Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఒకప్పుడు అడవి బిడ్డలం. ఇప్పుడు అడవి వదిలేసిన బిడ్డలం. అడవి మీద హక్కులు పోయాయి. నిలబడ్డ నేల మీద కూడా హక్కులు లేకుండా పోయాయి. అందరి జీవితాల గురించి తెలీదు కానీ నా జీవితానికి, నా నేలకి, నా అనుభవాలకు నేను అతిథిని. ఇప్పుడు రోజూ నా స్థితి ఖలీల్ జిబ్రాన్ ''మాడ్ మ్యాన్'' కవితలా ఉంటుండేది. కలలో నాకో ప్రపంచం ఉంది. వాటి నుండి చాలా నేర్చుకుంటున్నాను. నా కవితలకు వస్తువులు ఎక్కువ అక్కడే దొరుకుతుండేవి'' ఓ ఇరవై రెండేండ్ల పిల్లోడి నుండి ఇంతటి వేధనా భరితమైన, బాధ్యతా యుతమైన మాటలు వినడం ఓ విధంగా ఆశ్చర్యమే. సమాజం కోసం, తన జాతి కోసం తపిస్తూ అక్షరాలనే ఆయుధాలుగా మలుచుకుని సమాజంతో యుద్ధం చేస్తున్నాడు ఆ యువకుడు. అతడే కార్తీక్ నాయక్. ఏ చోట అడుగుపెట్టినా బల్దేరుబండిని చేతపట్టుకొని సాహిత్య ప్రపంచంలో విహరిస్తున్న ఆ నవ యువకుడి పరిచయం అతని మాటల్లోనే...
నేను పుట్టింది జక్రాన్పల్లిలోని వివేక్ నగర్ తండా. అమ్మ సేవంత. కూరగాయలు అమ్మేది. నాన్న మోజీరాం. నాకు ఇద్దరు తమ్ముళ్ళు. ఇంట్లో నేనే పెద్దవాడిని. నాన్న కొంత కాలం దుబారులో పని చేసి వచ్చాడు. నాన్న ఐటిఐ వరకు చదువుకున్నాడు. కానీ ఉద్యోగం రాలేదు. అందుకే మమ్మల్ని బాగా చదివించాలని, మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని ఆయన కోరిక. ఆ కోరికతోనే మమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాడు. నేను చిన్నప్పటి నుండి హాస్టల్లోనే. కూరగాయలు అమ్మడానికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు అమ్మ నాకోసం హాస్టల్కి వచ్చేది. అమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ గేటు దగ్గరే నిలబడేవాడిని. ఆర్మూర్లోని శ్రీనికేతన్ స్కూల్లో రెండు ఏండ్లు చదువుకున్నా. చిన్నప్పటి నుండి ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడిని కాదు. ఆటలు కూడా చాలా తక్కువ. ఫ్రెండ్స్ ఎక్కువ లేరు. ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడిని.
ఇష్టమైన పని
ఆ తర్వాత ధర్మారమ్లో చదువుకున్నాను. అక్కడే పెయింటింగ్ నేర్చుకున్నా. స్కూల్ ప్రైవేట్ అయినా హాస్టల్ మాత్రం గవర్నమెంట్ది. పెయింటింగ్ బాగా వేసేవాడిని. మట్టితో కూడా రంగులు తయారు చేసి వేసేవాడిని. ఇది నాకు చాలా ఇష్టమైన పని. ఒక్కడినే రూమ్లో కూర్చొని పెయింటింగ్ వేసుకునేవాడిని. పెయింగ్ వేసి వాటికి క్యాప్షన్లు కూడా పెట్టేవాడిని. అక్కడ స్కూల్ వాతావరణం కూడా చాలా బాగుండేది. చాలా ఆనందంగా గడిచింది.
