Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు ఫీజు కట్టేందుకు డబ్బు లేక ఇతరులపై ఆధారపడ్డాడు. గొర్లు కాశాడు, కూరగాయలు అమ్మాడు,సర్వర్ బారుగా అవతారమెత్తాడు, ప్యాకింగ్ చేశాడు, గోడలకు పెయింటింగ్ వేశాడు, ఏటీఎం వద్ద సెక్యూరిటీగా బతికాడు. చివరకు సంఘాలంటూ తిరిగితే ఎందుకూ పనికిరావు అన్న ఊర్లో మొట్టమొదటి గెజిటెడ్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాడు. అతనే ప్రస్తుత నకిరేకల్ నియోజక వర్గ ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ అధికారి రావుల విద్యాసాగర్.
అతని పరిచయం అతని మాటల్లోనే...
మాది ఇబ్రహీంపట్నం దగ్గరలోని యాచారం మండలం, ధర్మన్నగూడ గ్రామం. నాన్న రావుల కొమరయ్య, అమ్మ అండాలు. వ్యవసాయం చేసేవారు. అమ్మ కూరగాయలు కోసి కొత్త కోట మార్కెట్లో అమ్మేది. అప్పుడప్పుడు అమ్మతో పాటు నేను కూడా పోయేవాడిని. మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఏడో తరగతిలోనే చదువు మానేయాల్సి వచ్చింది. గొర్లు మేపడానికి పోయేవాడిని. అప్పుడే చెయ్యి కూడా ఇరిగింది. చదువు పాడైపోతుందని మా బాబాయి సుధాకర్ ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) వాళ్ళతో మాట్లాడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేర్పించాడు. పది వరకు అక్కడే చదివా. ఎనిమిదో తరగతి నుండే ఎస్ఎఫ్ఐలో పని చేసేవాడిని.
డాక్టర్ కావాలనే కోరికతో : ఎస్ఎఫ్ఐ క్లాసులు విని అంటరాని తనం గురించి ప్రశ్నించేవాడిని. అందుకే సంఘంలో పని చేయడం ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు. ఇలాంటి సంఘాల్లో పని చేస్తే దేనికీ పనికి రారంటూ తిట్టేవాళ్ళు. చిన్నప్పటి నుండి డాక్టర్ కావాలని నా కోరిక. ఇంట్లో ఆర్థిక సమస్యలు. నా చదువుకు సహకరించే పరిస్థితి లేదు. ఎస్ఎఫ్ఐ వాళ్ళు చేసిన సాయంతోనే ఇంటర్లో బైపీసీ తీసుకున్నా. ఇంటర్ తర్వాత ఎంసెట్ లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకున్నా. మొదటి సారి రాసినప్పుడు 11 వేల ర్యాంకు వచ్చింది. మెడిసిన్లో సీటు రాలేదు. అగ్రికల్చర్లో వచ్చేది. అప్పట్లో దీని గురించి అవగాహన లేక తీసుకోలేదు. రెండో సారి రాసినప్పుడు 4225వ ర్యాంక్ వచ్చింది. బి కేటగిరిలో సీటు వచ్చింది. అయితే కనీసం 70 వేలైన కడితే తప్ప జాయిన్ అవ్వడానికి అవకాశం లేదన్నారు. డబ్బులేక వదిలేశా. అప్పుడే అగ్రికల్చర్, హార్టీకల్చర్, వెటర్నటీ ఇలా అన్నింటిలో సీటు వచ్చింది. ప్రొ||రామకృష్ణ అనే సార్ హార్టీకల్చర్ చేయమని సలహా ఇచ్చారు. దాంతో అందులో చేరాను.
