Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం. 9 టు 5 జాబ్. నాలుగంకెల్లో జీతం. ఆనందకరమైన జీవితం. ఇంతకు మించి ఏం కోరుకుంటారు నేటి యువత. అప్పటి వరకు అతని జీవితం కూడా ఇదే. కానీ ఓ 12 ఏండ్ల అయ్మాయి దీనస్థితి ఆ యువకుడి ఆలోచనలను మార్చివేసింది. అతనే సుజిత్ కుమార్. ఎంతో టాలెంట్ ఉండి కేవలం ఆర్థిక సమస్యల వల్ల ఉన్నత విద్యకు దూరమవుతున్న పేద పిల్లలపై అతని దృష్టి పడింది. వెంటనే తోటి వారితో చర్చించాడు. 'మాత్రం' ఫౌండేషన్ స్థాపించాడు. ఇప్పుడు ఎంతో మంది పేద పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాడు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం...
అది 2013 నాటి సంగతి. చెన్నైకి చెందిన సుజిత్ ఇన్ఫోసిస్లో హెచ్ఆర్గా ఉద్యోగం చేస్తున్నాడు. మధురైలోని ఓ కాలేజీలో విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్ క్లాసు పూర్తి చేసుకుని బయటకు వచ్చాడు. అప్పటికే అతని కోసం ఓ అమ్మాయి హాలు బయట ఎదురుచూస్తుంది. ఆ అమ్మాయికి సుమారు 12 ఏండ్ల వయసు ఉండవచ్చు. ఆమె కొన్ని కాగితాలు, పుస్తకాలను తన గుండెలకు హత్తుకొని నిలబడి ఉంది. సుజిత్ బయటకు వచ్చీ రాగానే 'మంచి ఉద్యోగం రావాలంటే నేనేం చేయాలి' అని అడిగింది ఆ అమ్మాయి. ఇంత చిన్న వయసులో కెరీర్ పట్ల ఆ అమ్మాయి చూపుతున్న ఆసక్తికి ఆశ్చర్యపోయిన సుజిత్ ఆమెతో ఎన్నో విషయాల గురించి చర్చించాడు.
ఆమె దీనస్థితి చూసి
ఆమెకు ఇద్దరు తమ్ముళ్ళు. తల్లి మరణించింది. తండ్రి మద్యానికి బానిసయ్యాడు. ఇల్లు పట్టించుకోకుండా తాగి తిరుగుతుంటాడు. తల్లిపోయిన తర్వాత ఆ పిల్లలు అనాథలయ్యారు. తన ఇద్దరు తమ్ముళ్ళకు అన్నీతానై పెంచుతుంది. చదువుకుంటూనే ఇండ్లల్లో పని చేసుకుంటూ తన తమ్ముళ్ళను పోషిస్తుంది. ఎంతో తెలివైన విద్యార్థి. ఫిజిక్స్లో టాప్ ర్యాంక్ సాధించింది. కానీ చదువుకునేందుకు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది.
కర్తవ్యమేమిటో తెలిసింది
ప్రతిష్టాత్మకమైన ఓ ఐటి కంపెనీలో పని చేస్తున్న సుజిత్ను ఆ 12 ఏండ్ల అమ్మాయి దీనస్థితి కదిలించి వేసింది. ఆమె చదువుకు అవసరమైన ఖర్చులు అతనే భరించాలనుకున్నాడు. బాగా ఆలోచిస్తే తర్వాత రోజు సుజిత్కి తన కర్తవ్యమేమిటో అర్థమయింది. పేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకున్నాడు. వారికోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. తన తోటి ఉద్యోగులు, స్నేహితులుతో దీని గురించి చర్చించాడు. అందరూ తమకు తోచిన సాయం చేస్తామన్నారు. ఇలా సుజిత్ ఆలోచనల నుండి పుట్టికొచ్చిందే 'మాత్రం' ఫౌండేషన్. తమిళంలో 'మాత్రం' అంటే మార్పు అని అర్థం. పేద విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఇతని ముఖ్య ఉద్దేశం. అందుకే దీన్ని స్థాపించాడు.
