Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిక్కా హరీష్ కుమార్ ... చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన సర్ లూయిస్ బ్రెయిలీ ఇతని స్ఫూర్తి ప్రధాత. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని ఆరు చుక్కల రాత, ఆరచేతి కర్ర ఆధారంగా చేసుకుని రాజ్యాంగంలో వికలాంగులకు వాటా కావాలని నినదిస్తున్న యువగొంతుక. తమ జాతి హక్కుల కోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరినైనా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉండే ధిశాలి. ఇప్పుడు ఓ సామాజిక శక్తిగామారి తనలాంటి వికలాంగులకే కాక యావత్ యువతకే స్ఫూర్తి దాయకమయ్యాడు ''నేను అంధ పుష్పాని - ఈ సమాజానికి ఆణిముత్యాన్ని'' అని సగర్వంగా చెప్పుకున్న ఆ యువకెరటం గురించి ఈ వారం జోష్లో...
సుజాత, రంగనాయకులు దంపతులు మహబూబ్నగర్ జిల్లా, జడ్చర్లలో చిన్న కిరాణా షాప్ పెట్టుకుని జీవించేవారు. వీరికి ఇద్దరు బిడ్డలు, ఓ కొడుకు. ఆ కొడుకే చిక్కా హరీష్ కుమార్. ఇంట్లో ఒక్క బిడ్డ సరిగా పుట్టకపోతేనే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అలాంటిది ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలు చూపు లేకుండా పుట్టారు. ఇక ఆ కన్నవారి మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఈటెల్లాంటి మాటలు వింటూ...
ఆ ఇంటి పెద్ద బిడ్డ రాధిక మామూలుగానే పుట్టింది. అయితే రెండో బిడ్డ అవంతి, ఆ తర్వాత పుట్టిన హరీష్ మాత్రం చూపు లేకుండా జన్మించారు. పిల్లలకు చూపు తెప్పించేందుకు కన్నవాళ్ళు ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. కానీ ఫలితం లేదు. దాంతో ఇంటికి వచ్చిన బంధువులు ''అయ్యో.. ఇంట్లో ఇద్దరు గుడ్డోళ్ళు ఉన్నారు. వాళ్ళను జీవితాంతం మీరే చూసుకోవాలి. భరించాలి'' అంటూ ఆ పసి వాళ్ళ ముందే జాలిగా మాట్లాడే వాళ్ళు. వయసు పెరిగేకొద్ది ఆ మాటలే ఆ పసి హృదయాలను ఈటెల్లా గుచ్చేవి. ఆ మాటలే హరీష్లో పట్టుదలను పెంచాయి. తనేంటో నిరూపించుకునేలా చేశాయి. బయట వాళ్ళు ఎగతాళి చేసినా కన్నవాళ్ళు మాత్రం వీరికి తోడుగా నిలబడ్డారు. ప్రతి విషయంలో ప్రోత్సహించే వారు. దాంతో ఇద్దరూ అన్నింట్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు.
అన్నింట్లో ఉత్సాహంగా
మహబూబ్నగర్లోని అంధుల పాఠశాలలో అవంతి ఐదో తరగతి, హరీష్ ఒకటో తరగతిలో చేరారు. తమలాగే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంధులే కాబట్టి అక్కడ వాళ్ళకు ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. పైగా హరీష్కైతే మొదటి నుండి బ్రెయిలీ లిపిలో చదువుకునే అవకాశం వచ్చింది. ఒక్క చదువులోనే కాక అన్నింట్లో ముందుండేవాడు. చెస్ ఆడేవాడు. మూడో తరగతిలో ఉన్నప్పుడే వేదికలు ఎక్కి ఉపాధ్యాయులు రాసిన కవితలు చదివి వినిపించే వాడు. అలా హరీష్కు కూడా సాహిత్యం పట్ల ఆసక్తి పెరిగింది.
ఎగతాళి చేసిన వారే...
