Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సముద్రానికి ఉన్నంత దాహం.. సౌందర్యానికి ఉన్నంత మోహం.. సైన్యానికి ఉన్నంత ధైర్యం.. యువత సొంతం. కాలంతో పోటీపడి కదనంతో కలబడి కటిక చీకటిలో కాంతి వెలుగుల్ని మొలకెత్తించేందుకు క్షణక్షణం కృషి చేసే రాజకీయ రైతే యువత. ప్రజాసేవలో పదునుదేరడమే కాదు ప్రాణాలను లక్ష్యపు జెండాలా ఎగరేయగల విప్లవాత్మక దమ్ము యువతకే సొంతం. అన్యాయం, దోపిడీలపై అగ్గి సునామీలా పోటేత్తే నెత్తుటి ప్రవాహం యువజనం. అలాంటి యువతరమే కమ్యూనిజాన్ని కాపాడే రక్షణ కవచం అంటాడు కామ్రేడ్ లెనిన్. ఆ లెనినిజం పునాదులను ఇండియనైజ్ చేసి మానవాళి విముక్తికి అవిశ్రాంతంగా పోరాడుతున్న కమ్యూనిస్టు, మార్క్సిస్టు, లెనినిస్ట్ పార్టీలు మన దేశ ప్రజాస్వామ్య సౌధమైన పార్లమెంటులో ప్రజానుకూల నిర్ణయాల సాధనకు ప్రజా జ్వాలల్లాంటి, ప్రశ్నల లావాల్లాంటి ఏడుగురు యువకుల్ని 17 వ సార్వత్రిక ఎన్నికల బరిలో దించాయి. ఈ యువ టీంలోని ఏడుగురి గురించి తెల్సుకుని మనమూ 'జోష్' నింపుకుందాం.
83 శాతం అవినీతి పరులు, 33 శాతం క్రిమినల్ కేసులు నమోదైన సిట్టింగ్ ఎం.పీ లున్న పార్లమెంటు లోపలికి భగత్ సింగ్ వారసులను, స్వచ్ఛతతో నిగనిగలాడే పచ్చని చెట్టులాంటి మనుషులను, మెరుపు వేగంతో పోరాడగల వీరులను, ప్రజా వ్యవసాయం తప్పితే మరో వ్యాపకం లేని నిజమైన నాయకుల్ని, రేపటి ఇండియాకు ఎవరు అవసరమో, ఎవరు అనివార్యమో సరిగ్గా అలాంటి వారిని కమ్యూనిస్టు పార్టీలు రంగంలో ఉంచాయి. పార్లమెంటును ప్రక్షాళన ప్రజాస్వామ్యానికి నగిషీలు చెక్కడానికి చెమటోర్చే ఉక్కు క్రమశిక్షణ కలిగిన శ్రామికులు వారు. గుర్తెరుగకుండా లోలోపల ద్వంసించే చెదలులా సార్వభౌమత్వాన్ని తొలుస్తూ దేశాన్ని పతనపు మంచులకు నెట్టి ప్రజల్ని బానిసలు కావించే విధానాలను పార్లమెంటు గ్రౌండ్లో ఓడించే కబడ్డీ టీం ఇది. కమ్యూనిష్టు పార్టీల్లో కాకలు తీరిన అనుభవజ్ఞులకే తప్ప యువతకు ప్రాధాన్యత, ప్రోత్సాహం ఇవ్వరని చర్చ జరుగుతున్న నేపధ్యంలో యువతను ముందుకు తీసుకురావడం దేశంలో హర్షణీయాంశమైంది. కొత్త తరం కమ్యూనిస్టు కార్యకర్తల్లో, సానుభూతి పరుల్లో ఇది సరికొత్త జోష్ నింపుతుంది.