677 మందికి ఉచిత విద్య
సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత సుజిత్ కొన్ని కాలేజీలను కలిసాడు. అలా కలిసిన వారిలో పునీత ఆంటోని కూడా ఉన్నారు. ఆమె తన కళాశాలలో 20 మంది విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ సీట్లు ఇవ్వడమే కాకుండా సుజిత్ ఏర్పాటు చేసిన సంస్థకు తన వంతు సహకారం కూడా అందిస్తున్నారు. అప్పటి నుండి 'మాత్రం' ఫౌండేషన్ ద్వారా వీలైనంత ఎక్కువ మందికి ఉచితంగా ఉన్నత విద్య అందించేందుకు కృషి చేస్తున్నాడు. అతని ప్రయత్నం ఫలించింది. ప్రస్తుతం 35 ఇంజనీరింగ్ కాలేజీలలో 677 మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికీ ఫ్రీ అడ్మిషన్తో పాటు, ట్యూషన్ ఫీజు, ఉచిత భోజనం, హాస్టల్ ఫీజు కూడా సుజిత్ ఏర్పాటు చేస్తున్నాడు.
కమిటీ ద్వారా ఎంపిక
'మాత్రం' ఫౌండేషన్ ద్వారా సీటు సంపాదించడం అంత సులువు కాదు. విద్యార్థులను ఎంపిక చేసేందుకు సుజిత్ ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేశాడు. ఈ ఎంపికలో ఐదు దశలు ఉంటాయి. ఇందులో వారి ఆర్థిక పరిస్థితితో పాటు చదువులో వారి స్థాయి ఎలా ఉందో కూడా పరిశీలిస్తారు. ఎంపిక చేసిన విద్యార్థులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాఫ్ట్ స్కిల్స్లో ట్రైనింగ్ ఇస్తారు. లబ్దిదారులకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ఇందులో అనాథ విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఆ తర్వాత 80 శాతం ఆడపిల్లలకు అవకాశం కల్పిస్తారు.
తమ ఉద్యోగాలు చేసుకుంటూనే...
ప్రస్తుతం చెన్నై కేంద్రంగా నడుస్తున్న 'మాత్రం' ఫౌండేషన్లో 8 మంది సహాయక సిబ్బంది ఉన్నారు. వీరందరూ తమ ఉద్యోగాలు చేసుకుంటూనే ఫౌండేషన్కు సహకరిస్తున్నారు. అందరూ కుటుంబ సభ్యుల మాదిరిగా కలిసి మెలిసి ఫౌండేషన్ అభివృద్ధికి సేవలు అందిస్తున్నారు. వీరందరి కృషితో ఫౌండేషన్ ఇప్పుడు ఐదు రాష్ట్రాలలో విజయవంతంగా నడుస్తున్నది. అయితే ఇంకా ఎక్కువ సమయం కేటాయించగలిగితే ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించవచ్చని సుజిత్ ఆలోచిస్తున్నాడు. ఈ 'మాత్రం' కుటుంబం కోసం పని చేస్తున్న వాలంటీర్లలో 92 ఏండ్ల వృద్ధుడు కూడా ఉండటం మరో విశేషం.
అనతి కాలంలోనే...
అతి తక్కువ కాలంలో ఫౌండేషన్ ఇంతగా వృద్ధి చెందేందుకు ముఖ్య కారణం టీం సభ్యుల వర్క్ డివిజన్. విద్యార్థుల కోసం మంచి కాలేజీలలో సీట్లు సంపాదించడం, ఇతర ఖర్చుల కోసం కావాల్సిన ఫండ్స్ సేకరణ సుజిత్ చూసుకుంటాడు. వారికి సరైన విద్య అందుతుందా, బాగా చదువుకునేందుకు కావల్సిన ఏర్పాట్లు ఉన్నాయా.. లేవా? అనే విషయాలు పునీత చూసుకుంటారు. సుజీత్ భార్య 'మాత్రం' హెల్ప్ లైన్ నెంబర్ను ఆపరేట్ చేస్తున్నారు.
