Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కొంత మంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు.. పేర్లకి, పుకార్లకి, ఫకీర్లకి బద్దులు.. మరికొంత మంది యువకులు పావన నవజీవన బృందావన నిర్మాతలు' అన్నారు మహా కవి శ్రీశ్రీ. ఆయన అన్నట్టుగానే నేటి యువతలో ఓ భాగం డబ్బు సంపాదన, ఎంజారుమెంట్, వీకెండ్ పార్టీలు అంటూ తిరుగుతుంటే.. మరికొంత మంది అనుకున్నది సాధించేందుకు, సమాజానికి చేతనైన సాయం చేసేందుకు తపిస్తుంటారు. అలాంటి వారిలో వినీల్ కాంతికుమార్ ఒకరు. ఫేస్బుక్ను వేదిక చేసుకుని తన అక్షరాలతో ఎంతో మందిని ఉత్తేజ పరుస్తూ.. సినిమాల ద్వారా పాటలు, మాటలను ఈ ప్రపంచానికి వినిపించేలా చేయాలనుకుంటున్నా ఆ యువ సాహిత్య కారుని పరిచయం...
మీరు పుట్టి పెరిగింది ఎక్కడా?
మాది వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నా. తర్వాత ఇంటర్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఇంటర్ నుండి కవితలు రాయడం మొదలుపెట్టాను. సామాజిక సమస్యల గురించే ఎక్కువగా రాసేవాడిని. ఐదేండ్ల కిందట నేనూ నాఫ్రెండ్స్ కలసి నేను రాసిని కవితలు, అతను రాసిన వ్యాసాలతో 'చందమామ' పేరుతో ఓ పుస్తకం కూడా తీసుకు వచ్చాం.
రాయాలనే ఆసక్తి ఎలా వచ్చింది?
చిన్నప్పటి నుండి తెలుగంటే చాలా ఇష్టం. పుస్తకాలు కూడా బాగా చదివేవాడిని. నాన్న దగ్గర మంచి మంచి పుస్తకాలు చాలా ఉండేవి. చదవడం నాన్న నుండే అలవాటయింది. నాన్న సత్యనారాయణ రావు. మాకు మెడికల్ షాప్ ఉంది. అమ్మ పద్మ. గృహిణి. నాన్న గతంలో సత్యం పేరుతో పత్రికలకు కార్టూన్లు వేసేవారు. నేను కూడా కొంత కాలం కార్టూన్లు వేసేవాడిని. అయితే కార్టూన్ల కంటే కవితలు రాయడమంటేనే నాకుచాలా ఇష్టం. అందుకే కార్టూన్లు వదిలి పెట్టి రాయడం మొదలుపెట్టాను.
మరి పాటలు రాయడానికి స్ఫూర్తి ఎవరు?
చిన్నప్పటి నుండి సినిమా మాటలు బాగా వినేవాడిని. మా చిన్నప్పుడు పాటల పుస్తకాలు రెండు రూపాయలకు దొరికేవి. వాటిని కొనుక్కొని జాగ్రత్తగా ఉంచుకునేవాడిని. సినిమాలోని పాటలన్నీ విని అందులో ఒక పాటను మాత్రం బాగా నేర్చుకునేవాడిని. అలా నాకు నచ్చిన పాటలు అన్నీ సేకరించాను. అలా సేకరించిన పాటలన్నీ చూస్తే వాటిని రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు. అప్పటి నుండి ఆయన రాసిన పాటల క్యాసెట్లు తెచ్చుకొని వాటిని వింటూ వుండేవాడిని. ఎప్పటి కైనా ఆయన్ని కలవాలనీ, మాట్లాడాలని కలలు కనేవాడిని.
మరి మీ కల నెరవేరిందా?
నెరవేరింది. కానీ అదో పెద్ద స్టోరి. ఆయన్ని కలవడానికి రెండు సంవత్సరాలు కష్టపడ్డాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత త్యాగరాయ గాన సభకు దగ్గర్లో ఉండేవాడిని. ప్రతిరోజూ అక్కడ ఏవో కార్యక్రమాలు జరుగుతుండేవి. రోజూ అక్కడికి వెళ్ళి బ్యానర్లు చూసి ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో చూసి నాకు నచ్చిన పాటల కార్యక్రమాలు ఉంటే వెళ్ళే వాడిని. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. బాలసుబ్రమణ్యంగారి ఓ కార్యక్రమానికి సిరివెన్నెల గారు ముఖ్య అతిథిగా వస్తున్నారని బ్యానర్లో చూశాను. ఇక ఎలాగైనా ఆయన్ని కలవాలనుకున్నాను. అయితే జనం విపరీతంగా ఉన్నారు. లోపలికి వెళ్ళే అవకాశమన్నా దొరుకుతుందో లేదో అని భయపడ్డా. ఎలాగొలా జనాన్ని దాటుకుని లోపలికి వెళ్ళాను. కార్యక్రమం అయిపోయే వరకు ఉండి కష్టపడి ఆయన్ని కలుసుకుని ''సార్, నేను మీ అభిమానిని. మా పాటలంటే చాలా ఇష్టం, మీ పాటలన్నీ సేకరించుకున్నాను. నేను కూడా పాటలు రాస్తుంటాను'' అని పరిచయం చేసుకుంటే ఆయన తర్వాత కలవాల్సిందిగా చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చారు.
మరి కలిశారా?