తిండి ఉండేది కాదు
నిజామాబాద్లోని చైతన్య స్కూల్లో చేరి గవర్నమెంట్ వెల్ఫేర్ హాస్టల్లో మూడేండ్లు ఉన్నా. హాస్టల్ భోజనంలో పురుగులు వచ్చేవి. దాంతో తిండి సరిగా తినాలనిపించేది కాదు. దాంతో చాలా మంది పిల్లలు బయట ఎప్పుడైనా ఫంక్షన్లు ఉంటే అక్కడకు వెళ్ళి పని చేసి వాళ్ళు పెట్టిన అన్నం తిని వచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు నేను కూడా వాళ్ళతో వెళ్ళేవాడిని. అప్పట్లో తిండి సరిగా తినకపోవడంతో ఆ ప్రభావం నా ఆరోగ్యంపై పడింది. అప్పుడే నా మొదటి కవిత 'నిద్ర వంతెన' రాశాను. అయితే అప్పటికి ఇదే కవిత్వమని తెలియదు.
కవిత్వమంటే తెలిసింది ఇక్కడే
ఆ తర్వాత నన్ను బోధన్ స్కూల్లో ఆరో తరగతి చేర్పించారు. స్టేజ్పైన డ్యాన్సులు, నాటికలు వేయడం అక్కడే మొదలయింది. బొమ్మలు కూడా బాగా వేసేవాడిని. 2009లో తెలంగాణ పోరాటం జరుగుతున్న సమయంలో మా టీచర్ ప్రోత్సాహంతో కవితల పోటీలో కూడా పాల్గొన్నా. కవిత్వం గురించి అప్పుడే తెలిసింది. అ స్కూల్లోనే రమేష్ పరిచయమయ్యాడు. ఓ అన్నలా ఆదరించాడు. గారాబం చేసేవాడు. అతని స్నేహం నాలోని భయాన్ని పోగొట్టింది. అలాగే అంతకు ముందు ఉన్న హాస్టల్లో కూడా రమేష్ అనే వ్యక్తే ఓ నాన్నలా నన్ను ఆదరించేవాడు. చాలా బాగా చూసుకునేవాడు. అలా రమేష్ అనే పేరు నా జీవితంలో ఓ మరిచిపోలేనిదిగా మారింది. ఆ అభిమానంతోనే బల్దేర్ బండి పుస్తకానికి నా పేరుతో పాటు రమేష్ కార్తిక్ నాయక్ అని ఆ పేరు కూడా కలిపి పెట్టుకున్నాను.
టీచర్లు మెచ్చుకోవాలని
బోధన్ స్కూల్లో ఉన్నప్పుడు కథల పుస్తకాలు బాగా చదివేవాడిని. ఆదివారం వచ్చే పుస్తకాల కోసం పెయింటింగ్ వేసి వాటికి రెండు లైన్లతో క్యాప్షన్లు పెట్టేవాడిని. పంచతంత్ర కథలను కాస్త మార్చి రాసేవాడిని. టీచర్లు మెచ్చుకునేవాళ్ళు. వాళ్ళు మెచ్చుకోవాలని ఇంకా వేసేవాడిని. తొమ్మిదో తరగతికి వచ్చేసరికి ప్రిన్సిపల్ ఇక రాయనీయలేదు. పదో తరగతికి ప్రిపేర్ కావాలని స్ట్రిక్ట్ చేశారు. బ్రెయిన్ ఫీడ్ అనే మ్యాగజైన్లో నా పెయింటింగ్ వచ్చింది. అప్పట్లో అది చాలా గొప్ప విషయం.
అధ్యయనం పెరిగింది
పదో తరగతి తర్వాత నాకు ఇష్టం లేకపోయినా ఉద్యోగం త్వరగా వస్తుందని ఇంట్లో వాళ్ళు మేడ్చల్ కాలేజీలో డిప్లొమా చేర్పించారు. నాకు లెక్కలు రావు. అందుకే వద్దని చెప్పా. కానీ వినలేదు. బ్యాక్ లాగ్స్ ఉండిపోయాయి. మొదటి రెండు సంవత్సరాలు పార్ట్టైం పనులు చేసుకుంటూ చదువుకునే వాడిని. డిప్లొమా చేస్తూ ఇంటర్ కూడా ప్రైవేట్గా చేరాను. హైదరాబాద్ రావడంతో సాహిత్య అధ్యయనం పెరిగింది. మెర్సీ కవి సంగమం పరిచయం చేసింది. కవిత్వం పట్ల అవగాహన పెరిగింది. ఎన్.గోపి, శివారెడ్డి, గుంటూరు లక్ష్మీ నర్సయ్య, యాకుబ్ గార్లు చాలా ప్రోత్సహించేవారు. సౌభాగ్య సార్ లైబ్రరీ నుండి పుస్తకాలు తెచ్చుకుని బాగా చదివేవాడిని.