అందరికీ ఉన్నత విద్య అందాలి
మాత్రం ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు మంచి ఉద్యోగాలు వచ్చేలా చేయడం కూడా వీరు తమ బాధ్యతగా తీసుకున్నారు. దీని వల్ల వారి కుటుంబాలు బాగుపడటమే కాకుండా వీరి సహకారంతో సంస్థ ద్వారా ఎంతో మందికి ఉన్నత విద్యను అందించవచ్చని సుజిత్ ఆలోచన. చెన్నైలోని ఓ టాప్ యూనివర్సిటీలో చదువుకుని ఐబీఎంలో ఉద్యోగం సంపాదించిన ఓ యువతి గురించి చెప్పాడు. తమళనాడులోనే అత్యంత వెనుకబడిన ఓ జిల్లా నుండి వచ్చిన ఆ అమ్మాయి 'మాత్రం' ద్వారా చదువుకుని ఐబీఎంలో ఇంటర్వ్యూకి వెళ్ళింది. అక్కడి వారు ఈమెను 'ఈ ఉద్యోగం నీకు ఎందుకు' అని ప్రశ్నిస్తే ''నా కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుండి తప్పించడానికి. మా ఇంట్లో ప్రస్తుతం 677 మంది సోదరులు, సోదరీమణులు ఉన్నారు. భవిష్యత్లో ఈ సంఖ్య పెరుగుతుంది. వీరందరికీ మంచి చదువును అందించాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఉద్యోగం చేయాలనుకుంటున్నా'' అని సమాధానం చెప్పింది.
మొహమాట పడను...
ఇంకా సుజిత్ మాట్లాడుతూ ''మా సంస్థ నడిచేందుకు మాకు పెద్ద ఎత్తున డబ్బు అవసరం లేదు. కాలేజీలకు వెళ్ళి ఎలాంటి మొహమాటం లేకుండా మా పిల్లలకు మీ కాలేజీలో ఫ్రీ సీటు ఇస్తారా? అని అడుగుతాను. వాస్తవానికి అంత పెద్ద కాలేజీలలో ఒకరిద్దరికి ఫ్రీ సీట్లు ఇవ్వడం వల్ల వాళ్ళకు నష్టం ఏమీ జరగదు. కానీ కొంత మంది నో చెబుతారు. అప్పుడు వేరే కాలేజీకి వెళ్ళి ఇదే ప్రశ్న అడుగుతాను. ఇలా మా పిల్లలకు సీట్లు దొరికే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను'' అంటున్నాడు.
ఇంకా ఎందరో ఉన్నారు
'మాత్రం' భవిష్యత్ ప్రణాళిక గురించి అడిగితే ''ఇంకా ఉన్నత విద్యను చేరుకోలేక ఇబ్బంది పడుతున్న పేద పిల్లలు మన దేశంలో ఎందరో ఉన్నారు. ప్రస్తుతం మేము కొందరికి మాత్రమే 'మాత్రం' ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. భవిష్యత్లో మా సేవలు మరింతగా పెంచాలి. ఇంకా ఎంతో మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. దీని కోసం మా భవిష్యత్ ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా ఎన్నో విద్యా సంస్థల సహకారం తీసుకోవల్సి ఉంది'' అంటున్నాడు సుజిత్.
ఇది మా కుటుంబం
''దీన్ని మేమెప్పుడూ ఓ సంస్థగా భావించం. ఓ కుటుంబంగా అనుకుంటాం. అలా అనుకుంటున్నాం కాబట్టే దీనికోసం శ్రద్దపెట్టి పని చేయగలుగుతున్నాం. మా ఇంట్లో పిల్లలు ఉన్నత విద్య అభ్యసించి మంచి ఉద్యోగాల్లో చేరితే ఎంత ఆనందిస్తామో మా 'మాత్రం' పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా అంతే ఆనందంగా ఉంటుంది. మా టీం సభ్యులు క్రమశిక్షణతో, సమర్థవంతంగా పని చేయడం వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది' అంటున్నాడు సుజిత్.
క్రమశిక్షణగా బతుకుతున్నాం
'మాత్రం' కేవలం పేద విద్యార్థుల జీవితాలనే కాదు మా జీవితాలను కూడా మార్చేసింది. ఇందులో పని చేయడం వల్ల క్రమశిశక్షగా బతుకుతున్నాం. గతంలో కేవలం 9 నుండి 5గంటల పని చేసుకుంటూ కొన్ని పరిమితులు పెట్టుకున్నాం. అది కాదు జీవితమంటే అని 'మాత్రం' ఏర్పాటు చేసిన తర్వాతనే తెలిసింది. ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి మంచి అవకాశం దొరికింది'' అంటూ సుజిత్ తన భావాలను వ్యక్తపరుస్తున్నాడు.
- సలీమ