Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎనర్జీ డ్రింక్స్ అతిగా తాగితే శరీరంలో రక్తపోటు స్థాయి విపరీతంగా పెరిగిపోయి హృదయ స్పందనల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఈ మధ్య కాలంలో ఎనర్జీ డ్రింక్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. గతంలో వీటిని ఎక్కువగా యూత్ మాత్రమే తాగేవారు. అయితే ఈ మధ్య కాలంలో తక్షణ శక్తి పొందేందుకు యువతతో పాటు మధ్య వయసు వారు కూడా వీటికి అలవాటు పడుతున్నారు. అయితే ఈ డ్రింక్స్ను అప్పుడప్పుడు తాగితే ఫర్వాలేదు గానీ.. రోజూ తాగితే మాత్రం హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందేనని చెబుతున్నారు పరిశోధకులు.
హృదయ స్పందనల్లో మార్పులు
ఎనర్జీ డ్రింక్స్ అతిగా తాగితే శరీరంలో రక్తపోటు స్థాయి విపరీతంగా పెరిగిపోయి హృదయ స్పందనల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీనిపై అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ పసిఫిక్ సైంటిస్టులు పరిశోధన చేపట్టారు. 18-40 ఏండ్ల వయసు గల 34 మందిని ఎంపిక చేసుకుని వారితో మూడు సార్లుగా 304-320 గ్రాముల కెఫైన్ కలిసిన 32 ఔన్స్ల ఎనర్జీ డ్రింక్ను తాగించారు. ఆ డ్రింక్ తాగిన వారిలో హృదయ స్పందనలు 6 మిల్లీ సెకన్ల నుంచి 7.7 మిల్లీ సెకన్లకు పెరిగినట్టు గుర్తించారు.
ప్రాణానికి పెను ప్రమాదం
హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు జరిగితే అది ప్రాణాలకే ముప్పు తెస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తక్షణ శక్తిని ఇస్తాయని అతిగా ఎనర్జీ డ్రింకులు తాగేస్తే గుండె జబ్బులతో త్వరగా ప్రాణం పోవడం ఖాయమని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి సూపర్మార్కెట్లలో డిస్కౌంట్పై వస్తున్నాయని ఎనర్జీ డ్రింకులు ఎక్కువగా తెచ్చుకుని తాగేయకండి.