డొనేషన్ అడిగి చేర్పించారు : 2010లో రాజేంద్రనగర్లోని యూనివర్సిటీలో బిఎస్సీ హార్టీకల్చర్లో చేరా. ఏడు వేలు ఫీజు కట్టాలి. అవి కట్టేందుకు కూడా నా దగ్గర లేకపోతే ఎస్ఎఫ్ఐ వాళ్ళే ఎవరి దగ్గరో డొనేషన్ అడిగి చేర్పించారు. హాస్టల్లో ఫీజు కట్టలేక మూడు నెలలు ఎస్ఎఫ్ఐ ఆఫీసులోనే వున్నా. అప్పుడే విజరు అనే కరాటే మాస్టర్ ఉండేవాడు. ఆయన నా గురించి విని తన కరాటే విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేసి హాస్టల్ ఫీజు కట్టాడు. ఇలా ఎస్ఎఫ్ఐ వాళ్ళు నా చదువుకు చాలా సహకరించారు. యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఐగా ఎన్నో పోరాటాలు చేశాం. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హెచ్.ఓ, హెచ్.ఇ.ఓ పోస్టుల కోసం ఆరు రోజులు ఆమరణ నిరాహారణ దీక్ష చేశాం. అందులో నేనూ పాల్గొన్నా. చివరకు పోస్టులు సాధించుకున్నాం.
ఇక ఆధారపడకూడదని : కాలేజీలో చేరిన తర్వాత రికార్డులు, ప్రాజెక్ట్వర్క్లు, పుస్తకాలంటూ చాలా ఖర్చులు ఉంటాయి. ఇక ఎవరి దగ్గరా తీసుకోవడం బాగోదని ఓ హౌటల్లో సర్వర్ బారుగా పని చేశా. అది నచ్చక ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో ప్యాకింగ్ చేయడానికి వెళ్ళా. కాలేజ్కి వెళ్లడానికి టైం సెట్ అయ్యేది కాదు. పైగా ఫ్యాక్టరీలో వాసన కూడా పడలేదు. దాంతో గోడలకు పెయింటింగ్ వేసే పనిలో చేరా. చేతులకు బొబ్బలు వచ్చి రక్తం కారేది. అది నా స్నేహితురాలు స్వప్న చూసి వాళ్ళ అమ్మకు చెప్పి ఏటీఎం దగ్గర సెక్యూరిటీగా ఉద్యోగం ఇప్పించింది. రాత్రి ఏటీఎం దగ్గర, పగలు కాలేజీ. రికార్డులు రాసుకోవడం, చదువుకోవడం అన్నీ ఏటీఎం దగ్గరే. యూనివర్సిటీలో ప్రొఫెసర్ సైదయ్య సార్ కూడా ఎంతో సహకరించారు. అలా అందరి సహకారంతో ఆ కోర్సు పూర్తి చేశా.
కిసాన్ కాల్ సెంటర్లో జాబ్ : తర్వాత పీజీ చేయాలనుకున్న. ఎంట్రన్స్ రాస్తే ర్యాంకు రాలేదు. అప్పుడు చాలా బాధపడ్డా. తర్వాత ఖమ్మంలోని అశ్వరావుపేట హార్టీకల్చర్ రీసెర్చ్ సెంటర్లో మూడు నెలలు జాబ్ చేశా. ఖమ్మం కన్నా హైదరాబాద్లో వుంటేనే బాగుంటుందని మళ్ళీ హైదరాబాద్ వచ్చేశా. 2015లో కిసాన్ కాల్సెంటర్లో జాబ్కు అప్లయి చేసి, ఇంటర్యూకి కూడా వెళ్ళా. దాని రిజల్ట్ వచ్చే వరకు ఖాళీగా ఎందుకని ఓ రెస్టారెంట్లో చేరా. అక్కడ ఒక్క నెల మాత్రమే చేశా. రెండో నెల వచ్చే సరికి కిసాన్ సెంటర్ నుండి కాల్ వచ్చింది. వెంటనే అక్కడ చేరిపోయా. రెండ్లేకు పైగానే అక్కడ పని చేశా. డిగ్రీలో పరిచయమై ఉద్యోగం వచ్చే వరకు అన్ని విధాల నాకు సహకరించిన సుకన్యను ప్రేమించి పెండ్లి చేసుకున్న. మాకు ఓ పాప. పేరు చేర్విత.
