Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేయూతనివ్వాల్సిన తండ్రి చేతులు దులుపుకున్నాడు.. తినేందుకు తిండి లేదు.. ఆదరించే దిక్కు లేదు.. చివరకు కాలం కూడా అతనిపై పగబట్టింది. ఫలితంగా ఏడేండ్ల వయసులో చూపుపోగొట్టుకున్నాడు. కానీ ఎవరి ముందూ చేయి చాచలేదు. ఒకరి సాయం కోసం ఎదురు చూడలేదు. స్వశక్తితో ముందుకు సాగాడు. క్రికెట్పై ప్రాణం పెట్టుకున్నాడు. అందులోనే రాణించాలని అనుకున్నాడు. అతని పట్టుదలను చూసి ఓ ఎన్జీఓ సాయం చేసింది. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో దూసుకుపోతున్నాడు. వరల్డ్ కప్ సాధించుకొచ్చాడు. తనలాంటి యువతకు ఆదర్శంగా నిలిచాడు. అతనే బ్లైండ్ క్రికెటర్ గుంజ మధు. అతని గురించి మరిన్ని విశేషాలు ఈ వారం జోష్లో...
మా సొంతూరు నల్లగొండ జిల్లాలోని మల్లాపూరం గ్రామం. చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే పిచ్చి. ఐదో తరగతి వరకు ఊళ్ళోనే చుదువుకున్నా. ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడేవాడిని. టీవీలో మ్యాచ్లు బాగా చూసేవాడిని. నాకు ఏడెనిమిదేండ్లప్పుడు ఆడుకుంటుంటే బాణం పుల్ల కుడి కంటి గుడ్డుకు తాకింది. ముల్లు అందులోనే ఉండిపోతే హైదరాబాద్లోని సరోజనీ కంటి ఆస్పత్రిలో ఆపరేషన్ చేసి తీసేశారు. అయితే కంటి చూపు రాదన్నారు. అప్పటి నుండి కుడి కన్ను అస్సలు కనిపించదు. దీని ప్రభావం ఎడమ కంటిపై కూడా పడింది. ఇప్పుడు ఎడమ కన్ను 40 శాతం మాత్రమే కనిపిస్తుంది. ఇక నార్మల్ స్కూల్లో చదువుకోవడం కష్టం. మాకు తెలిసిన టీచర్ నన్ను హైదరాబాద్ ఓల్డ్సిటీ లోని ఓ బ్లైండ్ స్కూల్లో చేర్పించారు. అక్కడే హాస్టల్లో ఉండి బ్రెయిలీ లిపిలో చదువుకున్నా.
ముగ్గురూ మూడు చోట్ల
మా అమ్మ అలివేలు. నాన్న అంజయ్య. నాకు ఓ చెల్లి ఉంది, పేరు మాధురి. మా నాన్న మా చిన్న తనంలోనే అమ్మకు విడాకులు ఇచ్చి వేరే పెండ్లి చేసుకున్నాడు. అప్పుడు చెల్లి చాలా చిన్నది. మా ఇద్దరినీ అమ్మనే చూసుకునేది. తిండికి కూడా కష్టమయ్యేది. చూపు పోయిన తర్వాత నేను హాస్టల్లో చేరాను. తర్వాత అమ్మకు డిజబుల్ డిపార్ట్మెంట్ ద్వారా ఓ డిజబుల్ హాస్టల్లో పని దొరికింది. అమ్మ అదే హాస్టల్లో ఉండి పని చేసుకుంటూ అక్కడే ఉండేది. చెల్లి మాత్రం చిన్న పిల్ల కావడంతో కొంత కాలం అమ్మమ్మ దగ్గర ఉంది. తను కాస్త పెరిగిన తర్వాత కొత్తపేటలోని ఓ ఆశ్రమ పాఠశాలలో ఒకటో తరగతి చేర్పించాం. పదో తరగతి వరకు అక్కడే ఉండి చదువుకుంది. అలా నేనొక దగ్గర, అమ్మ, చెల్లి ఒక దగ్గర చాలా కాలం ఉండిపోయాం.
