Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పదిమంది ముందు మనం గొప్ప వాళ్ళు అనిపించుకోవడంలో ఉండే కిక్కు మరెక్కడా దొరకదు. కష్టాలు వచ్చాయి కదా అని కన్నీరు కార్చుకుంటూ కూర్చుంటే జీవితంలో అక్కడే ఆగిపోతాం. అయినా జీవితంలో మనకు మొదటి సక్సెస్ని చూపించేది ఓటమే. మనకు నచ్చిన పనిని ఎంత కష్టమైనా చేస్తూ ఉండి పోవాలి. జీతం కోసం జీవితాన్ని ఎప్పుడూ త్యాగం చేయొద్దు. నచ్చని పనిని లక్షలు ఇచ్చినా చేయలేం. నచ్చిన పనిని లక్షలు ఇవ్వకపోయినా లక్షణంగా చేయొచ్చు. ఎవరో చెప్పినట్టు పరిగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్ళు తాగటం బెటర్ అని మనం కూడా పడక గదిలో పడకేసుకొని పడుకుంటే వేస్ట్. మనం పోయినప్పుడు నలుగురు మనల్ని మోయాలన్నా మనకంటూ ఓ ఐడెంటిటీ ఉండాలి. చచ్చే చివరి క్షణం కూడా నా చేతులో పెన్నూ, పేపర్ ఉంటాలి'' అంటున్నాడు 23 ఏండ్ల నవ యువకుడు
భరత్ బొల్లోజు. యువ కళాకారుడిగా, రచయితగా ఎన్నో అవార్డులు అందుకున్న అతను ఇప్పుడిప్పుడే సినీ ఇండిస్టీలో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు అడుగులు వేస్తున్నాడు. అతని పరిచయం ఈ వారం జోష్లో...
భరత్ బొల్లోజు... మహబూబాబాద్ జిల్లా, కొరివి మండలం, తిరుమలాపురం గ్రామంలో పుట్టాడు. తండ్రి బొల్లోజు ఉపేంద్రా చారి, తల్లి ఉపేంద్ర. తండ్రి పౌరోహిత్యం చేస్తుంటారు. తల్లి గృహిణి. భరత్కు ఇద్దరు అక్కలు... కోరివి గ్రామంలో పదవ తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రితో పాటు పౌరహిత్యానికి వెళ్ళేవాడు. చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడం, రాయడం అతనికి అలవాటయింది. 9వ తరగతి నుండే చిన్న చిన్న కథలు రాయడం మొదలుపెట్టాడు. గ్రామంలో అతను చూసిన సంఘటనలు, రైతుల సమస్యలను ఎక్కువగా రాస్తుండేవాడు. స్కూల్లో టీచర్లు ప్రోత్సహించేవారు. దాంతో పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమంలో భరత్ స్టేజ్పై కనిపించేవాడు. ఇంటర్, డిగ్రీ మహబూబాద్లో పూర్తి చేసి ప్రస్తుతం ఖమ్మం ప్రియదర్శిని కాలేజ్లో పీజీ సెకండియర్ చేస్తున్నాడు.
వెన్నుతట్టి ప్రోత్సహించారు
ఇంటర్కి వచ్చేసరికి భరత్ రాసిన కవిత్వానికి కాలేజీలో అభిమానులు పెరిగిపోయారు. దాంతో జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అక్షరాన్ని వదిలి పెట్ట కూడదు నిర్ణయించుకున్నాడు. మరింతగా రాయడం మొదలుపెట్టాడు. భరత్కు చిన్నతనం నుండి గోరేటి వెంకన్న పాటలంటే అమితమైన ఆసక్తి. సాహిత్యంపై చూపిస్తున్న ఆసక్తిని గుర్తించిన భరత్ను గోరేటి వెంకన్న వెన్నుతట్టి ప్రోత్సహించారు. అలాగే కె.విశ్వనాథ్గారి సినిమాలు కూడా భరత్ బాగా చూసేవాడు. వయసు పెరిగే కొద్దీ సినిమాల్లో నటించాలనీ, రచయితగా ఎదగాలనీ, డైరెక్టర్గా గొప్ప పేరు తెచ్చుకోవాలనే కోరిక అతనిలో బలపడింది. దీని కోసం అహర్నిశలూ కష్టపడుతున్నాడు.
