Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రిస్క్ తీసుకోకపోతే జీవితంలో మిగిలేది రస్కులే' అంటాడు సినీ హీరో మహేష్ బాబు. సరిగ్గా అలాంటి ఆలోచనలతో మన ముందుకు వచ్చాడు ఓ యువ మౌంటెనియర్. ఎవరెస్టు అందరూ ఎక్కుతారు. అందులో ప్రత్యేకం ఏముంది. నలుగురు నడిచిన దారిలో నడిస్తే ఆ గుంపులో మనం కేవలం ఓ భాగమౌతాం. మనమే ఓ కొత్త దారి సృష్టిస్తే నలుగురికీ స్ఫూర్తిదాయకమవుతాం. అలా కావాలంటే జీవితంలో ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అదే లక్ష్యంతో లెజండరీ మౌంటెనర్స్ని తయారు చేస్తానంటున్న ఆ యువ మౌంటెనియర్ భరత్ పరిచయం జోష్లో...
సొంత ఊరు కర్నూలు. మా నాన్న నాగరాజు మైనింగ్ బిజినెస్ చేసేవారు. ఆయన 2013లో చనిపోయారు. అమ్మ సుశీల హౌస్వైఫ్. నాకు ఇద్దరు అక్కలు. నా చిన్న తనంలోనే మా ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చేసింది. దాంతో నేను గుంటూరు జిల్లాలోని యనమదలలోని మోడల్ సైనిక్ స్కూల్లో చదువుకున్నా. మాది బోర్డింగ్ స్కూల్. మా స్కూల్లో ఎడ్యుకేషన్ కన్నా స్పోర్ట్స్కి చాలా ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ చదువుకున్న వాళ్లు చాలా మంది నావీ ఆఫీసర్, ఎయిర్ఫోర్స్, స్పోర్ట్వైపుకు వెళ్ళారు. మా స్కూలు చుట్టూ కొండలు ఉండేవి. ట్రెక్కింగ్కి కూడా తీసుకుపోయేవారు. అలా చిన్నప్పటి నుండి నాకు ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఏర్పడింది. ఇంటర్ గుంటూరులో చదువుకున్నా. తర్వాత పై చదువుల కోసం ఊటీ వెళ్ళాను.
అసలు విషయం తర్వాత తెలిసింది
ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత మౌంటేనింగ్ చేయాలనే ఆలోచన వచ్చింది. గూగుల్లో దీని గురించి బాగా సర్చ్ చేశా. డార్జిలింగ్లో సంబంధించిన కోర్సు చేశాను. నాన్న బాగా ప్రోత్సహించే వారు. అమ్మకు అసలు నేనేం చేస్తున్నానో తెలియదు. తను పెద్దగా చదువుకోలేదు. కాబట్టి అవగాహన లేదు. క్లైబింగ్ చేయాలంటే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది ఎవరెస్ట్. నాకూ అంతే. అయితే డార్జిలింగ్లో ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మనం ఫిట్గా ఉంటే చాలు ఎవరెస్టు ఎక్కేయ వచ్చు అనుకున్నా. కానీ ఆ తర్వాతనే తెలిసింది. అక్కడకు వెళ్లిరావాలంటే 25 లక్షలు ఖర్చు అవుతుందని. ఆ డబ్బు సేకరించుకోడానికి నాకు మూడేండ్లు పట్టింది. దీని కోసం జాబ్ చేశాను. స్పాన్సర్లను కలిశాను. చివరకు 2015లో వెళ్ళాను.
