Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోగులకు వైద్యం చేసే డాక్టర్కు సమాజానికి కూడా వైద్యం
చేయాలనిపించింది. స్టెతస్కోప్ పట్టుకునే చేత్తోనే కలాన్ని పట్టాడు. అంతటితో ఆగకుండా కెమెరా కూడా పట్టాడు. వైద్యుడిగా పేషెంట్ల గుండెకు భద్రత కల్పిస్తూనే తన అందమైన కవిత్వంతో, సమాజాన్ని ప్రశ్నించే లఘు చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలకూ చేరువవుతున్నాడు. ఆయనే యువ కవి, దర్శకుడు, డాక్టర్ విరించి విరివింటి. ఆ హృదయ కళాకారుడి గురించి మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే...
సాధారణంగా డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయ్యామంటూ చాలామంది చెబుతుంటారు. కానీ డాక్టర్గా ఉన్న మీకు కళల పట్ల ఆసక్తి ఎలా వచ్చింది?
మాది మహబూబ్నగర్. స్కూలింగ్ మాత్రం బోధన్లో జరిగింది. చిన్నతనంలో తాతయ్య ప్రభావం బాగుండేది. ఆయన వేదపండితుడు. కాళిదాసు అంటే తాతకు ప్రాణం. సాహిత్యాన్ని చదివి వినిపించేవారు. పద్యాలు చదివి వాటికి అర్థాలు చెబుతుండేవారు. వాటిని వింటూ పెరగడంతో సాహిత్యం, భాష పట్ల కొంత అవగాహన వచ్చింది. మా నాన్న శ్రీనివాస్ శర్మ, అమ్మ గాయత్రి. నాకు ముగ్గురు చెల్లెళ్ళు. నాన్న ఎల్ఐసీలో పని చేసి రిటైర్ అయ్యారు. నాన్న కూడా సాహిత్య ప్రియులు. పాటలు రాసేవారు. ఏక పాత్రాభినయాలకు డైలాగులు రాసేవారు. వాటిని బట్టీ పట్టీ స్కూల్లో యాక్ట్ చేసేవాడిని. అలా తాతయ్య, నాన్న ఇద్దరి ప్రభావం నాపై ఉంది.
మీరు రాయడం ఎప్పుడు మొదలుపెట్టారు?
పదో తరగతిలో ఉన్నప్పటి నుండే రాసే వాడిని. అయితే అవి కేవలం డైరీకే పరిమితం. ప్రతి ఒక్కరిలో భావాలు ఉంటాయి. వాటిని బటయకు చెప్పుకోడానికి వేదిక కావాలి. ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల అవకాశాలు బాగా పెరిగిపోయాయి. నాలోని భావాలను పది మందితో పంచుకోడానికి మంచి వేదిక దొరికింది. అలా నేను కూడా ఫేస్బుక్ ద్వారా నా ఆలోచనలను జనంతో పంచుకోవడం మొదలుపెట్టాను. ఇంటర్లో ఉన్నప్పుడు నవలలు చదవమని నాన్న సలహా ఇచ్చారు. అప్పటి నుండి నవలలు బాగా చదివేవాడిని. ఒక్కో పుస్తకం చదువుతుంటే కొత్త ప్రపంచం పరిచయమైనట్టుగా అనిపించేది. చాలా ఉత్సాహంగా ఉండేది. అందుకే అప్పటి నుండే నా సాహిత్య అధ్యయనం కొనసాగుతూనే ఉంది.
ఎంబీబీఎస్ అంటే చాలా కష్టపడాలి. మరి మీరు చదువునీ సాహిత్యాన్నీ ఎలా బ్యాలెన్స్ చేసేవారు?
వారమంతా చదువులో ఎంత బిజీగా ఉన్నా శని, ఆదివారాలు మాత్రం ఎంజారు చేస్తుంటారు. నేను మాత్రం ఆ రెండు రోజులు అప్జల్గంజ్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి రకరకాల పుస్తకాలు తీసుకొని చదివేవాడిని. చదివిన తర్వాత నచ్చిన అంశాలు, కొటేషన్లను డైరీలో రాసుకునేవాడిని. శని, ఆదివారాలు కాబట్టి చదువుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు.
షార్ట్ఫిలిమ్స్ తీయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది?