మనసును కలచివేసింది : పంటలకు సంబంధించి తమ అనుమానాలు తీర్చుకునేందుకు రైతులు మాకు ఫోన్లు చేసేవారు. ఎనుమాముల మార్కెట్ నుండి ఓ పత్తి రైతు నుండి నాకు ఫోన్ వచ్చింది. సుమారు 20 నిమిషాల పాటు ఆ రైతుతో మాట్లాడా. ఆ తర్వాత రోజు ఆ రైతు గుండె ఆగి మార్కెట్లోనే చనిపోయాడు. అది నన్ను చాలా బాధపెట్టింది.
హార్టీ కల్చర్ ఆఫీసర్గా : రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయనే దానిపై స్టడీ చేయడం మొదలుపెట్టా. ఆ ఆలోచనతోనే ప్రొఫెసర్ జయశంకర్ యూని వర్సిటీకి పీజీ ఎంట్రన్స్ రాశా. 11వ ర్యాంక్ వచ్చింది. 2016లో పీజీ అగ్రి బిజినెస్ మానేజ్మెంట్లో చేరా. అప్పటికే ఉద్యానవన శాఖలో ఉద్యోగం కోసం పరీక్ష రాశాను. ఆ రిజల్ట్ 2017లో వచ్చింది. పీజీ చేస్తున్నప్పుడే 2017లో నల్లగొండలోని నకిరేకల్ నియోజక వర్గం హార్టీ కల్చర్ అధికారిగా పోస్ట్ వచ్చింది. అప్పటికే రైతుల గురించి, మార్కెట్ గురించి స్టడీ చేసి వున్నాను. ఆ అనుభవం నా ఉద్యోగంలో ఉపయోగపడింది. చేరిన వెంటనే రైతుల కోసం ఓ వాట్సాఫ్ గ్రూపు క్రియేట్ చేశాం. తమకు ఎలాంటి సమస్యలు వచ్చినా రైతులు ఆ గ్రూపులో పెడతారు. వాటికి మేము సమాధానాలు పెడు తుంటాం. అలాగే రైతులకు పంటల గురించి సలహాలు సూచనలు ఇస్తూ వివిధ పత్రికలకు వ్యాసాలు కూడా రాస్తున్నా. రైతు కుటుంబంలో పుట్టి రైతుల కోసం ఈ మాత్రమైనా చేస్తున్నందుకు నాకెంతో తృప్తిగా వుంది.
రైతులే అమ్ముకునేలా...
నకిరేకల్ నియోజక వర్గంలో నిమ్మ బాగా పండుతుంది. అయితే ధర మాత్రం లేదు. 600 కాయలు వుండే ఓ నిమ్మ బస్తాకు కేవలం 10, 20 రూపాయలు మాత్రమే వచ్చేవి. మహా అయితే 50 రూపాయాలు. ఇంతకు మించి ధర పలికేది కాదు. దాంతో కుప్పలు కుప్పలుగా నిమ్మకాయలు రోడ్డుపై పడేసే వాళ్ళు. మధ్య దళారుల వల్ల రైతులు నష్టపోతున్నారు. ఆ సమస్య పరిష్కరించాలనే ఆలోచన వచ్చింది. రైతులే డైరెక్ట్గా తమ పంటను అమ్ముకోవాలి. టెక్నాలజీని ఉపయోగించి పంటలు పండిచాలి. దాని కోసమే ఓ సొసైటీ ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో చేరడానికి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు. దీని కోసం వెబ్ సైట్ కూడా ఒకటి ఓపెన్ చేయబోతున్నాం. దీని వల్ల నిమ్మ రైతులకు మంచి ధర వచ్చే అవకాశం వుంది.
- సలీమ