భూకంపంలో ఇరుక్కుని
2015లో ఎంతో కష్టపడి ఎవరెస్టు అధిరోహించేందుకు ప్రయత్నించాను. కానీ అప్పుడు భూకంపం వచ్చింది. అక్కడకు వెళ్ళిన చాలా మంది మంచు చెరియలు విరిగి పడి చనిపోయారు. అప్పుడు నేనూ అక్కడే ఉన్నాను. ఎలాగో బతికి బయటపడ్డాను. కానీ మూడు, నాలుగు రోజుల వరకు బయటి ప్రపంచంతో కమ్యూనికేషన్ లేదు. అప్పుడు మా అమ్మకు నేను చేస్తున్న పనేంటో అర్థమయింది. చాలా భయపడింది. కానీ నా మొండితనం తెలుసుకాబట్టి ఏమీ అనలేదు. అలా 2015లో నా ప్రయత్నం ఫలించలేదు. 2016లో వెళదామని ప్రయత్నించా. కానీ స్పాన్సర్లు దొరక్క వెళ్ళలేకపోయా.
ఎక్కాననే ఫీలింగ్ లేదు
మొదటి రెండు ప్రయత్నాలు ఫేయిల్ కావడంతో ఇంకా ఛాలెంజ్గా తీసుకున్నా. ఎలాగైనా ఎవరెస్ట్ అధిరోహించాలనే కసి పెరిగింది. చివరకు 2017 మే 13న అనుకున్నది సాధించా. కిందకు వచ్చిన తర్వాత అందరూ నా ఫీలింగ్ అడిగారు. కానీ నాకేమీ అనిపించలేదు. బహుశ ఎవరెస్టు ఎక్కేటప్పటి కంటే దాన్ని ఎక్కడం కోసం నేను చేసిన ప్రయత్నాలే కష్టంగా అనిపించాయి. అందుకే ఎవరెస్టు ఎక్కడం పెద్ద కష్టంగా అనిపించలేదు. దీనికి కారణం మరొకటి కూడా ఉంది. చాలామంది ఎవరెస్టు ఎక్కి గొప్పగా ఫీలవుతుంటారు. అది ఎక్కడం చిన్న విషయమని నేను అనను. అయితే ఎవరెస్టుతోనే ఆగిపోతున్నారు. అది నాకు నచ్చలేదు. హిమాలయాల్లోనే ఇంకా చాలా ఉన్నాయి. నిజంగా అడ్వెంచర్ చేయాలనుకున్నవారు మరిన్ని సవాళ్ళని స్వీకరించాలి. నేను అదే చేయాలనుకున్నా.
నాలా ఎవ్వరూ బాధపడకూడదు
మౌటెనియింగ్లో కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి. మనస్లు అధిరోహించాలని నా కోరిక. కానీ ఇప్పుడు అది చాలా కష్టం. దీనికి చిన్నప్పటి నుండి ట్రైనింగ్ ఉండాలి. 20ల్లో అయితే సాధ్యమవుతుంది. ప్రస్తుతం నేను 30ల్లో ఉన్నాను. భవిష్యత్తులో నాలా ఎవ్వరూ బాధపడకూడదు. అందుకే 2017లో 'బూట్స్ అండ్ క్రాపెయిన్స్' పేరుతో ఇనిస్టిట్యూట్ ప్రారంభించాం. 2018 నుండి దీని వర్క్ సీరియస్గా మొదలయింది. మా పెద్దక్క కూడా మౌంటెనియర్. తను కిలిమంజారో మూడు సార్లు ఎక్కింది. మా కంపెనీలో తను కూడా భాగస్వామి.
స్కూల్ స్థాయి నుండే...
కొత్త ప్రయోగాలు చేయాలంటే చిన్నతనం నుండే వారిలో అది ఇంజెక్ట్ చేయాలి. అందుకే స్కూల్ పిల్లలపై దృష్టిపెట్టాం. క్రికెట్, ఫుడ్ బాల్ ఆట ఎంత సాధారణమయిందో అలాగో మౌంటెనియింగ్ కూడా కావాలి. మరీ ముఖ్యంగా నెక్ట్ జనరేషన్కి ఇది పాస్ కావాలి. అదే మా ఇనిస్టిట్యూట్ ప్రధాన లక్ష్యం. రెండు తెలుగు రాష్ట్రాలలో స్కూల్ స్థాయి నుండి ట్రైనింగ్ మొదలుపెట్టాం. ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలలతో పాటు ప్రైవేట్ స్కూల్స్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ మధ్యనే బ్లయిండ్ స్కూల్ పిల్లలకు కూడా ట్రైనింగ్ ప్రారంభించాం. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ సహకారంతో గురుకుల పాఠశాల పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చాం. వారిలో 60 మంది అమ్మాయిలను సెలక్ట్ చేశాం. త్వరలోనే వారితో మౌంటెనింగ్ చేయించబోతున్నాం. సీతంపేటలో 600 మంది పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నాం. అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్తో కూడా వర్క్ చేస్తున్నాం. గత సంవత్సరం రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నా.