ఈటెల్లాంటి మాటలు హరీష్లో కసిని పెంచాయి. ఒకరిపై ఆధారపడ కుండా బతకాలనే కోరిక అతనిలో బలంగా ఉండేది. అందుకే పది పూర్తి చేసి హైదరాబాద్లోని ఆలియా కాలేజీలో ఇంటర్ కోసం చేరాడు. అప్పుడే మొదటి సారి తోటి విద్యార్థుల వివక్షకు గురయ్యాడు. 'వస్తున్నార్రా గుడ్డి బ్యాచ్' అనే మాటలకు తన తెలితేటలతోనే సమాధానం చెప్పేవాడు. సాధారణ విద్యార్థులందరూ పరీక్షలు రాస్తే హరీష్ మాత్రం అధ్యాపకులు అడిగిన ప్రశ్నలన్నింటికీ క్లాస్ రూంలోనే చక్కటి సమాధానాలు చెప్పి అందరి మన్నలను పొందాడు. హరీష్ తెలివితేటలు చూసి అధ్యాపకులు, తోటి విద్యార్థులు ఆశ్చర్యపోయేవారు. ఎగతాళి చేసిన వారే తర్వాత స్నేహితులైపోయారు.
చరిత్ర సృష్టించాడు
ఇంటర్ తర్వాత అవంతి డిగ్రీ పూర్తి చేసి మహబూబ్నగర్ కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగం సంపాదించింది. హరీష్ మాత్రం ఇంటర్ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్(ఐయంఏ) కోర్సు కోసం ఎంట్రన్స్ రాశాడు. జనరల్ కోటాలో ఆలిండియా టాపర్గా నిలిచి 2013లో ఆ కోర్సు పూర్తి చేశాడు. ఆ తర్వాత టీపీటీ తెలుగు పండిట్ చేశాడు. అలాగే జాతీయ స్థాయిలో నిర్వహించే జెఆర్ఎఫ్, ఆర్జీఎఫ్లో రెండింటిలో ఒకేసారి ఉత్తీర్ణత సాధించిన మొదటి వికలాంగుడిగా చరిత్ర సృష్టించాడు. అలాగే రాష్ట్ర స్థాయిలో టెట్ కూడా సాధించాడు. సెంట్రల్ యూనివర్సిటీలోనే ఎమ్మే తెలుగులో చేరాడు.
సమస్యల పరిష్కారం కోసం
ఎమ్మే చేస్తున్నప్పుడు తన లాంటి వారి సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘంలో చేరాడు. అంధుల కోసం ప్రత్యేక లైబ్రరీతో పాటు, రెండు బ్రయిలీ ప్రింటర్స్ ఏర్పాటు చేసేలా కృషి చేశాడు. అలాగే అన్ని బిల్డింగ్స్లో రామ్స్ ఏర్పాటు చేయించారు. యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ప్యానల్ అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ సభ్యుడుగా కూడా పని చేశాడు. అదే సమయంలో అంధులు ఓటు వేసేందుకు ఒకరిపై ఆధారపడకుండా బ్రెయిలీ బ్యాలెట్ పద్ధతిని పోరాడి సాధించారు. ఇదే పద్ధతి ప్రస్తుతం దేశంలోని అన్ని యూనివర్సిటీలో ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతున్నది.
సాహిత్యంతో ప్రయాణం
చిన్నతనం నుండే సాహిత్యం పట్ల కూడా ఆసక్తి ఉన్న హరీష్ నాలుగో తరగతిలోనే ఓ అద్భుతమైన కవితను రాశాడు. అది గమనించిన ఉపాధ్యాయులు, ఆ తర్వాత అధ్యాపకులు, స్నేహితులు ఇతన్ని ఎంతో ప్రోత్సహించారు. అప్పటి నుండి సాహిత్యంతో అతని ప్రయాణం కొనసాగుతూనే ఉంది. అలాగే సమాజం పట్ల అవగాహన పెంచుకునేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏ సెమినార్ జరిగినా వదలకుండా వెళ్ళేవాడు.
జాడ కోసం వెదుకుతూ...
ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్న హరీష్ తెలుగు వికలాంగుల సాహిత్యం జాడ ఎక్కడని వెదుకులాట మొదలెట్టాడు. ఓ ప్రొఫెసర్ ఇచ్చిన ప్రోత్సాహంతో 2011 జనవరిలో 'అంధుల వెలుగు ప్రదాత' అనే పేరుతో లూయిస్ బ్రెయిలీ జీవితాన్ని చిన్నపుస్తకంగా తీసుకువచ్చాడు. ఆ తర్వాత తను రాసుకున్న కవితలన్నింటినీ 'నేనైతే వికలాంగున్నే' అనే పుస్తకాన్ని 2013లో ఎమ్మే సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ప్రచురించాడు. అలాగే వికలాంగుల హక్కులకై, ఆత్మగౌరవాన్ని తెలియజేస్తూ వివిధ పత్రికల్లో ఎన్నో వ్యాసాలు రాస్తున్నాడు. అలాగే వికలాంగుల సమస్యలపై 2015లో విడుదలైన 'మేము సైతం' అనే ఓ కథా సంపుటికి హరీష్ సంపాదకత్వం వహించాడు.