చిన్నప్పుడు సాహిత్యంతో పాటు సినిమాలు తీయాలనే కోరిక కూడా ఉండేది. డ్యాన్స్ బాగా చేసేవాడిని. పాటలు పాడేవాడిని, స్టేజ్పై డ్రామాలు వేసేవాడిని. నిజం చెప్పాలంటే మా అమ్మకు నన్ను హీరోగా చూడాలని కోరిక ఉండేది. మెడిసన్ చేసేటప్పుడు నా ఎంసెట్ ఫ్రెండ్తో కలిసి ఒక షార్ట్ఫిల్మ్ కూడా తీశాను. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి చదువులో బాగా బిజీ అయిపోయి ఇవన్నీ పక్కన పెట్టి పూర్తిగా చదువులో మునిగిపోయా. ఎంబీబీఎస్ పూర్తి చేసి కార్డియాలజీ చేసిన తర్వాత మళ్ళీ కళల వైపు వచ్చాను.
ఓ కవిత్వ సంపుటిని తీసుకువచ్చారు. దాని గురించి చెప్పండి?
ఓసారి జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఓ కవిత రాసి ఫేస్బుక్లో పోస్ట్ చేశా. దానికి మంచి స్పందన వచ్చింది. తెలుగు పదాలనే ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టాను. కొంత మంది తెలుగులో రాసి పోస్ట్ చేస్తే చదివే వాళ్ళకు బాగుంటుందని సలహా ఇచ్చారు. అందుకే తెలుగు టైప్ చేయడం కూడా నేర్చుకున్నా. అప్పటి నుండి రాసిన కవితలను పోస్ట్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడే కవి సంగమంతో పరిచయం అయ్యింది. ఆ గ్రూపులో పెట్టే కవితలు చదివితే నాది అసలు కవిత్వమే కాదనిపించింది. కవిసంగమం నిర్వహించే యాకుబ్గారు బాగా ప్రోత్సహించేవారు. చాలా మంది కవుల పుస్తకాలు తెచ్చుకొని చదివేవాడిని. అప్పటి నుండి కాస్త సీరియస్గా రాయడం మొదలుపెట్టాను. నా దృష్టిలో మనిషి జీవితంలోని ప్రతి అంశం ఓ కవిత్వమే. వాటిని చదివే వారికి తన జీవితం అందులో ఉంది అనిపించాలి. అలా రాసిన కవితలనే 2015లో 'రెండో అధ్యాయానికి ముందుమాట' పేరుతో పుస్తకంగా ప్రచురించాను.
ఈ మధ్య కాలంలో షార్ట్ఫిలిమ్స్పైనే దృష్టి పెట్టినట్టున్నారు?
కవిత్వం మొదలుపెట్టిన తర్వాత నేనెంతో ఇష్టపడే సినిమా రంగంలోకి కూడా రావాలనిపించింది. సాహిత్యంలో నాన్న ఎన్నో చేయాలనుకున్నారు. కానీ ఉద్యోగం, కుటుంబం వల్ల అవన్నీ చేయలేకపోయారు. నాన్న చేయలేకపోయినవి నేనైనా చేయాలనుకున్నా. 2011లో శంషాబాద్లో క్లినిక్ ప్రారంభించా. దాన్ని నడిపిస్తూనే ఇటు కవిత్వం, అటు షార్ట్ఫిలిమ్స్ రెండూ మొదలుపెట్టా. అయితే నా ఆలోచనలు వేరు. నేను రాసే కవిత్వమైనా, తీసే సినిమా అయినా సమాజానికి ఉపయోగపడాలి. నా ఆలోచనకు తగిన వారు కావాలి. అలాంటి వారి కోసం వెదకడం మొదలుపెట్టాను. అప్పుడే మా బాబాయి కొడుకు ఫొటోగ్రఫీ చేస్తున్నాడు. నా ఆలోచన అతనికి చెబితే చేద్దాం అన్నాడు. తన సపోర్ట్ దొరకడంతో చాలా సంతోషంగా అనిపించింది.
మీరు తీసిన కొన్ని ఫిలిమ్స్ గురించి చెబుతారా?