ఆర్థిక సమస్యల వల్ల
చూపు పోవడంతో నాకెంతో ఇష్టమైన క్రికెట్ ఇక ఆడలేనేమో అని బాధపడ్డాను. అయితే నేను చదివే స్కూల్లో బ్లైండ్ క్రికెట్ ఉందని తెలిసింది. మా స్కూల్లోనే పిల్లలందరం సాయంత్రం పూట సరదాగా ఆడుకునేవాళ్ళం. ఏడో తరగతి నుండి ఆడటం మొదలుపెట్టాను. స్కూల్ లెవల్ పోటీల్లో ఆడే వాడిని. 2008లో ఇంటర్కి వచ్చాను. అప్పుడే స్టేట్ టీమ్కు సెలక్ట్ అయ్యాను. అప్పటి నుండి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. డిగ్రీ చేద్దామంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అందుకే డిగ్రీ దూర విద్య ద్వారా చదువుతూ ఐడియా కాల్ సెంటర్లో జాబ్లో చేరాను. నేను జాబ్లో చేరిన తర్వాత చిన్న రూం తీసుకొని అమ్మా, నేనూ ఉండేవాళ్ళం.
ఎన్జీఓ సాయంతో
క్రికెట్ ఆడటానికి ఖర్చులు మొత్తం × aఅస జుyవ అనే ఎన్జీఓ వాళ్ళు చూసుకునేవారు. దీని ఫౌండర్ కిరణ్. ఈయన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. నేను స్కూల్లో ఉన్నప్పటి నుండి వీళ్ళు మాలాంటి వాళ్ళుకు చాలా సాయం చేసేవారు. నేను క్రికెట్ టోర్నమెంట్స్ మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్నీ వీళ్ళే చూసుకునేవారు. ఆ తర్వాత 2014లో వరల్డ్ కప్ సమయంలో ఇండియా టీమ్కు సెలక్ట్ అయ్యాను. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ నుండి ఇండియా టీంకి సెలక్ట్ అయిన క్రికెటర్ని నేనే.
వరల్డ్ కప్పు కొట్టిన సమయం
వరల్డ్ కప్ అప్పుడు సౌత్ ఆఫ్రికాలో జరిగింది. దీనికి వెళ్ళే ముందు ఒరిస్సాలో కోచింగ్ క్యాంప్ జరిగింది. అప్పుడు కూడా ఎన్జీఓ నుండి ఏడీసీ కంపెనీ ద్వారా నాకు 60, 70వేలు ఖర్చు అయితే వాళ్ళే చూసుకున్నారు. సౌత్ ఆఫ్రికా వెళ్ళేటప్పుడు బ్లైండ్ నేషనల్ క్రికెట్ బోర్డు వాళ్ళు సెంట్రల్ స్పోర్ట్స్ డిపార్మెంట్ వారిని కలిశారు. వారి నుండి మా టీంకు ట్రావెలింగ్ కోసం 25 లక్షలు ఇచ్చారు. గెలిచి వస్తే ఇంకా సాయం చేస్తామన్నారు. అది వన్ డే మ్యాచ్. కప్పు గెలుచుకొని వచ్చాము. మేము తిరిగి ఇండియాకు వచ్చేటప్పుడు సెంట్రల్ మినిష్టర్ స్వయంగా ఎయిర్పోర్ట్కు వచ్చి స్వాగతం పలికారు. వాళ్ళే ప్రధానమంత్రి మోడీ అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారు. ఆయన మాతో 20నిమిషాలు గడిపారు. మేమ ఆటోగ్రాఫ్ అడిగితే ''ఇప్పుడు మీరే సెలబ్రెటీలు'' అని మా క్రికెట్ బాల్పైన మా అందరి సంతకాలు తీసుకొని దాన్ని ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉంచారు. అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. సెంట్రల్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుండి ఐదు లక్షలు, సోషల్ వెల్ఫేర్ నుండి 2 లక్షలు మొత్తం ఏడు లక్షలు ఒక్కో క్రికెటర్కు ఇచ్చారు. అందులో నుంచి 2 లక్షలు మా నేషనల్ క్రికేట్ బోర్డుకు ఇచ్చాము. ఆ బోర్డు ప్రైవేట్ది. ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం ఉండదు. అందుకే మేము ఇచ్చాము.
అమ్మ ఇచ్చిన సపోర్ట్తో...