అసిస్టెంట్ మేనేజర్గా...
హరీష్ టాలెంట్కు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు వెదుక్కుంటూ వచ్చాయి. అయితే వికలాంగుల సమస్యలపై గళమెత్తడం, ఎప్పటికైనా పీహెచ్డీ చేయడం అతని బలమైన కోర్కెలు. అందుకే ఆ ఉద్యోగాలను వదులుకున్నాడు. అయితే కొన్ని రోజులకే తల్లి పక్షవాతం బారిన పడటంతో ఇంటి ఆర్థిక సమస్యలు అర్థం చేసుకుని దీనా బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగంలో చేరినంత మాత్రాన తన ఆశలను, ఆశయాలను, సాహిత్యాన్ని వదులుకోలేదు. ఉద్యోగం చేస్తూనే ప్రస్తుతం తెలుగు యూనివర్సిటీలో 'వికలాంగుల సాహిత్యం- సామాజిక చైతన్యం' అనే అంశంపై పార్ట్టైం పీహెచ్డీ చేస్తున్నాడు.
వికలాంగుల సమస్యలపై
2007 నుండి వికలాంగుల ఉద్యమాల్లో హరీష్ చురుగ్గా పాల్గొంటున్నాడు. 2011లో తమలాంటి వారి సమస్యలపై ఎంతో కృషి చేస్తున్న ఎన్పీఆర్డీతో పరిచయమయింది. అప్పటి నుండి అందులో కూడా పని చేస్తున్నాడు. ఎక్కడ అవకాశం వచ్చిన తన వారి సమస్యలను గొంతెత్తి వినిపిస్తున్నాడు. చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాడు. తను ఈ స్థాయిలో ఉండటానికి స్కూల్లో ఓ.రాములు సార్, ఆ తర్వాత లయన్స్ క్లబ్కు చెందిన నట్రాజుగార్లే కారణమని వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాడు హరీష్.
చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి
మాపై ఎవ్వరూ జాలిపడాల్సిన అవరం లేదు. మనుషులుగా గుర్తిస్తే చాలు. చట్ట సభల్లో మాకు రిజర్వేషన్లు కల్పించాలి. పాలకులు వికలాంగులకు ఐదు వేలు, మూడు వేలుపెన్షన్లు ఇస్తామంటూ పోటీ పడుతున్నారు. ఇది ఏ మూలకు సరిపోతుంది. అదే ఉపాధి కల్పిస్తే ఆత్మగౌరవంతో బతుకుతాం. మాకు న్యాయం జరగాలంటే చట్ట సభల్లో అడుగుపెట్టడమే పరిష్కారం. అందుకే ఎప్పటికైనా ఎమ్మెల్యేగానో, ఎంపీగానో పోటీ చేయాలి. అదే నా జీవితాశయం.
సమాజాన్ని అర్థం చేసుకోవాలి
నేటి యువత తాము కోరుకుంది దక్కకపోతే భరించలేక చావటానికి, చంపటానికైనా సిద్ధమవుతున్నారు. ఈ ధోరణిలో మార్పు రావాలి. కష్టపడే తత్త్వం పెంచుకోవాలి. సమాజాన్ని అర్థం చేసుకోవాలి. సినిమాల్లో ఉన్నట్టు నిజ జీవితంలో ఉండదని గుర్తించాలి. కుటుంబం పట్ల, సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి. మరీ ముఖ్యంగా అమ్మాయిలను గౌరవించాలి. మనిషిని మనిషిగా గుర్తించాలి.
అధ్యయనం వల్లనే...
యూనివర్సిటీలో ఉన్నప్పుడే సమాజం గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేశా. మార్స్కిజం, అంబేద్కరిజం, కమ్యూనిజం, లెనినిజాన్ని అధ్యయనం చేశా. అంపశయ్య నవల నన్ను ఎంతో ప్రభావితం చేసింది. వీటన్నింటి ఫలితంగా అభ్యుదయ భావాలు అలవర్చుకున్నా. మా సమస్యలతో పాటు సమాజం గురించి ఓ అవగాహన వచ్చింది. ఏ వేదికపై మాట్లాడే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకుంటాను.
- సలీమ