కవిత్వం మొదలుపెట్టిన కొంత కాలానికి ఫిలిమ్స్ తీయడం మొదలుపెట్టా. అప్పట్లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్ళు నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఆ అంశాన్నే ఆధారం చేసుకొని ఓ షార్ట్ఫిలిమ్ తీశాను. మెడిసన్ విద్యార్థిగా సినిమా తీసినప్పుడు చాలా కష్టపడ్డా. సరైన కెమెరా ఉండేది కాదు. అప్పట్లో టెక్నాలజీ కూడా ఇంత అభివృద్ధి చెందలేదు. అయితే ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దాంతో సినిమా తీయడం కాస్త సులభంగా అనిపించింది. ఆ తర్వాత 'ఇక్కడి చెట్ల గాలి' అనే షార్ట్ ఫిలిం తీస్తే తెలంగాణ ఫిల్మ్ ఫెస్ట్లో అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత 'పర్సెప్షన్స్' అనే సినిమాని సత్యం అనే అంశాన్ని ఆధారం చేసుకొని తీశాను. ప్రస్తుతం నేషనల్ ఫిల్మ్ ఫెస్ట్ కోసం ఓ సినిమా తీయబోతున్నాను. త్వరలో షాడో, ఫ్యూచర్ షాక్, ధర్డీ హాండ్స్ అనే మూడు సినిమాలు రాబోతున్నవి.
కార్డియాలజిస్ట్ అంటే చాలా బిజీగా ఉంటారు. మరి వీటన్నింటినీ మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు?
దీనికి ముందే ప్లాన్ చేసుకున్నా. దాని ప్రకారం నావర్క్ చేసుకుంటా. సాధారణంగా డాక్టర్లకు డిసెంబర్, జనవరిలో పెద్దగా వర్క్ ఉండదు. క్రిస్మస్, సంక్రాంతి సెలవులు రావడంతో కాస్తా ఖాళీ టైం దొరుకుతుంది. ఆ టైంలో చాలా మంది డాక్టర్లు బయటి ప్రాంతాలకు వెళుతుంటారు. ఆ టైంలోనే నేను సినిమా షూటింగ్లు పెట్టుకుంటాను. పేషంట్లకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ రానీయను. అలాగే ఆదివారాల్లో ఏదైనా అర్జంట్ అయితే తప్ప పెద్దగా పని ఉండదు. అప్పుడు కూడా షూటింగ్ పెట్టుకుంటాను. కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు.
మరి ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది?
మా ఆవిడ గవర్నమెంట్ డాక్టర్. తనకు కూడా సాహిత్య అభిమాని. తన నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక ఇంట్లో అందరూ ప్రోత్సహిస్తారు. వారందరి సహకారం ఉంది కాబట్టే ఇన్ని పనులు చేయగలుగుతున్నాను.
యూత్ చాలామంది సోషల్మీడియాను మిస్యూజ్ చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు?
యూత్ సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకుంటున్నారు. కానీ దాన్ని మిస్యూజ్ చేయకూడదు. మనం ఏం చేసినా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలి. నష్టం మాత్రం చేయకూడదు. ప్రస్తుతం ఇంటర్నెట్లో ప్రతి ఒక్కటీ అందుబాటులో ఉంది. మనం చేయాల్సిందల్లా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసి ఉండాలి. మరీ ముఖ్యంగా ఎంచుకునే మార్గం మంచిదై ఉండాలి.
మీ ఫ్యూచర్ ప్లాన్?
ఇంకా రెండు మూడు పుస్తకాలు తీసుకురావాలి. ఈ విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా. అయితే రాసిన వాటిని ఎలాగో ఫేస్బుక్లో పెడుతున్నా. అందరూ చదువుతున్నారు. ఇక పుస్తకం ఎందుకులే అని డిలే చేస్తున్నా. కానీ వాటిని కూడా పుస్తక రూపంలోకి తీసుకురావాలి. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. కవిగా, దర్శకుడిగా ప్రజల్లో ఉండాలి. డాక్టర్గా పేషెంట్ల వద్ద ఉండాలి. ఇవే నా ఆలోచనలు. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను పట్టుకోవాలి. నా ఉద్దేశంలో కవైనా, కళాకారుడైనా చీకటిని పారద్రోలే దీపంలా ఉండాలి. మార్పుకు ప్రాతినిధ్యం వహించాలి. దాన్ని సరైన మార్గంలో బయటకు తీసుకురావాలి.
- సలీమ