇతనికి వచ్చిన ఆలోచన నిజంగా అరచేతిలో అద్భుతాన్నే సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంటా 400 దిన, వారపత్రికలను కండ్ల ముందుంచింది. ఒకే ఒక మొబైల్ యాప్ వందలాది న్యూస్ పేపర్లను దినపత్రికలను ఏకతాటిపైకి తెచ్చింది. అది కూడా రియల్ టైంలో చదువుకునేలా చేసింది.
యువతపైనే దృష్టి
పేపర్ బోయ్ మొబైల్ యాప్ క్రియేట్ చేయాలన్న ఆలోచన కార్తీక్కు కాలేజీ డేస్లోనే వచ్చింది. అతని ఆలోచనకు తల్లిదండ్రుల మద్దతు కూడా లభించింది. అలా ఇద్దరితో మొదలైన కార్తీక్ రాజా ప్రయాణం నేడు యాభై మందికి చేరింది. ముందుగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలపై ఫోకస్ చేశాడు. ఎందుకంటే దేశంలోని జనాభాలో అధిక జనాభా ఈ సిటీల్లోనే ఉంటారు కాబట్టి. అయితే అతని టార్గెట్ ప్రజలందరూ కాదు. ముందు యువతరం ఈ వైపు రావాలనే అభిలాష అతనిది.
పేపర్ బాయ్ యాప్
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ దినపత్రికలతో సహా అనేక మేగజైన్లకు ఒక ప్లాట్ ఫాం క్రియేట్ చేశాడు. డిజిటల్ విప్లవం స్ఫూర్తితో యాప్ తయారు చేశాడు. దానికి పేరు ఏమి పెట్టాలని ఆలోచిస్తుంటే ... ఉదయమే అందరికి పేపర్ అందించే పేపర్ బోయ్ కండ్ల ముందు మెదిలాడు. అంతే 'పేపర్ బాయ్' అని తన యాప్కి పేరుపెట్టాడు. ఫిబ్రవరి 2016 లో కార్తిక్ పేపర్ బాయ్ ని ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం 2017 అక్టోబర్ నుంచి అందుబాటులోకి వచ్చింది. వార్తాపత్రికలతో మాట్లాడి ప్రచురణలు ఎలక్ట్రానిక్ రూపాలను అందించడానికి, ప్రచురణలతో ఒప్పించటానికి ఈ టీంకు ఆరు నుంచి ఏడు నెలలు పట్టింది. చివరికి కార్తిక్ పోరాటం ఫలించింది. ప్రస్తుతం 400 భారతీయ వార్తాపత్రికలు, 250 మ్యాగజైన్ల డిజిటల్ ప్రచురణలను అందించే ఏకైక వేదికయింది 'పేపర్ బోయ్'. ఇప్పటికే ఐఓస్, యాండ్రాయిడ్ వెర్షన్లో అందుబాటులో వుంది. వెబ్ మోడల్ కూడా చూడొచ్చు. ఇందులో ఎలాంటి పత్రికైనా, మేగజైన్ అయినా మొబైల్లో క్షణాల్లో చూసుకోవచ్చు.ఈ 'పేపర్ బోయ్' యాప్ని విశ్వవ్యాప్తం చేయడమే అతని లక్ష్యం.
పురస్కారాలు
ఇండియాలోనే తొలి వార్తాపత్రిక అగ్రిగేటర్గా ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షరు కుమార్ నుంచి అవార్డు అందుకున్నారు. అలాగే బెస్ట్ స్టార్టప్ అవార్డు కూడా అందుకున్నారు.
నాన్నే ఆదర్శం ఇప్పుడు కార్తీక్ వయసు 21. సాధారణంగా ఏవరైనా చిన్న వయసులోనే ఓ స్థాయికి వస్తే అక్కడితో చదువుకు స్వస్తి చెప్పేస్తారు. కానీ మన హీరో అలా చేయలేదు. ఎందుకంటే అతడికి చదువు విలువ తెలుసు. ''నేను రోజూ కళాశాలకు వెళ్ళి సాయంత్రం ఆఫీస్కు వెళ్తాను. నేను ఏవైనా ఇతర పనులతో ఆఫీస్కు వెళ్ళలేకపోతే నాన్న విజరు భాస్కర్, మా అక్కనే అన్నీ చూసుకుంటారు. మాకంపెనీలో మా కుటుంబ సభ్యులే భాగస్వాములు. నాన్న చిన్న ముత్యాల షాప్ పెట్టంకుని మమ్మల్ని ఇంతటి వాళ్లను చేశారు. అంచెలంచెలుగా ఎదిగిన నాన్న జీవితమే మాకు ఆదర్శం. నాన్న, పెద్దనాన్న వేణుగోపాల్ అందించిన సహకారం నా ఈ చిన్న ఆలోచనకి పురుడుపోసింది. నేను నా సొంత సంస్థ కోసం కృషి చేస్తాను'' అంటున్నాడు కార్తీక్.
ఆదరణ ఎలా ఉందంటే...
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 దేశాల వారు 'పేపర్ బారు' యాప్ను వాడుతున్నారు. మొత్తంగా 1.2మిలియన్ ప్రజలు దీన్ని ఉపయోగించుకుంటున్నారని సంతోషంగా చెప్తున్నాడు కార్తీక్. ముఖ్యంగా తెలంగాణలో మంచి ఆదరణ ఉన్న ఈ యాప్కి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో కూడా యువత విశేషంగా తమ మొబైల్స్లో ఈ యాప్ను డౌన్ లోడ్ చేసుకున్నారని హ్యాపీగా చెప్తున్నాడు. ''మరి ఈ యాప్ను ఇంతగా అదరిస్తున్న యువత నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్నారు కదా, కొంతమందికైనా ఉపాధి కల్పిస్తారా?' అని అడిగితే 'అది మా బాధ్యత బాస్ తప్పని సరిగా కొంత మందికి మేం ఉపాధి కల్పిస్తాం' అని నిగర్వంగా చెప్తున్నాడు కార్తీక రాజు.