అంతకు మించి ఆలోచించాలి
హిమాలయాల్లో ఎవరెస్ట్ ఎత్తైన ప్రదేశం. కానీ దాన్ని ఇప్పుడు అందరూ తేలిగ్గా ఎక్కేస్తున్నారు. సంవత్సరానికి సుమారు వెయ్యి మంది ఎవరెస్టు ఎక్కుతున్నారు. లేదంటే కిలిమంజారో వెళుతుంటారు. ఇప్పుడు ఇది కేవలం సరదా ట్రిప్స్ మాత్రమే. వీటిలో రిస్క్ లేదు. అందుకే మౌంటెనియింగ్ అనేది కమర్షియల్ అయిపోయింది. బిజినెస్గా మారిపోయింది. అంతకు మించి ఆలోచించడం లేదు. అక్కడితో ఆగిపోతున్నారనే నా బాధ. హిమాలయాల్లోనే ప్రమాదకరమైన పర్వతాలు చాలా ఉన్నాయి. వాటి జోలికి వెళ్ళడం లేదు. రెండు నెలల కిందట 'లోట్సే' వెళ్లి వచ్చాను. ఇది చాలా ప్రమాదకరమైనది. మరొకటి 'ఛోయి' సెప్టెంబర్లో వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నా. ఆ తర్వాత 'మనస్లు', 'కాంచన్జంగా' కూడా వెళ్ళాల్సి వుంది. కాంచన్జంగా అన్నింటికంటే అత్యంత ప్రమాదమైనది.
ప్రమాదం వైపే అడుగేస్తా
హిమాలయాల్లో మొత్తం 18 సమ్మిట్లు ఉంటాయి. అందులో సెవన్ సమ్మిట్స్ సులభంగా చేరుకోవచ్చు. అందుకే చాలా మంది ఆ సెవన్ సమ్మిట్లనే ఎంచుకుంటారు. అవి చేయడం వల్ల పెద్దగా థ్రిల్ లేదని నా భావన. ఈ విషయం జనాలకు చెప్పాలంటే ముందు నేను పూర్తి చేయాలి. ఆ సెవన్ సమ్మిట్స్లో నేను పూర్తి చేయాల్సినవి ఇంకా రెండు ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తా. అప్పుడు ఈ విషయం గురించి గట్టిగా మాట్లాడతా. మిగిలిన ప్రమాదకరమైన వాటిపై దృష్టిపెడతాను. భవిష్యత్తులో మా ఇనిస్టిట్యూట్ ద్వారా లెజండరీ మౌంటెనియర్స్ని తయారు చేయాలి. అదే నా జీవితాశయం లక్ష్యం. దీని కోసం గ్రౌండ్ లెవల్ నుండి ప్లాన్ చేస్తున్నా.
శమ విలువ తెలుస్తుంది
ట్రెక్కింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎలా ఎదుర్కోవచ్చో తెలుస్తుంది. శ్రమ విలువ తెలుస్తుంది. అంతకంటే ఎక్కువ టీం విలువ తెలుస్తుంది. సాధారణంగా జీవన విధానం వేరు. మౌంటెనియింగ్ చేసేటప్పుడు వేరు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఒక్క సారి మౌంటెనియింగ్ చేస్తే మన జీవితమే మారిపోతుంది. మెంటల్గా, ఫిజికల్స్గా స్ట్రాంగ్ అవుతాం.