Authorization
Mon Jan 19, 2015 06:51 pm
28 ఏండ్ల యువకుడు. మైక్రో ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఓ కవిగా రాటుదేలాడు. పాటలు పాడుతూ జగిత్యాల ప్రజల మనసు దోచాడు. నృత్య రూపకాలతో, జానపద కళలతో అందరినీ మైమరిపిస్తున్నాడు. అతనే గాలిపిల్లి చోళేశ్వరాచారి. సాధారణ కుటుంబంలో పుట్టి.. ఎవరి సహకారం లేకపోయినా స్వయం కృషితో ఓ కళాకారుడిగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతని పరిచయం ఈ వారం జోష్లో...
చోళేశ్వరాచారి... సొంత గూరు రాఘవపట్నం గ్రామం, గొల్లెపల్లి మండలం, జగిత్యాల జిల్లాలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. తండ్రి జయప్రకాష్, తల్లి దేవేంద్ర. చోళేశ్వర్కి ముగ్గురు అన్నలు. అతనికి చిన్నప్పటి నుండి బొమ్మల గీయడమన్నా, చిన్న చిన్న వస్తువులపై బొమ్మలు చెక్కడమన్నా ఆసక్తి. మూడో తరగతిలో ఉన్నప్పుడు మొదటి సారి తనకు నచ్చిన శివలింగాన్ని చాక్పీస్పై చెక్కాడు. అది చూసిన ఓ ఉపాధ్యాయుడు ఎంతో ప్రోత్సహించాడు. అప్పటి నుండి ఏ బొమ్మ చూసినా దాన్ని గీయడం, మనసుకు బాగా నచ్చితే చెక్కడం మొదలుపెట్టాడు. పదో తరగతికి వచ్చే సరికి అందులో నిష్ణాతుడయ్యాడు. బొమ్మలపై ఉన్న ఆసక్తితో డిగ్రీలో బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ సబ్జెక్టులుగా ఎంచుకున్నాడు.
తెలంగాణ ఉద్యమంలో...
కాలేజీ సావనీర్లో చోళేశ్వర్ గీసినవి, చెక్కినవి ప్రింట్ వేశారు. అది అతనికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అప్పటి వరకు అల్లరి చిల్లరిగా బొమ్మలు వేయడం, చెక్కడం, పాటలు, కవితలు రాసుకోవడం చేసేవాడు. తాను డిగ్రీలో ఉన్నప్పుడు మొదలైన తెలంగాణ ఉద్యమం అతని జీవితాన్ని మార్చివేసింది. ఇతను చిన్న చిన్న పారెడీ పాటలు రాస్తాడని తెలిసిన కాలేజీ లెక్చరర్ ఉద్యమం కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి గురించి ఓ పాట రాయాల్సిందిగా అడిగితే అప్పటి కప్పుడు...
''అందని ఆకాశంలో తారవై నిలిచిన ఓ నేస్తమా
నీ కోసం రగిలే జ్వాలలం మేమవుతాం
నీ బాటే మా బాటా నీ మాటే మా మాట
నీ పోరాటమే మా గీత...'' అంటూ ఓ చిన్న కవితను రాసి ఇచ్చాడు. తర్వాత రోజు ఉదయం ఆ కవిత బ్యానర్పై కనిపించింది. అది చూసి తను రాసింది నలుగురికీ నచ్చుతుందనే నమ్మకం వచ్చింది. అప్పటి నుండి తెలంగాణ ఉద్యమంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొని తన పాటలను, కవితలను వినిపించేవాడు. కవులతో, కళాకారులతో పరిచయాలు పెరిగాయి. అలా ఉద్యమ కాలంలో అతని పేరు జగిత్యాల మొత్తం ప్రచారమయింది.
మొదటి సారి ఎగ్జిబిషన్
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో తన స్నేహితుడితో కలిసి మొదటి సారి చాక్పీస్లపై చెక్కిన 98 కళారూపాలతో సెక్రటేరియట్లో ఎగ్జిబిషన్ పెట్టాడు. దాంతో జగిత్యాలకే పరిమితమైన అతని నైపుణ్యం హైదరాబాద్కి కూడా పరిచయమయింది. 2017లో హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు చింతపిక్కలపై 25 మంది కవుల పెయింటింగ్లు వేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతటి గొప్ప మహానుభావుల చిత్రాలను అంత చిన్న చింత పిక్కపై వేస్తే ఎప్పటికీ గుర్తుండి పోతారని ఆ ప్రయత్నం చేశాడు చోళేశ్వర్.
