Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడేదీ వ్యక్తిగతం కాదు. అంతా సామాజికమే. ఆ సామాజిక బాధ్యత బాగా తెలిసిన యువకుడు లక్ష్మణ్ రుదావత్. అమ్రాబాద్ అడవుల్లోని మట్టి, ఇప్పపూల పరిమళం అతడు. నాగరిక సమాజానికి దూరంగా బతుకు పోరాటం చేస్తూ.. ప్రకృతితో మమేకమైన గిరిజన తండా నుంచి నర్స్గా ఎదిగొచ్చాడు. కేవలం తనకోసమే బతకకుండా... తన సమాజం కోసం పోరాటం చేస్తున్నవాడు. బయటి సమాజానికి సంఘటితంగా కనిపించినా... ఏనాడూ సంఘటిత పోరాటాలు చేయని నర్సుల హక్కుల గొంతుకైనాడు.
నాగర్కర్నూల్జిల్లా పదర మండలంలోని ఇప్పలపల్లి లక్ష్మణ్ స్వస్థలం. తల్లి నీల్య, తండ్రి సాలి. ప్రపంచపు భౌతిక సంపాదనలతో సంబంధం లేకుండా... ఆనందంగా గడిపే శ్రమైక జీవనం. ఎనిమిది మంది సంతానంలో ఆరో వ్యక్తి. తండాలో ఉన్న... ప్రాథమిక పాఠశాలలోనే రెండో తరగతి దాకా చదువుకున్నాడు. అంతకు మించి చదువులకోసం ఎక్కడికి వెళ్లాలో తెలియని తల్లిదండ్రులు. పొట్ట కూటికే సంపాదన తప్ప... పిల్లలను బయటికి పంపించి చదివించలేని ఆర్థిక పరిస్థితులు. బిడ్డ చాలా హుషారుగా ఉన్నాడు, తెలివి కల్లోడు. ఎలాగైనా చదివించాలనుకున్నాడు తండ్రి. పక్కనే ఉన్న గ్రామానికి వచ్చే పాస్టర్నడిగి... హైదరాబాద్లోని చర్లపల్లిలో క్రైస్తవ మిషనరీలో చేర్పించారు. మూడవ తరగతి నుంచి అక్కడే చదివాడు లక్ష్మణ్. మల్లాపూర్లోని ఝాన్సీ ఉన్నత పాఠశాలలో టెంత్ పూర్తి చేశాడు. ఈసీఐఎల్ లోని రత్న జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియటం చదివాడు. గిరిజన ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువ. అవన్నీ దగ్గరుండి చూసినవాడు. చదువుకునే అవకాశమే లేనిచోట... వైద్య విద్య అభ్యసించడమంటే అత్యాశే. అందుకే... మాసబ్ ట్యాంక్లోని మహావీర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో నర్సింగ్ కోర్స్ చేశాడు. అది పూర్తవ్వగానే ఓ హాస్పిటల్లో ఉద్యోగంలో చేరి రెండేండ్లు జనరల్ వార్డులో పని చేశాడు. ఇప్పుడు ఓ కార్పొరేట్ హాస్పిటల్లో చేఆర్థోపెడిక్ స్కర్బ్ నర్స్గా పనిచేస్తున్నాడు.
ఇష్టంతో నర్సింగ్లోకి...