ఇండిస్టీతో పరిచయం
మొదటి సారి 'నీ ప్రేమ కోసం' అనే షార్ట్ ఫిలిం తీశాడు. ఓసారి 'ఏమైంది ఈ వేళ' సినిమా కోసం వరంగల్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి. సినిమాల పట్ల ఆసక్తి ఉన్న భరత్ కూడా ఆ ఆడిషన్స్కు వెళ్ళాడు. అంతకు ముందే రైతుల సమస్యల గురించి ఓ షార్ట్ఫిలిం తీసాడు. అలాగే వరంగల్లో స్వప్నికా, ప్రణిత ఘటన జరిగినప్పుడు అమ్మాయిల మీద సమాజంలో జరుగుతున్న దాడులపై స్పందించి ఓ స్క్రిప్ట్ తయారు చేశాడు. ఆ తర్వాత 'వైశాఖం' సినిమా కోసం డైలాగులు రాశాడు. అయితే వాళ్ళు డబ్బులు ఇచ్చి పేరు వేయలేదు. అప్పుడే భరత్కు తమ్మారెడ్డి భరద్వాజా పరిచయం అయ్యారు. ఆయన పరిచయంతో ఇండిస్టీతో సంబంధాలు పెరిగాయి. ఇప్పటికి 14 లఘు చిత్రాలకు రచయితగా, హీరోగా, డైరెక్టర్గా చేసాడు. వీటిలో ఎనిమిది రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. యుఎస్లో జరిగే ఓ ప్రోగ్రామ్ కోసం ఓ షార్ట్ ఫిలిం పంపించాడు. ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ఓ సీరియల్కి డైలాగులు రాస్తున్నాడు. ఏది ఏమైనా సామాజిక విలువలు, కుటుంబం విలువలతో కూడిన సినిమాలు ప్రేక్షకులకు చూపించాలని ఇతని కోరిక.
ఎన్నో అవార్డులు...
2017లో రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ అంచితం శ్రీధర్ చేతుల మీదుగా ఖమ్మంలో జిల్లా ఉత్తమ రచయితగా విద్య వ్యవస్థపై రాసి కవితకు అవార్డు అందుకున్నాడు. అదే ఏడాదిలో రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనంలో పాల్గొని మాతృ భాష గురించి కవితలురాసి1000 మందిలో ఒక్కడిగా గెలిచి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ పొందాడు. మానుకోట జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక సాహిత్యంలో ఉత్తమ కవిగా అవార్డ్ గెలిచాడు. మహబూబాబాద్లోని తన కళాశాలలో సన్మానం పొందాడు. 2018లో యాదాద్రిలో జరిగిన శిల్ప కళా మహోత్సవంలో రైతుల సమస్యలపై స్క్రిప్ట్ రాసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నాడు. 2019 భరత్ రాసిన 'షీ' అనే షార్ట్ ఫిల్మ్తో పాటు ఎన్టీఆర్ గురించి రాసిన ఆర్టికల్కి ఎన్టీఆర్ ఎక్సలెన్స్ అవార్డ్ అందుకున్నాడు. ఈ పోటీలో 890 మందిలో పాల్గొనగా ఇతన్నే ఈ అవార్డ్ వరించింది. 2019 ఫిబ్రవరిలో బెస్ట్ రైటర్గా సర్టిఫికెట్ పొందాడు. 2019 మార్చి 30న గ్లోబల్ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ అమెరికా వాళ్ళు నిర్వహించిన కార్యక్రమంలో రైతుల గురించి, శ్రీ శ్రీ గారి గురించి ఆర్టికల్ రాసి నేషనల్ బెస్ట్ రైటర్ అవార్డు పొందాడు. అంబేద్కర్ 128వ వర్ధంతి సందర్భంగా భరత్ ప్రతిభను గుర్తించి జై బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు అంబేద్కర్ అవార్డ్, పురస్కారం అందజేశారు. 2019లో ఉత్తమ నటుడిగా ఎన్నికై రోశయ్య చేతుల మీదుగా యస్.వి ఆర్ ఎక్సలెన్స్ అవార్డ్ను త్యాగరాయగానసభలో అందుకున్నాడు.