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్
చిన్నప్పుడు పాఠశాలలో తనను ప్రోత్సహించిన ఉపాధ్యాయుడే కాలేజీ రోజుల్లో మళ్ళీ ఓసారి కలిశాడు. మరింతగా పదునెక్కిన అతని నైపుణ్యాన్ని గమనించి ఓ పత్రికలో చోళేశ్వర్ కళల గురించి వచ్చేలా చేశాడు. అప్పటి నుండి అతనికి మరింత గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తెలిసిన సార్ తమ కాలేజీ తరపును 100 మంది పిల్లలతో కూచిపూడిలో గ్లోబల్ రికార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడకు అతను కూడా వెళ్ళి బొమ్మలు చెక్కి రికార్డ్ సాధించాలనుకున్నాడు. అలా 2012లో ఒకే చాక్పీస్పై 18 నిమిషాల్లో 12 బొమ్మలను చెక్కి 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్' సాధించాడు.
ఆర్థిక సమస్యలతో...
బొమ్మలైతే బాగా చెక్కుతాడు. కానీ వాటిని జాగ్రత్త చేయడం చాలా కష్టమయింది. చాక్పీస్లు కాబట్టి ఊరికే విరిగిపోతాయి. ఎవరైనా వచ్చి చూడటానికి తీసుకున్నప్పుడు చాలా సార్లు విరిగిపోయేవి. చేత్తో పట్టుకోకుండా చూడాలంటే వాటిని జాగ్రత్తగా భద్రపరచాలి. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బీఎఫ్ఏ టీటీసీ డిప్లొమా కోర్సు చేశాడు. ఆర్ట్ టీచర్గా చేరి పిల్లలకు తన కళను నేర్పించాలనేది అతని కోరిక. అలాగే తనకు కూడా కొంత ఆదాయం వస్తుంది. దాంతో తన కళను మరింతగా విస్తృత పరుచుకోవచ్చని భావించాడు. ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించాడు. కానీ రాలేదు. డబ్బు కోసం తల్లిదండ్రులపై ఆధారపడటం ఇష్టం లేదు. అందుకే ఎంతో నేర్చుకోవాలనే కోరిక ఉన్నా ఆర్థిక సమస్యలతో బంగారం పని చేస్తున్న అన్న దగ్గర పనిలో చేరాడు. ఆ వచ్చిన డబ్బుతో ఫైబర్ బాక్సులు తెచ్చుకొని వాటిని గమ్ముతో అతికించి తన కళారూపాలను భద్రపరుచు కుంటున్నాడు.
56 రకాల వస్తువులపై...
ఇప్పుడు అతను బస్సులో వెళుతూ కూడా బొమ్మ చెక్కగలడు. ఆవబద్ద, చింతపిక్క, పెన్సిల్ ముక్కు, కర్రముక్క, బియ్యపు గింజ, ఫైబర్, ఇనుము, గోల్డ్, సిల్వర్, మెటల్, వేస్ట్ మెటీరియల్, వైర్లు, బోల్డులు, నట్లు, మొబైల్ఫోన్లు, వుడ్, సిమెంట్, ఇసుకతో రెండు రకాలు, మట్టి, పువ్వులు, ఆకులు, గోరుపై, చాక్పీస్, పేపర్, సబ్బు, గులకరాళ్ళు, పండ్లు, పసుపు కొమ్ములు... ఇలా సుమారు 56 రకాల వస్తువులపై బొమ్మలు గీస్తాడు, చెక్కుతాడు.
లెన్స్ లేకుండానే..