బెంగాల్ యువ ఎమ్మెల్యే ఇబ్రహీమ్
బెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో టమలుక్ పార్లమెంట్ స్థానం నుంచి సీపీఎం తరపున యువ ఎమ్మెల్యే ఎస్.కె ఇబ్రహీమ్ అలీ బరిలోకి దిగారు. ఆయన ప్రస్తుతం పుర్బో మిడ్నాపూర్ జిల్లా పనస్కపూర పురర్బా అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. జోరు కృష్ణాపూర్ గ్రామంలో పుట్టిన ఆయన జిల్లాలోని వివిధ ప్రజా పోరాటాల్లో చురుకైన పాత్ర పోషించారు. 28 ఏండ్ల ఇబ్రహీమ్ అలీ ప్రజా పోరాటాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అధికార టీఎంసీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. ఈ సందర్భంలో ఆయనపై మమతా సర్కార్ అనేక కేసులు బనాయించింది. ఇబ్రహీమ్ అలీ డివైఎఫ్ఐ సంఘంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యువజన సమస్యలపై పోరాటాలు నిర్మించారు. ఉపాధికై జరిగిన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. వామపక్ష కూటమి తరపున యువ సీపీఎం ఎమ్మెల్యే ఎస్.కె ఇబ్రహీమ్ అలీ అధికార టీఎంసీ అభ్యర్థి దిభ్యనంధు అధికారీ, బీజెపీ అభ్యర్థి సిద్ధార్థ నస్కార్, కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ చంద్ర సేత్తో తలపడుతున్నారు.
జెఎన్యు టూ బెగుసరయి కన్నయ్య
బీహార్లోని బెగుసరయిలో బిహట్ ప్రాంతంలో పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కన్నయ్య కుమార్ విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. ఆయన పుట్టిన గ్రామం తేఘార అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఈ నియోజకవర్గంలో సిపిఐ బలంగా ఉంది. కన్నయ్య తండ్రి జైశంకర్ సింగ్కు ఎకర భూమి మాత్రమే ఉంది. తల్లి మీనా దేవీ అంగన్వాడీ వర్కర్. అన్నయ్య మణికంఠ అస్సాంలో కంపెనీ సుపర్విజర్గా పని చేస్తున్నాడు. కన్నయ్య కుటుంబం సాంప్రదాయంగా సిపిఐకి మద్దతుగా ఉండేది. కన్నయ్య స్కూల్ల్ చదివేటప్పుడు స్వాతంత్రోద్యమంలో వామపక్షాలు నాయకత్వం వహించే సాంస్కృతిక విభాగం 'ఇండియన్ పీఫుల్స్ థియేటర్ అసోసియేషన్' (ఐపిటిఎ)లో చురుగ్గా పని చేసేవాడు. 2007లో డిగ్రీ పూర్తి చేసి ఉన్నత విద్యా కోసం జెఎన్యులో చేరారు. 2019లో పిహెచ్డి పూర్తి చేశారు. కాలేజీ స్థాయి నుంచే ఎఐఎస్ఎఫ్ పాల్గొనేవాడు. 2015లో జెఎన్యుఎస్యు అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంలో యూనివర్శిటీలో జరిగిన ఘటన వల్ల తన ప్రమేయం లేకపోయిన తీహార్ జైల్కు వెళ్లాడు. 2016లో 'బీహార్ టూ తీహార్: నా రాజకీయ ప్రయాణం' అనే పుస్తకం రాశారు. 2018లో సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడుగా ఎన్నికయ్యారు. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ తరపున బెగుసరయి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆర్జేడి, బిజెపి అభ్యర్థులతో తలపడుతున్నారు.