తిరిగి రాష్ట్రం వచ్చిన తర్వాత వారం రోజులు ప్రెస్మీట్లు ఏర్పాటు చేశారు. తర్వాత అంతా నార్మల్. వరల్డ్ కప్కు వెళ్ళే ముందు నేను జాబ్ చేస్తున్న కాల్ సెంటర్లో అన్ని రోజులు సెలవులు ఇవ్వమన్నారు. దాంతో ఏం చేయాలని ఆలోచిస్తుంటే ''నీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పైగా వరల్డ్కప్ అంటున్నావు. ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. నువ్వు వెళ్ళి ఆడిరా'' అని అమ్మ ధైర్యం చెప్పింది. అమ్మ ఇచ్చిన సపోర్ట్తో జాబ్కు రిజైన్ చేసి వెళ్ళాను.
ఒలింపిక్స్లో లేదని రిజక్ట్ చేశారు
వరల్డ్ కప్ నుండి వచ్చిన తర్వాత ఉద్యోగం లేదు. స్పోర్ట్ కోటాలో ఉద్యోగం ఇప్పిస్తారేమోనని ఎంతో మంది మంత్రుల దగ్గరకు తిరిగిగాను. కానీ ఎలాంటి సాయం అందలేదు. అయితే వరల్డ్ కప్ గెలిచి వచ్చినందుకు మూడు లక్షలు మంజూరు చేశారు. కానీ బ్లైండ్ క్రికెట్ ఒలింపిక్స్లో లేదని రిజక్ట్ చేశారు. దాంతో ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందలేదు. తర్వాత ఏడాది పాటు ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నాను. అప్పుడే × aఅస జుyవ ఫౌండర్ కిరణ్ సైగైన్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్గా జాబ్ ఇప్పించారు. అది చేసుకుంటూ బ్యాంక్ జాబ్కు ప్రిపేర్ అయ్యాను. వీళ్ళు టోర్మమెంట్లకు వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చేవారు. ఎనిమిది నెలల్లో పెద్దపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఆఫీస్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం అందులోనే చేస్తున్నా. ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి కాస్త పర్లేదు.
మాకూ వాళ్ళకు ఇదే తేడా
నార్మల్ క్రికెటర్స్కు మాకు కొద్దిగా తేడా ఉంటుంది. రూల్స్ మాత్రం ఒకటే. మేము బాల్ కింద నుండి వేస్తాము. మా బాల్లో గజ్జెలు ఉంటాయి. అది కింద నుండి వస్తుంటే శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని బట్టి కొడతాము. ఫీల్డింగ్ కూడా అంతే. టీమ్లో 11 మంది ఉంటే 4+3+4 అనే ఫార్మెట్ ఉంటుంది. టీమ్లో 4 గురు పూర్తిగా చూపులేని వాళ్ళు ఉంటారు. వీళ్ళను బి1 క్యాటగిరి అంటారు. తర్వాత బి2 క్యాటగిరిలో 4 మీటర్ల వరకు పూర్తి విజన్ ఉంటుంది. ఆ తర్వాత మసగ్గా కనిపిస్తుంది. వీళ్ళు 3 మెంబర్స్ కచ్చితంగా ఉండాలి. ఇక బి3 కేటగిరి. వీళ్ళు ఆరు మీటర్ల వరకు చూడగలరు. తర్వాత బ్లర్ అవుతుంది. 4 గురు మాత్రమే ఉండాలి. అంత కంటే ఎక్కువగా ఉండకూడదు. నేను డి3 క్యాటగిరిలోకి వస్తాను. బి2 వాళ్ళు 7 గురు అయినా ఉండొచ్చు. బి3 కేటగిరి వాళ్ళు లేకపోయినా మ్యాచ్ జరుగుతుంది. అలాగే పూర్తి బ్లైండ్ వాళ్ళు ఒక్క రన్ తీస్తే 2 రన్నులు యాడ్ అవుతాయి. 2 తీస్తే 4 అలా డబుల్ ఇస్తారు.