ఇంగ్లీష్ చదువు వల్ల...
మొదట్లో సాధారణ కవిత్వాన్నే రాసేవాడిని. ఆ సమయంలోనే మహాశ్వేతాదేవి చనిపోయారు. బంజార కవిత్వం రాసే వారు ఇక ఎవరూ లేరు. నేను ఆ తెగకు సంబంధించే వాడిని కాబట్టి రాయాల్సిందిగా ప్రోత్సహించారు. దాంతో రాయడం మొదలుపెట్టాను. అప్పటి నుండి పుస్తకాలు సేకరించడం, చదవడం ఓ వ్యసనంగా మారిపోయింది. ఎప్పుడూ కాలేజీ, లైబ్రరీ తప్ప వేరే ప్రపంచమే తెలీదు. అమృత ప్రితామ్ కవిత్వం బాగా అనిపించేది. ఇంగ్లీష్ పుస్తకాలు బాగా చదివేవాడిని. నాన్న మంచి ఉగ్యోగం సంపాదించాలని నన్ను ఇంగ్లీష్ మీడియం చదివించాడు. అయితే ఆ చదువు నాకు మాత్రం అంతర్జాతీయ సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.
మా జీవితాలకు సింబల్
మా బంజారా జీవితాలకు ఎడ్ల బండితో అవినాభావ సంబంధం ఉంది. మా జీవితాల్లో ఎడ్ల బండి ఓ భాగం. దాన్నే మేం బల్దేరుబండి అంటాం. వలసలు వెళ్ళడానికి, పొలం వెళ్ళడానికి, కట్టెలు తెచ్చుకోడానికి ఇదే మాకున్న ఏకైక ప్రయాణ సాధనం. మరో ముఖ్య విషయం ఏమిటంటే ప్రసవానికి కూడా దీన్ని వాడేవారు. ఎడ్ల బండికి అంతటి ప్రాధాన్యం. వలస పోయినపుడు ఇదే మా వాళ్ళకు ఇల్లు. ఒక్క మాటలో చెప్పాలంటే మా జీవితానికి ఓ సింబల్. అందుకే నా కవిత్వం పుస్తకానికి 'బల్దేరుబండి' అని పేరు పెట్టుకున్నాను.
ఎందరి సహకారంతోనే...
2018లో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాను. అయితే మొదట్లో దీన్ని ప్రింటింగ్ చేయించడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందుకే 20 కాపీలు మాత్రమే వేయించా. 2018 డిసెంబర్లో నిజామాబాద్లో ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఆ తర్వాత 2019 జనవరిలో రవీంద్రభారతిలో ఆవిష్కరణ జరిగినపుడు మరో 50 కాపీలు వేసుకున్నా. ఆ తర్వాత పుస్తకాలు ప్రింట్ వేయించే స్థోమత లేక జిరాక్సులు తీసి పంచాలనుకున్నా. అయితే చాలా మంది ఇలాంటి కవిత్వం ప్రజల్లోకి వెళ్ళాలి. పుస్తక రూపంలోనే రావాలి అని చాలా సహకరించారు. ఒక్కరు కాదు ఎంతో మంది ఆర్థిక సహకారంతో నా 'బల్దేరు బండి' బయటకు వచ్చింది. వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా. ఈ పుస్తకం తెచ్చిన తర్వాత నాలుగు అవార్డులు వచ్చాయి. కేంద్ర సాహిత్య అకాడమీ వారు ట్రైబల్ లిటరరీ ఫెస్ట్ కోసం ఆహ్వానిస్తే పాల్గొన్నాను.