కేరళ యువ కెరటం విపి సాను
మలబారు తీరంలో యువ కెరటం ఉప్పెనై ప్రత్యర్థులకు కునుకు లేకుండా చేసింది. కేరళలో మలప్పురం లోక్సభ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా విపి సాను పోటీ చేస్తున్నారు. సిపిఎం మలప్పురం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు విపి సక్కరియా పెద్ద కుమారుడు విపిసాను. వలంచేర్య్రిలో జన్మించిన సాను జీయుపీఎస్ పైనకన్నూర్, జిహెచ్ఎస్ఎస్ కుట్టీపురంలో ప్రాథమిక విద్యాను అభ్యసించారు. అప్పటి నుంచే బాల సంఘంలో చురుకుగా ఉండేవాడు. ఎంఈఎస్ కేవీయమ్ కాలేజీలో డిగ్రీ, కలద్యలోని శ్రీ శంకర చార్య యూనివర్శిటీలో పిజీ పూర్తి చేశారు. జీహెచ్ఎస్ఎస్లో చదువుతున్నప్పుడే ఎస్ఎఫ్ఐలో చురుగ్గా పనిచేసేవారు. వలంచేర్య్రిలో ఎరియా కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు. తరువాత ఎస్ఎఫ్ఐ మలప్పురం జిల్లా అధ్యక్షుగానూ, కార్యదర్శిగానూ చేశారు. అతికొద్ది కాలంలోనే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అందుకున్న విపి సాను 2016లో అఖిల భారత అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 2018లో హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో జరిగిన 16వ ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలో జాతీయ అధ్యక్షుడుగా తిరిగి ఎన్నికైయ్యారు. అలాగే సిపిఎం మలప్పురం జిల్లా కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు. మోడీ సర్కార్ విద్యా వ్యతిరేక విధానాలపై దేశ రాజధానిలో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమాల్లో సాను కీలక పాత్ర పోషించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మలప్పురం నియోజకవర్గ వామపక్ష ప్రజాతంత్ర కూటమి(ఎల్డీఎఫ్) తరపున సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఐయుఎంఎల్ నేత పి.కె కున్హలీకుట్టీపై పోటీ చేస్తున్నారు. 1991లో అసెంబ్లీ ఎన్నికల్లో పి.కె కున్హలీ కుట్టీపై విపి సాను తండ్రి విపి సక్కరియా సిపిఎం అభ్యర్థిగా పోటీ చేశారు.
యువజన నేత తీర్థంకర్ రారు
బెంగాల్లో శ్రీరామ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి సీపీఎం యువనేత తీర్థంకర్ రారు వామపక్ష కూటమి తరపున బరిలోకి దిగారు. తీర్థంకర్ రారు హుగ్లీ జిల్లా డివైఎఫ్ఐ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నారు. యువజన సమస్యలపై జరిగే పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్నారు. ఆయనకు ప్రజా నేతగా పేరుంది. గెలిచినా, ఓడినా తాను ప్రజా సేవలోనే ఉంటానని అంటున్నారు. తన నియోజకవర్గంలో చాలా ఇళ్లు కరెంట్ లేకుండా ఉన్నాయని, తాను గెలిస్తే కరెంట్ సమస్యను పరిష్కరించడమే తన మొదటి లక్ష్యమని పేర్కొన్నారు. తృణముల్ కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపి కళ్యాణ్ బెనార్జీతో రారు తలపడుతున్నారు.
బీహార్లో రాజు యాదవ్
బీహార్లోని అర లోక్సభ నియోజకవర్గం నుంచి సిపిఐ(ఎంఎల్) అభ్యర్థి యువ నేత రాజు యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఆర్జేడి, కాంగ్రెస్ రాజు యాదవ్కు మద్దతు తెలిపాయి. ప్రస్తుతం బీజెపీ అభ్యర్థితో రాజు యాదవ్ తలపడుతున్నారు. అరలో పుట్టి పెరిగిన రాజు యాదవ్ అక్కడే విద్యాభ్యాసం చేశారు. చదువుకునే సమయంలోనే రాజు కమ్యూనిస్టు రాజకీయాలకు ఆకర్షితుడయ్యాడు. సిపిఐ(ఎంఎల్) విద్యార్థి విభాగం ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్(ఎఐఎస్ఎ)లో పని చేస్తూ అంచలంచెలగా ఎదిగిన రాజు యాదవ్ ఆ సంఘానికి జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సిపిఐ(ఎంఎల్) యువజన విభాగం జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు చూస్తున్నారు. 2018లో జరిగిన సిపిఐ(ఎంఎల్) అఖిల భారత మహాసభల్లో కేంద్ర కమిటీ సభ్యుడుగా ఎన్నికయ్యారు. బీహార్లో ఆపార్టీ కీలక నేతగా రాజు ఎదిగాడు. అనేక ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించాడు.
