Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయిలో కాబోయే బావను కత్తితో పొడిచిన బావమరిది... ఢిల్లీలో ఓ యువకుడు తన సోదరిని కత్తితో పొడిచి చంపాడు ... జమ్మూలో ఓ ఫిట్నెస్ ట్రైనర్ పిచ్చివాడైపోయాడు... ఇవన్నీ పాత కక్షలతోనో లేక వ్యక్తిగత సమస్యలతోనే జరిగిన ఘోరాలు కాదు. కేవలం ఓ ఆన్లైన్ క్రీడ వల్ల జరిగిన దుర్మార్గాలు.. 2018లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ ఆట ఇప్పుడు యువత ప్రాణాలమీదకు వచ్చింది. అందుకే చాలా మంది తల్లి దండ్రులు ఈ గేమ్ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యువతను ఇంతలా బానిసలుగా మార్చుకున్న ఆ ఆట సంగతులేంటో చూద్దాం...
- పబ్జీ... ఈ గేమ్ ఆడుతున్న వ్యక్తులు పిచ్చివాళ్లలా ప్రవర్తి స్తున్నారు. అంతేకాదు అడేటప్పుడు మధ్యలో ఎవరైనా కదిలిస్తే హత్యలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. అంతటి భయంకరమైన ఆట ఇది.
పిచ్చివాడయ్యాడు
ఈ గేమ్కు బానిసలైన యువత ఇంట్లో మాత్రమే కాదు బస్సుల్లో, రైళ్లల్లో, రోడ్డు మీద, ప్లాట్ఫామ్పై ఎక్కడ పడితే అక్కడ ఆడుతూ ఫోన్కు అతుక్కుపోతున్నారు. చివరకు పబ్జీ గేమ్ ఓ అడిక్షన్లా మారిపోయింది. ఎంతలా అంటే... జమ్మూలో ఓ ఫిట్నెస్ ట్రైనర్ పబ్జీ అడిక్షన్తో పిచ్చివాడైపోయాడు. చివరకు అతన్ని ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. అతను వరుసగా పది రోజుల పాటు పబ్జీ ఆడాడట. ఒక రౌండ్ పూర్తి చేయగానే తనను తాను గాయపర్చుకుంటూ, పిచ్చిపిచ్చిగా అరుస్తుంటే ఇంట్లోవాళ్లంతా కంగారుపడ్డారు. ఏం జరిగిందని ఆరా తీస్తే పబ్జీ మొబైల్ గేమ్కు అడిక్ట్ కావడం వల్ల చివరికి ఇలా పిచ్చిపట్టినట్టు తేలింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. జమ్మూలో ఇలాంటివి ఆరు ఘటనలు జరిగాయట. అందుకే ఆ ప్రభుత్వం పబ్జీని నిషేధించింది.
కత్తితో దాడి చేశాడు
ముంబయికి చెందిన రజనీష్ రాజ్భర్ పబ్జీ గేమ్ ఆడుతుండగా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలని ఛార్జర్ కోసం వెతుకుతుండగా వైర్ తెగిపోయి కనిపించింది. అయితే తనను పబ్జీ గేమ్ ఆడుతున్నానని నిత్య కోప్పడే తన సోదరే ఇదంతా చేసిందని ఆమె ల్యాప్టాప్ వైర్ కత్తిరించేశాడు. ఆ సమయంలో ల్యాప్టాప్ను తన సోదరికి కాబోయే భర్త ఓమ్ బావ్డంకర్ ఉపయోగిస్తున్నారు. విషయం తెలుసుకున్న బావ్డంకర్.. రజనీష్పై కోప్పడ్డాడు. పబ్జీ ఆడుతూ వ్యాపారాన్ని సరిగా చూసుకోవట్లేదంటూ చీవాట్లు పెట్టాడు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన రజనీశ్ కత్తితో ఓమ్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి.
చైనా సమీక్షించింది
పబ్జీ... మిలిటరీ స్టైల్ షూటర్ బ్యాటిల్ రాయల్ గేమ్. ఇందులో 100 మంది ప్లేయర్స్ని యుద్ధక్షేత్రంలో వదిలేస్తారు. అందులో అందరూ అందరితో యుద్ధం చేస్తుంటారు. చివరకు ఎవరు మిగిలితే వాళ్లే విజేత. ప్రస్తుతం పబ్జీ గేమ్ పీసీ, ఎక్స్బాక్స్ వన్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లల్లో అందుబాటులో ఉంది. పబ్జీ ఆటకు మన దగ్గర రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ఈ గేమ్కు అనేకమంది అడిక్ట్ అవుతున్నారు. ఇటీవల వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తమ కాలేజీ, హాస్టల్ ఆవరణలో పబ్జీ మొబైల్ ఆడకూడదంటూ నిషేధించారు. 2018 డిసెంబర్లో చైనాలో ఆన్లైన్ గేమింగ్ ఎథిక్స్ రివ్యూ కమిటీ 20 గేమ్స్ని సమీక్షించింది. అందులో తొమ్మిది గేమ్స్ ప్రమాదకమై నవిగా గుర్తించింది. వాటిలో పబ్జీ, ఫోర్ట్నైట్ ఉన్నాయి.
20 కోట్ల మంది...