ప్రశ్నించే గొంతులు పెరుగుతున్నాయి
ఏది మంచి ఏది చెడు అనేది సాహిత్యం నేర్పుతుంది. మంచీచెడుల గురించి తెలిసినప్పుడు మన జీవితాన్ని మనం చక్కగా తీర్చిదిద్దుకోగలం. అయితే ఇటీవల కాలంలో సమాజానికి ఉపయోగపడే సాహిత్యంపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. ఇది చాలా బాధగా ఉంటుంది. ప్రభుత్వానికి తెలిసి కూడా మంచి సాహిత్యంపై దాడులు చేస్తున్నారు. ఈ దాడుల వల్ల కూడా యువత మరింతగా ఆకర్షించబడతారని నా నమ్మకం. మన దేశంతో పాటు, చాలా దేశాలలో ఇటీవల కమ్యూనిజం పట్ల యువతలో ఆసక్తి పెరుగుతుంది. ఆంక్షలు ఎంతగా పెరిగితే ప్రశ్నించే గొంతులు కూడా అంతగా పెరుగుతాయనడానికి ఇదే నిదర్శనం.
ప్రపంచానికి పరిచయం చేయాలి
ఇంత కష్టపడి పుస్తకం తీసుకు వస్తే చాలా మంది చదవకుండా పక్కన పడేస్తారు. అదే కాస్త బాధగా ఉంటుంది. ఇంటర్ చదివేటప్పుడు మా తండా జీవితాలను లోకానికి పరిచయం చేసి నోబుల్ తీసుకోవాలనే లక్ష్యం ఉండేది. ప్రస్తుతం నేను టీచర్ ట్రైనింగ్ చేస్తున్నా. మంచి ఉద్యోగం సంపాదిస్తే ఆర్థిక సమస్యలు ఉండవు. అప్పుడు రచనలు ఇంకా బాగా చేయవచ్చు. బంజారా జీవితాలను ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యం పెట్టుకున్నా. ఇటు నా అస్తిత్వాన్ని కాపాడుకుంటూ సాధారణ సాహిత్యం కూడా రాయాలి. సాహిత్యానికి నేను బానిసను. మా జీవన విధానం, సంస్కృతి, సమస్యలు, బాధలు, సమాజం మమ్మల్ని ఎలా చిత్రిస్తుంది, ఇతర సమాజం వల్ల నా వాళ్ళకు వస్తున్న సమస్యలు ఏమిటీ అలాగే మరుగున పడిపోతున్న చెంచు, గోండు, కోయ, లంబాడీ జీవితాల గురించి ప్రపంచానికి తెలియాలి. కేవలం తెలుగులో రాస్తే సరిపోదు. అందుకే ఇంగ్లీష్లో మా కవిత్వం రావాలి.
ఆటో బయోగ్రఫీ రాయాలి
అభివృద్ధి కూడా వినాశనానికి దారి తీస్తుంది అనేది నిజమౌతుంది. నల్లమలలో యూరేనియం తవ్వకాలే దీనికి నిదర్శనం. దీనిపైన కొన్ని కథలు ఇంగ్లీష్లో రాస్తున్నా. ఎప్పటికైనా ఆటో బయోగ్రఫీ రాయాలని కోరిక. చిన్నప్పడు చాలా కష్టపడ్డాం. అమ్మ పడిన కష్టాలు, అడవుల్లో మా జీవితాలు, దుబారుకి వలసలు వెళ్లడం, నాన్నకు దూరంగా ఉండటం ఇలా ఎన్నో భావాలు నన్ను వెంటాడుతుంటాయి. నా చిన్ననాటి అనుభవాలను రాయాలని ఉంది. ఫినరస్ హౌజ్ పేరుతో ఓ కథ రాశాను. 'ఏ ల్యాండ్ ఆఫ్ మహువా ట్రీస్' (విప్ప చెట్ల నేల) పేరుతో ఓ కథ రాస్తున్నా. నోబుల్ దాకా వెళ్ళలేకపోయినా మన తెలుగు రచనలు ప్రపంచానికి పరిచయం చేయాలి. మనం చనిపోయినా మన కంటూ ఓ పేరు ఉండాలి. అలాంటి సాహిత్యాన్ని సమాజానికి అందించాలి.