మైక్రో ఆర్ట్ చేసే వారు చాలా మంది లెన్స్ ఉపయోగిస్తారు. కానీ అతను వాటిని ఉపయోగించాడు. మైక్రో ఆర్ట్లో ఇంత టాలెంట్ ఉన్న చోళేశ్వర్కి ఎడమ కన్ను చూపు సరిగా లేదు. చిన్నప్పుడు దెబ్బ తగిలి కంటికి సమస్య వచ్చింది. కుడి కన్ను మాత్రం బాగా కనిపిస్తుంది. ఆ కంటి చూపుతూనే వివిధ కళారూపాలను చకా చకా చెక్కేస్తాడు. మైక్రో కళలో ఇంత నైపుణ్య ఉన్న చోళేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు కోసం మూడేండ్ల ప్రయత్నించాడు. చివరకు 2018లో ఉత్తమ కళాకారుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి అవార్డు అందుకున్నాడు.
ఆశు కవిగా కూడా...
అందరిలాగే చోళేశ్వర్ కూడా గతంలో కవితలను పేపర్పైనే రాసుకునేవాడు. అయితే ఏదైనా సాహిత్య సమావేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ విన్న సామాజిక సమస్యలపై అప్పటికప్పుడు స్పందించి కవితలు అల్లడం మొదలుపెట్టాడు. దీన్ని మెరుగు పరుచుకునేందుకు పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆశు కవిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ విషయంలో జయశెట్టి రమణయ్యగారు అతని బాగా ప్రోత్సహించారని చెబుతున్నాడు. అలా తాను రాసుకున్న ఓ పల్లె కవిత...
''మేలుకున్న నీ పల్లెకు
జాడలెక్కడ వెదుకుతున్నావ్
ఇనికిపోయిన నీళ్ళకు
చెలిమిలెక్కడ తోడుతున్నావ్
కాదురా నీ బతుకు మట్టి వాసన
వర్షం పడ్డప్పుడే తెలుస్తుంది
ఆ నీటి జాడలు పల్లె పదాలు పల్లె ప్రకృతి
అవి ఇనికి పోయినప్పుడే తెలుస్తుంది
చెంబెడు నీళ్ళున్నప్పుడు
నీకు దప్పిక వేయదు కానీ
చుక్క నీరు లేనప్పుడు దప్పిక ఆగలేవురా''
అంటాడు చోళేశ్వర్.
ఇంకా..
ఎక్కడుందీ నా పల్లెటూరు
పట్టుకొమ్మలై జారిపోతుంటే
పక్షులు అన్నీ చేరెనా...
నా పల్లె ఇడిసీ పోవునా...
అంటూ పాడుకుంటాడు...
స్పాన్సర్ల కోసం వెదుకులాట
చోళేశ్వర్ ప్రస్తుతం మైక్రో ఆర్ట్లో గిన్నీస్ రికార్ట్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ రికార్డ్ కోసం ఒకటే చాక్పీస్పై 30 సెకండ్లలో 15 బొమ్మలు చెక్కాలి. గీసే టాలెంట్ అతనిలో ఉన్నా ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇంత పెద్ద రికార్డు సాధించేటప్పుడు ఎంతో ప్రచారం ఉండాలి. దాని కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకే ఎవరైనా స్పాన్సర్లు దొరుకుతారేమో అని ప్రయత్నిస్తున్నాడు.
ఉపాధి కల్పిస్తే...
''18 ఏండ్ల నుండి మైక్రో ఆర్ట్లో ప్రవేశం ఉంది. ఇప్పటి వరకు పేరు కోసం వేశాను. కానీ ఇప్పుడు పిల్లలకు ఈ కళను నేర్పించాలి. నేను ఆర్థిక సమస్యల వల్ల కొన్నింటిని ప్రాక్టీస్ చేయలేకపోయాను. ప్రభుత్వం నాకు టీచింగ్ చేసే అవకాశం కల్పిస్తే పది మందికి నా విద్యను నేర్పిస్తూ, నేనూ బతుకుతాను. పిల్లలకు నేర్పిస్తే భవిష్యత్లో సమాజానికి చాలా ఉపయోగం. అయితే పెద్ద వాళ్లకు నేర్పించేందుకు చాలా అవశాలు వస్తున్నాయి. కానీ పిల్లలు ఈ మైక్రో కళను నేర్చుకోవడం వల్ల వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మనసు నిలకడగా ఉంటుంది. ఎటువంటి చెడు ఆలోచలకు అవకాశం ఉండదు. అందుకే వీటిని స్కూల్ పిల్లలకు నేర్పించాలని నా కోరిక'' అంటున్నాడు చోళేశ్వరాచారి.