పరితోష్ పట్నాయక్ 'యువ టైగర్'
బెంగాల్లోని కంతి లోక్సభ నియోజకవర్గం నుంచి వామపక్ష కూటమి తరపున సీపీఎం అభ్యర్థి పరితోష్ పట్నాయక్ బరిలో దిగారు. డివైఎఫ్ఐలో బాధ్యతలు నిర్వహిస్తున్న పరితోష్ ప్రజాప్రతినిధులు ప్రజల పక్షం ఉండాలని ఎన్నికల రణరంగంలోకి దూకారు. ప్రజా సమస్యలపై బెంగాల్ టైగర్ వలే గర్జిస్తారు. అందువల్లనే స్నేహితులు పరితోష్ను యువ టైగర్ అని పిలుస్తారు. పుర్బ మిడ్నాపూర్ జిల్లాలోని కంతి లోక్సభ నియోజకవర్గంలో వామపక్ష యువ కిశోరం బరిలో దిగడంతో యువకుల్లో ఉత్సాహం నెలకొంది. ఆయన ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. తాను అవినీతిపై పోరాడుతానని, అవినీతి రహిత భారత దేశం కోసం పని చేస్తానని ఎన్నికల ప్రచారంలో చేసే ప్రసంగాలకు యువత పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అన్యాయంపై ఉద్యమిస్తానని గర్జిస్తున్న ఈ యువనేతకు అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆయన అధికార తృణముల్ సిట్టింగ్ ఎంపి సిసిర్ కుమార్ అధికారి, బీజెపీ అభ్యర్థి దేబసిష్ సమంతా, కాంగ్రెస్ అభ్యర్థి దీపక్ కునర్ దాస్తో ఢ కొంటున్నారు.
అస్సాంలో గిరిజన యువనేత బిరజ్ దేకా
17వ లోక్సభ ఎన్నికల్లో అత్యంత పిన్న వయసు గల అభ్యర్థి అస్సాంలోని కోక్రాఝర్ నియోజకవర్గం నుంచి సిపిఎం తరపున పోటీ చేస్తున్న గిరిజన యువనేత బిరజ్ దేకా. 25 ఏండ్ల బీరజ్ ప్రత్యర్థులపై మాటల తూటాలను వదులుతున్నారు. వారు చేసే అవినీతి అక్రమాలను కడిగిపారేస్తున్నారు. అస్సాంలో ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం కోక్రాఝర్ బిరజ్ పోటీ చేస్తున్నారు. బిరజ్కు విద్యావంతుల మద్దతు ఉంది. ఈయన ప్రస్తుతం ఎస్ఎఫ్ఐ అస్సాం రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. అంతేకాక ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యుడుగా కూడా ఉన్నారు. అస్సాం విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అధికార బీజెపీ విద్యా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీసే పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. విద్యార్థి సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తున్నారు. బిరజ్ విద్యార్థి ఉద్యమాల్లోనే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. బోడోల్యాండ్ యూనివర్శిటీలో ఇంగ్లీష్లో పోస్టు గ్రాడ్యుషన్ పూర్తి చేశారు. బిరాజ్కు అస్సాంలో మంచి వక్తగా పేరుంది. అలాగే ఆయనకు కవిగా, రచయితగా మంచి గుర్తింపు ఉంది. నలుగురు సీనియర్లతో ఓ యువ కెరటం తలపడుతుంది.