అప్పట్లో ల్యాండ్లైన్లు మాత్రమే ఉండేవి. ఆయన నెంబర్ ఇచ్చిన తర్వాత ప్రతి రోజూ టెలిఫోన్ బూత్కి వెళ్ళి సాయంత్రం ఆయన కోసం ఫోన్ చేసేవాడిని. చాలా కాలం ఆయన ఫోన్లో దొరకలేదు. సుమారు ఏడాదిన్నర తర్వాత ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చింది. ఇక అప్పటి నుండి రెగ్యులర్గా కలిసేవాడిని. మాట్లాడేవాడిని. సలహాలు ఇచ్చేవారు. సూచనలు చేసేవారు. ఆయనే నాకు స్ఫూర్తి. ఆయన పరిచయంతో తెలుగుపై పట్టు పెరిగింది. మోరల్గా చాలా సపోర్ట్ చేశారు. ఆయనే నా గురువు.
ఫేస్బుక్లో బాగా యాక్టివ్ అనుకుంటా?
అవును. నా అక్షరాలు పది మందికి తెలియాలి. దాని కోసం వేలకు వేలు ఖర్చుపెట్టే ఆర్థిక స్థోమత లేదు. అందుకే నా భావాలను పంచుకోడానికి ఫేస్బుక్నే వేదిక చేసుకున్నా. కవిత్వంతో మొదలుపెట్టిన నా ప్రస్థానం ప్రస్తుతం పాటలు, మాటలతో సాగుతుంది. ఇప్పటి వరకు ప్రైవేట్ ఆల్బమ్స్కు, షార్ట్ఫిల్మ్కు రాశాను. అలాగే ఎన్నికల పాటలు కూడా చాలా రాశాను.
సినిమాల్లోకి చాలా ఆలస్యంగా వచ్చారు. కారణం?
ఈ ఫీల్డ్లో ఎంత టాలెంట్ ఉన్నా నిల దొక్కుకోవడం చాలా కష్టం. అందుకే ఆలస్యం అయింది. గతంలో కొన్ని సినిమాలకు అవకాశాలు వచ్చాయి. అయితే అవి బూతు సినిమాలు. యువతను రెచ్చగొట్టేవి. అలాంటివి చేయకూడదని నిర్ణయించున్నా. నా అక్షరాల వల్ల వీలైనంత వరకు సమాజానికి మేలు జరగాలి. అంతేకాని నష్టం జరగకూడదు. ఏది ఏమైనా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడేవే రాయాలని అనుకున్నా. అందుకే ఆ సినిమాలకు రాయడానికి ఒప్పుకోలేదు. దాని వల్లే అవకాశాలు కూడా చాలా తక్కువగా వస్తున్నాయి.
ఇప్పటికి ఎన్ని సినిమాలకు రాశారు?
ప్రస్తుతం మూడు సినిమాలకు మాటలు రాస్తున్నాను. ఇప్పటికి 'దోబూచులాట' అనే సినిమా పూర్తయింది. అయితే కొన్ని సమస్యల వల్ల రిలీజ్ కాలేదు. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
అసలు మీ జీవిత లక్ష్యం ఏమిటి?
ఎప్పటికైనా డైరెక్షన్ వైపు వెళ్ళాలి. కొన్ని సినిమాలకు మాటలు, పాటలు రాసి అనుభవం వచ్చిన తర్వాత డైరెక్షన్కు ప్రయత్నం చేస్తా. ఏరోజుకారోజే ఇక్కడ కొత్తే. నాకు నచ్చనవి రాయనప్పుడు చాలా మంది వీడికి బలుపు, పొగరు అంటూ తిట్టుకున్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నాను. వాటి ప్రకారమే నడుచుకుంటాను. అందుకే ఇంకా సక్సెస్ అందుకోలేకపోయాను. కానీ ఎప్పటికైనా అనుకున్నది సాధిస్తాను.
మరి ఇంట్లో ఏమంటున్నారు?
ఇంకా ఎన్నాళ్ళు.. ఉద్యోగం చూసుకోవచ్చు కదా అంటారు. అయితే కొన్ని రోజులు మార్కెటింగ్ ఫీల్డ్లో పని చేశా. కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా. ఏది ఏమైనా నాకు నచ్చిన పనే చేయాలని నిర్ణయించుకున్నా. ఎంచుకున్న ఫీల్డ్లో సమస్యలు ఉన్నాయని తెలుసు. నిలదొక్కుకోవడం చాలా కష్టం. మనసుకు తృప్తి లేనప్పుడు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. అందుకే మనసుకు నచ్చిందే చేస్తే. నాది ముళ్ళ బాటని తెలుసు. ఎలాగైనా గమ్యం చేరాలి.
ఎందుకు ఇంత పట్టుదల?
ముందే చెప్పాను. నా అక్షరాలు పది మందికి చేరాలి. అక్షరాలు చాలా మందిని ప్రభావితం చేస్తాయి. అది ఫేస్బుక్ ద్వారానే తెలుసుకున్నా. నేను రాసి ఫేస్బుక్లో పెట్టిన కొన్ని కొటేషన్లను చదివి చనిపోదామనుకున్న వారు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. వాళ్ళే స్వయంగా ఫోన్ చేసి చెబుతుంటారు. వాళ్ళు అలా చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి నా అక్షరాలు కొంత మందికైనా మంచి చేస్తే చాలు. ఎవరు ఎన్ని అనుకున్నా నా మార్గాన్ని మార్చుకోను.