సపోర్ట్ చేస్తున్నారు
2015లో లండన్లో ఇండియా- ఇంగ్లాండ్ వన్ డే, టి20 మ్యాచ్ జరిగింది. అందులో గెలిచి వచ్చాను. గత డిసెంబర్లో హర్యానా వెళ్ళి వచ్చాను. నార్మల్ క్రికెట్లో రంజిత్ ట్రోఫీల్లాగా మాకు నాగేష్ ట్రోఫీ అని పెట్టారు. బ్లైండ్ క్రికెట్ను ప్రారంభించిన వ్యక్తి ఆయన. అందుకే ఆయన పేరుతో నాగేష్ ట్రోఫీ అని పెట్టారు. 2019 జనవరిలో కేరళ వెళ్ళి వచ్చాము. ప్రస్తుతం తెలంగాణ టీం వైస్ కెప్టెన్గా ఉన్నాను. బ్యాంక్లో కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మామూలుగా బ్యాంక్ ఉద్యోగులకు చేరిన ఏడాది వరకు సెలవులు ఉండవు. కానీ నేను ఇంటర్నేషనల్ ప్లేయర్ అని సపోర్ట్ చేస్తున్నారు. నాకు మొదటి నుండి సపోర్ట్ చేస్తున్న × aఅస జుyవ ఎన్జీఓ ఫౌండర్ కిరణ్, సైగైన్ కంపెనీవారికి, బ్యాంక్ మేనేజ్మెంట్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను.
అమ్మ సంతోషంగా ఉంది
బ్లైండ్ క్రికెటర్స్కి ఆర్థిక సహకారం చాలా తక్కువ. అందుకే ఈ క్రికెట్ వల్ల ఏలాంటి ఉపయోగం లేదు. మంచిగా జాబ్ చూసుకోవచ్చు కదా అనేవారు చాలా మంది. కానీ క్రికెట్ అంటే నాకు ప్రాణం. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఆటను మాత్రం వదిలిపెట్టలేదు. వరల్డ్ కప్లో గెలిచినప్పుడు 20 ఏండ్ల తర్వాత మా నాన్న మొదటి సారి నాకు ఫోన్ చేశాడు. మా బంధువులు కూడా చాలా మంది ఫోన్ చేశారు. నేను పడ్డ కష్టం ఫలించినందుకు అమ్మ చాలా సంతోషించింది. ఇప్పుడు నా ముందు ఉన్నవి మూడు లక్ష్యాలు. ఒకటి చెల్లిని డాక్టర్ని చేయాలి. ఇంకా ఇంకా టోర్నమెంట్లు ఆడి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలి. అలాగే రాష్ట్రంలో నాలాంటి ప్లేయర్స్ సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. బోర్డు ద్వారా వాళ్ళందరికి సపోర్ట్ ఇవ్వాలి. - మధు
సహకారం లేదు
నార్మల్ క్రికెట్ ఆడేవాళ్ళకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది. స్పాన్సర్లు ఉంటారు. కానీ మాకు అలాంటి సహకారం లేదు. మా నేషనల్ బోర్డు సీఏబీఐ బెంగుళూరులో ఉంది. దానికి అనుబంధంగా రాష్ట్రంలో సీఏబీటీ అని పెట్టుకున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 100 మంది వరకు బ్లైండ్ క్రికెటర్లు ఉన్నారు. వీరెవరికీ కనీస సౌకర్యాలు లేవు. ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం ఉంటే మధులాంటి వాళ్ళను ఎందరినో తయారు చేయగలం. వీరి వల్ల రాష్ట్రానికీ, దేశానికి మంచి పేరు వస్తుంది. ప్రస్తుతం మధు బ్యాంక్లో జాబ్ చేస్తూ సెలవులు పెట్టుకొని ఆడటానికి వెళుతున్నాడు. దాంతో అతని జీతం కట్ అవుతుంది. అదే స్పోర్ట్ కోటాలో జాబ్ వస్తే టోర్మమెంట్కు వెళ్ళినప్పుడు సెలవులు ఇస్తారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆటే ప్రపంచంగా బతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వం నుండి, వ్యక్తుల నుండి ఫిక్స్డ్ హెల్ప్ అందించగలిగితే వారి కలలను మా బోర్డు ద్వారా నిజం చేయగలుగుతాం.
- శ్రీధర్, తెలంగాణ బ్లైండ్ క్రికెట్
బోర్డు ప్రెసిడెంట్.