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది ఈ ఆట ఆడుతున్నారు. ఇందులో సుమారు 4 కోట్ల మంది యాక్టివ్గా ఉంటున్నారు. మొన్నటి వరకు పోకేమాన్ అంటూ రోడ్డున పడ్డ యువత.. ఆ తర్వాత బ్లూవేల్కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టారు. నెమ్మదిగా దాని పీడ వదిలింది కదా అనుకుంటే మొమో సూసైడ్ ఛాలెంజ్ మరోసారి వణికించింది. తాజాగా 'పబ్జీ' అంటూ వచ్చిన ఈ గేమ్.. యువతను పిచ్చివాళ్ళను చేస్తున్నది.
రణరంగంలో ఉన్నట్టే
పబ్జీ అంటే 'ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్' అని అర్థం. దక్షిణ కొరియాలోని ఓ గేమింగ్ సంస్థ ఈ మల్టీ ప్లేయర్ గేమింగ్ యాప్ను రూపొందించింది. ఈ గేమ్ ఆడాలంటే పబ్జీ యాప్ను మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ తర్వాత ఐడీ లభిస్తుంది. అయితే ఈ ఆటను సింగిల్గా
కాకుండా జట్టుగా ఆడితేనే మజా. దీంతో కొంతమంది టీమ్ లుగా ఏర్పడి మరీ ఆడుతున్నారు. ఈ గేమ్ ఆడేవారు ఆటలో సైనికులుగా మారిపోతారు. ఆ తర్వాత వందకు పైగా శత్రువులతో పోరాడాల్సి ఉంటుంది. ఒకసారి ఆట మొదలైందంటే రణరంగంలో ఉన్నట్టే. అప్రమత్తంగా లేకపోతే శత్రువులు చంపేస్తారు. దీంతో ఈ ఆట ఆడేవారు పరిసరాలను మరిచిపోయి అందులో లీనమైపోతారు.
బయటపడడం కష్టం
ఈ ఆటలో లీనమైతే మళ్లీ బయటకు రావడం కష్టమే. పైగా గ్రూప్తో కలిసి ఆడినప్పుడు మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఆట ఆడేవారు తమని తాము సైనికులుగా భావిస్తారు. అందులో శత్రువుల నుంచి తప్పించుకోడానికి బంకర్లు కూడా ఉంటాయి. బాంబులు, గన్లు ఇలా రకరకాల ఆయుధాలు ఉంటాయి. ఇది గ్రూప్ గేమ్ కావడంతో ఆ ఆటలో యుద్ధం చేస్తుంది తామే అనే అంతగా ఫీలింగ్ ఏర్పడుతుంది. బైకులు, కార్లు, బోట్లలో తిరుగుతూ దాడులు చేస్తారు. అలా ఆ వంద మందిలో ప్రాణాలతో మిగిలే వారే విజేతలుగా నిలుస్తారు. ఈ ఆటలో ఒక్కసారి చనిపోతే గేమ్ పూర్తయినట్లే. అయితే యుద్ధంలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో చాలామంది పదే పదే ఈ ఆటను ఆడుతున్నారు.
ఆరోగ్య సమస్యలు...
ఈ ఆట ఆడుతున్న సమయంలో వారు ఎవరినీ పట్టించుకోరు. గేమ్ నుంచి దృష్టి మరల్చితే శత్రువులు చంపేస్తారనే భయంతో పరిసరాలను మరిచిపోతున్నారు. ఆ సమయంలో ఎవరైనా ఫోన్ చేసినా, పిలిచినా పట్టించుకోరు. ఎవరైనా డిస్ట్రబ్ చేస్తే అసహనం ప్రదర్శిస్తారు. కొంతమంది కోపంతో ఊగిపోతారు. ఈ ఆటకు బానిసలైన యువత నిద్రలేమి, కంటి సమస్యలతో బాధపడతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఒకే చోట కూర్చొని ఉండటం వల్ల నరాల సంబంధిత వ్యాధులకు గురవ్వుతున్నారు. కోపం, చిరాకు, హింసాత్మక ప్రవర్తన అలవడటంతో పాటు చదువులో ఏకాగ్రత లోపిస్తోంది.
నిషేధం విధించాయి
రోజుకు 8 నుంచి 10 గంటలు ఆడడం వల్ల జీవితంలో అన్ని పనులను వదులుకునే స్థాయికి దిగజారుతున్నారు. దీంతో కొన్ని రాష్ట్రాలు ఈ గేమ్పై నిషేధం విధించాయి. గుజరాత్ ప్రభుత్వం స్కూళ్లలో ఈ ఆటను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులను స్కూళ్లకు స్మార్ట్ ఫోన్లు తీసుకెళ్లరాదని ఆదేశించింది. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) సైతం ఈ గేమ్పై నిషేధం విధించింది. మహారాష్ట్ర హైకోర్ట్ కూడా ఈ గేమ్ను నిషేధించింది. దేశవ్యాప్తంగా ఈ గేమ్పై నిషేధం విధించాలని, ఆ ఆట సర్వర్ లింక్లను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే పబ్జీ గేమ్ను నిషేధించలేదంటూ దానికి సంబంధించిన వారు ప్రకటిస్తున్నారు.
- సలీమ