కేవలం ఉద్యోగం మాత్రమే చేస్తే... ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అవసరమే రాకపోయేది. 2011లో కోర్సు పూర్తయిన వెంటనే... ఓ స్వచ్ఛంద సంస్థలో భాగమై తన బాధ్యతగా... గ్రామాలు, తండాలు, గిరిజన గూడాల్లో తిరిగి ఎయిడ్స్ వ్యాధి గురించి అవగాహన కల్పించాడు. అంతేకాదు.. ఓ బృందంగా గుజరాత్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల్లోనూ తిరిగారు. ఎంతో ఇష్టంతో, బాధ్యతతో వృత్తిలోకి వస్తే.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. నర్స్లంటేనే చిన్నచూపు. వారి సేవకు సరైన గుర్తింపు లేదు. ఇక సినిమాల్లో నర్స్లను చూపించే తీరు అవమానకరంగా ఉంది. ఎంతో సేవాభావం కలిగిన వత్తికి సమాజం ఇస్తున్న గుర్తింపు మరోలా ఉంది. అదొక్కటే కాదు... ప్రయివేటు నర్సింగ్ హౌంలలో పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు లేవు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నవారికి కనీస హక్కులు లేవు. హక్కులు అడుక్కుంటే రావు... పోరాడి సాధించుకోవాలి. అందుకు ఓ అసోసియేషన్ అవసరమని నర్సులతో చర్చించి... నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏర్పాటులో కీలక భాగస్వామి అయ్యాడు. నర్సింగ్ వృత్తిలోని జీవితాల్లో వెలుగు కాగడా అయ్యాడు. ప్రస్తుతం అసోసియేషన్ కన్వీనర్ బాధ్యతల్లో ఉన్నాడు లక్ష్మణ్.
అసోసియేషన్ ఏర్పాటు.. గుర్తింపు...
ఆరామ్గా చేసే నైన్ టూ ఫైవ్ ఉద్యోగాలు కావివి. ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు... అనునిత్యం అప్రమత్తతతో ఉండాలి. కానీ రాష్ట్ర స్థాయిలో నర్సులను ప్రోత్సహించడానికి ఎలాంటి ప్రోత్సాహకాలూ లేవు. ఎవరు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా బాధ్యతతో క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పనిచేస్తున్న వారిని గుర్తించి... మొదటిసారి నర్సింగ్ ఆఫీసర్స్ అసోసిషియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ నర్సుల దినోత్సవం నాడు రాష్ట్ర స్థాయి అవార్డులు అందజేశారు. 2018లోనూ దానికి కొనసాగింపుగా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న 35 మంది నర్సులను గుర్తించి సన్మానించారు. ఎవరి గుర్తింపు కోసమో కాదు... ఇదంతా వృత్తిపట్ల మరింత బాధ్యతను పెంచడానికేనంటాడు లక్ష్మణ్. అసోసియేషన్ తరపున ఇవ్వడం మొదాలుపెట్టాక... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయమ్మ అనే నర్సుకు అవార్డు ఇచ్చి సత్కరించింది.
హక్కులకోసం పోరాటం..
నర్సులనగానే మనకు ఆడవాళ్లే మదిలో మెదులుతారు. కానీ... కొన్ని విభాగాల్లో మగవాళ్ల అవసరాన్ని కూడా గుర్తించి ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసి అబ్బాయిలకు నర్సింగ్ వృత్తి చదువుకునే అవకాశాన్ని ఇచ్చింది. కానీ ఉద్యోగాల్లో మాత్రం ఆ అవకాశం లేదు. కారణం... ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్స్ కేవలం మహిళలకుగానే ఉన్నాయి. పురుషులకు అవకాశం ఇవ్వాలని హైకోర్టు సైతం చెప్పినా... అమలుకు నోచుకోలేదు. ఇద్దరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ విడుదల చేసిన ఒకే ఒక్క నోటిఫికేషన్కు... అర్హత పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఆపేశారు. ఇప్పటిదాకా ఆ ఉద్యోగాల ఊసే లేదు. దీనిమీద కొన్నేండ్లుగా పోరాటం చేస్తున్నాడు లక్ష్మణ్. చదువుకునే అవకాశమిచ్చి... ఉద్యోగంలో అవకాశం ఇవ్వకపోవడమేంటని ప్రశ్నిస్తున్నాడు. నర్సింగ్ వృత్తిలో ఉన్న వాళ్లంతా దళిత బహుజన సమూహాల నుంచి వచ్చినవాళ్లే. వారి సంక్షేమాన్ని పట్టించుకునే రాజకీయ పార్టీలే లేవు. నర్సింగ్ అసోసియేషన్ ఏర్పాటైన తరువాత... జెండర్తో సంబంధ లేకుండా సమాన ఉద్యోగం, ఉన్నత విద్య కు అవకాశాలు కలిపించాలని పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రయివేట్ ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్ నర్సులకు కనీస వేతనం ఇవ్వాలని ఉద్యమిస్తున్నారు.
డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని..
వైద్యవిధానపరిషత్, పబ్లిక్హెల్త్, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్... మూడు విభాగాల కింద నర్సులు పనిచేస్తున్నారు. ఇవన్నీ డాక్టర్ల చేతిలో ఉన్నవే. కానీ నర్సుల సమస్యలేంటో నర్సులకు మాత్రమే తెలుస్తుంది. మూడు విభాగాల కింది నర్సులను కలుపుతూ... రాష్ట్రంలో నర్సింగ్ డైరెక్టరేట్ స్థాపించాలనే డిమాండ్తో ముందుకెళ్తున్నారు. కేవలం నినాదంతోనే ఆగిపోలేదు. అసెంబ్లీ సాక్షిగా ప్రకటన వచ్చే విధంగా క షి చేశారు. అది ఆచరణ సాధ్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల నర్సింగ్ కోర్సులు చేసిన వారికి నాణ్యమైన విద్య అందుతుంది. ప్రత్యేక నర్సింగ్ డైరెక్టరేట్ ఉండడం వల్ల నర్సుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తుంది. ఫలితంగా నర్సింగ్ విద్యార్థులలో స్కాలర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల నర్సింగ్ విద్యార్థులు పరిశోధన దిశగా అడుగులు వేస్తారు. నర్సింగ్ జర్నల్స్ పెరుగుతాయి.
మూలాలను వెతుక్కుంటూ...
హక్కులకోసం పోరాడుతూనే... బాధ్యతలను మరిచిపోలేదు. మూలాలను వెతుక్కుంటూ ఆదివాసీ ప్రాంతాలకు పయనమయ్యాడు లక్ష్మణ్. ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి భద్రాచలం అడవుల్లో ఆదివాసీల ఆరోగ్యం, సంక్షేమం కోసం పనిచేస్తున్నాడు. రవాణా సౌకర్యంలేని ఎన్నో కోయ గూడాల్లోకి కాలినడకన వెళ్లాడు. అక్కడ పిల్లలు పోషకాహారలోపం, రకరకాల చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. మహిళల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉంది. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే... క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నర్సులను ఎంపవర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.
భద్రత కల్పించాలి..
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు మేం పనిచేస్తున్న నర్సింగ్ హౌమ్లు కాస్తా... కార్పొరేట్ వైద్యశాలలుగా మారతాయి. కానీ.. మా నర్సింగ్ ఆఫీసర్స్ జీతాలు పెరగవు. కనీస వసతులు ఉండవు. హాస్పిటల్స్లో దుస్తులు మార్చుకోవడానికి, తినడానికి... గదులు లేవు. వీటిమీద పర్యవేక్షణ కొరవడింది. సేవాదృక్పథం కలిగిన వృత్తులకు అంతే భరోసా, భద్రతా ఉండాలి. కానీ... మా నర్సులకే ఉద్యోగ, ఆరోగ్య భద్రత లేదు. ప్రభుత్వ మరియు ప్రేవేటు ఆసుపత్రిలలో పని చేసే ప్రతి నర్సింగ్ ఆఫీసర్ కు ఉద్యోగ, ఆరోగ్య భద్రతా కల్పించాలి. వైద్యశాఖలో పనిచేస్తున్న నర్సులకు హెల్త్ కార్డులు అందచెయ్యాలి. రాష్ట్రంలో చాలా ప్రయివేటు హాస్పిటల్స్లో కాలేజీ విద్యార్థులనే నర్సులుగా పని చేయిస్తూ... ప్రజల ఆరోగ్యానికి ప్రమాదంలో పడేస్తున్నారు. నర్సుల పోస్టులను భర్తీ చేయడం లేదు. రెండు రాష్ట్రాలలో నర్సింగ్ డైరెక్టరేట్ను నియమించాలి. వైద్యులను నియమిస్తన్నట్టుగానే.. ప్రభుత్వ వైద్యశాలల్లో ఉన్న ఖాళీగా ఉన్న 3,843 నర్సు పోస్టులను భర్తీ చేయాలి.
- కట్ట కవిత