వేలల్లో రచనలు
భరత్ ఇప్పటి వరకు రవీంద్ర నాధ్ ఠాగూర్ మీద 30 ఆర్టికల్స్ రాసాడు.10,250కి పైగా భావ కవిత్వాలు రాసాడు. 'నాలోని భావాలు' అనే పుస్తకాన్ని విడుదలకు సిద్ధం చేశాడు. ఈ పుస్తకం త్వరలోనే పాఠకుల ముందుకు రాబోతుంది. అంతే కాదు 20 వేల వరకు ప్రేమ కవితలను రచించాడు. అలాగే శ్రీ కృష్ణునిపై వందల సంఖ్యలో కీర్తనలు రాశాడు. 20కి పైగా జానపద, సినిమా పాటలు రాశాడు. అంతే కాదు భరత్ ఆసుకవి కూడా. ఇక ఆసు కవిత్వాలైతే లెక్కకు మించి ఉన్నాయి. తెలంగాణ శ్రీ శ్రీ కళా వేదిక మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడుగా సేవలు అందిస్తున్నాడు. ఈటీవీ ప్లస్లో ఓ ధారావాహికకు డైలాగులు రాస్తున్నాడు.
ఈ విధంగా తనలోని నైపుణ్యానికి పదునుపెడుతూ భిన్నమైన కథలతో మన ముందుకు వస్తున్న భరత్ భవిష్యత్లో తాను కోరుకున్నట్టు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ...
పేరు పెట్టమంటున్నారు
ఓ టీవీ ఛానల్లో ఓ సీరియల్కు డైలాగులన్నీ నేనే రాస్తున్నా. అయితే దానికి వాళ్ళు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు కానీ పేరు వేయడం లేదు. ఇది కాస్త బాధగా ఉంది. 'బస్టాప్' సినిమాలో హీరోగా నటించిన ప్రిన్స్ కోసం ఓ స్క్రిప్ట్ రాసుకున్నా. అలాగే తమ్మారెడ్డి భరద్వాజా తీయబోయే ఓ సినిమాకు కూడా కథ రాస్తున్నా. చాలా మంది కథలు అడుగుతున్నారు. 'మా తాత ఫౌంహౌస్' పేరుతో హీరో నాని కోసం కథ తయారు చేసుకున్నా. అయితే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కథ అడుగుతున్నారు. కానీ పేరు వేయమంటున్నారు. డబ్బు మాత్రం ఇస్తామంటున్నారు. ఇది చాలా కష్టంగా ఉంది.
మంచి సినిమాలు తీయాలి
ఇష్టం ముందు కష్టమేమీ పెద్ద కష్టం కాదు... అసలు జీవితంలో మనల్ని పెద్ద మెట్టు పైకి తెచ్చేది మన ఓటమి మాత్రమే. ఇప్పటి వరకు నేను రాసిన కొన్ని కథల వల్ల సినిమా రంగంలో నిలబడగలననే నమ్మకం ఏర్పడింది. 10 సంవత్సరాల పిల్లోడి నుండి 70 సంవత్సరాల ముసలితాత వరకు సినిమా చూసి బయటకు వచ్చాక 'గొప్పగా తీసాడు, గొప్ప కథ రాసాడు' అని చెప్పుకునేల మానవ సంబంధాల గురించి ఓ గొప్ప కథ రాయలనేదే నా కల. నన్ను కన్న తల్లిదండ్రులకు, నా ఊరికి మంచి పేరు తీసుకురావాలి. అలాగే తెలుగు సినిమా రంగంలో విశ్వనాథ్ గారిలా మంచి సినిమాలు తీయాలనేది నా లక్ష్యం.
- సలీమ