Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మల్టీమీడియా ఇప్పుడు యువతను ఆకట్టుకుంటున్న రంగం. కాస్త క్రియేటివిటీ వుంటే చాలు దూసుకుపోవచ్చు. అందుకే ప్రస్తుతం దీనికి అంతటి ఆదరణ. అయితే ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అందుకే చాలా మంది యువత కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. అలాంటి
వారికి కోసమే తను ఎదుగుతూ నలుగురికి చేయూత నివ్వాలనే ఆలోచనతో కంపెనీ స్థాపించాడు ఓ యువకుడు. అతనే 'మానీ
యానిమేషన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్' (మల్టీమీడియా ప్రొడక్షన్ అండ్ ట్రైనింగ్ అకాడమీ) ఫౌండర్ సీఈఓ నాగేశ్వరరావు మాగులూరి. అతని గురించి మరిన్ని విశేషాలు ఈ వారం జోష్లో...
నాగేశ్వరరావు సొంత ఊరు గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట. తండ్రి మాగులూరి అమర్, తల్లి పెద్దమ్మాయి. స్కూలింగ్ పాలపాడు, నర్సరావుపేటలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పీజీ పబ్లిక్ అడ్మిషన్ చేశారు. చదివింది ఆర్ట్స్ అయినా చిన్నతనం నుండి మల్టీమీడియా అంటే ఎంతో ఇష్టం. పీజీ తర్వాత ఏదైనా టీచర్ జాబ్ చూసుకొమ్మని తండ్రి చెబుతున్నా తనకున్న ఆసక్తితో మల్టీ మీడియా నేర్చుకోవాలనుకున్నారు. ఆ సమయంలో మేనత్త అతన్ని ఎంతో ప్రోత్సహించింది. ఆర్థికంగా కూడా సహకరించింది. ఆమె సహకారంతో ఏడాది పాటు హైదరాబాద్లో మల్టీమీడియా కోర్సు చేశారు. ఆ తర్వాత చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. ఆ సమయంలోనే తండ్రి అనారోగ్య కారణంతో అనివార్యంగా సొంత ఊరు చేరుకున్నారు.
కుటుంబ అవసరాల కోసం : 2009 నాటికి నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో మల్టీమీడియాలో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా జీతం తక్కువ. దాంతో కుటుంబం కోసం మల్టీ మీడియా కోరికను పక్కన పెట్టి పురుగుమందు కంపెనీలో చేరారు. ఆ ఉద్యోగం చేస్తున్నా మనసులో మల్టీ మీడియాపై కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. 2011లో తండ్రి మరణం అతన్ని కాస్త కలచివేసింది. 2012లో పెండ్లి తర్వాత ఓ ఏడాది పాత ఉద్యోగాన్నే కొనసాగించారు.
కల నెరవేరింది : 2013లో 'లైఫ్ ఆఫ్ పై' సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్లో అస్కార్ అవార్డు వచ్చింది. ఆ వార్త అతనిలో కొత్త ఉత్సాహాన్నిచ్చింది. మళ్ళీ మల్టీ మీడియాలోకి వెళ్ళాలనే ఆలోచన కలిగింది. అతని ఆలోచనకు భార్య, కుటుంబ సభ్యుల సహకారం కూడా తోడయింది. గుంటూరులో దీనికి సంబంధించిన ఓ ఇనిస్టిట్యూట్ వుందని ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని కలిశాడు. అక్కడ అతని కల నెరవేరింది. మల్టీమీడియా, విజువల్ ఎఫెక్ట్ ఫ్యాకల్టీగా చేరి ఓ ఏడాది చేశాడు. 2014లో వాళ్ళు విజయవాడకు బదిలీ చేశారు.
మరింత పదును పెట్టి : విజయవాడ వెళ్ళిన తర్వాత ఓ యానిమేషన్ కంపెనీలో మంచి అవకాశం వచ్చింది. అది ఓ మల్టీమీడియా అకాడమీ. అందులో విద్యార్థులను చేర్చడం కోసం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేరారు. అంతకు ముందు ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు కేవలం క్లాస్ రూంకే పరిమితమైన అతనికి ఇదో కొత్త అనుభవం. ఇక్కడే తన ఆలోచనలకు మరింత మదును పెట్టారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో మల్టీమీడియాపై ఎన్నో సెమినార్లు, వర్క్షాపులు నిర్వహించారు. గ్రామాలకు వెళ్ళి చదువు మధ్యలో ఆపేసిన యువతకు అవగాహన కల్పించారు. అందులోనే మూడేండ్లు పని చేసి వందల మందికి మల్టీమీడియాపై అవగాహన కల్పించారు. ఇది అతనికి ఎంతో తృప్తినిచ్చింది. బెస్ట్ మార్కెటింగ్ మానేజర్గా అవార్డు కూడా అందుకున్నాడు.
సొంతంగా కంపెనీ : మల్టీమీడియాలో కోర్సు ఎంతో ఖర్చుతో కూడుకున్నది. గ్రామాలకు వెళ్లినప్పుడు కింది స్థాయి వారికి ఈ కోర్సు అందుబాటులో లేదని గ్రహించారు. అందుకే కాస్త కష్టమైనా సొంతంగా ఓ కంపెనీ పెట్టాలనుకున్నారు. యువతకు అతి తక్కువ ఖర్చుతో ట్రైనింగ్ ఇవ్వాలని తపించారు. 2018లో కంకిపాడులో 'మానీ యానిమేషన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్' ప్రారంభించారు. ఆ తర్వాత విజయవాడలో బ్రాంచ్ స్థాపించారు. అప్పటికే రెండు కంపెనీల్లో పని చేసిన అనుభవం. ఆ అనుభవానికి మరింత నైపుణ్యాన్ని జోడించి తన కంపెనీని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు.
ఇకపై అకాడమీ దృష్టి : తక్కువ ఖర్చుతో విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వాలంటే ముందు కంపెనీ ఆర్థికంగా స్థిరపడాలి. అందుకే ప్రస్తుతం టీవీ ఛానల్స్కు, కార్పొరేట్ కంపెనీలకు యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ లాంటి సేవలు అందిస్తున్నారు. అస్ట్రేలియాలో ఓ టీవీ ఛానల్కు, విజయ వాడలోని కొన్ని హాస్పిటల్కు వర్క్ చేస్తున్నారు. తక్కువ కాలంలోనే క్వాలిటీ వర్క్ అందిస్తారు అనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడిప్పుడే కంపెనీ కాస్త ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. అందుకే ఇకపై అకాడమీ పై దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ఈ ఏడాది వంద మంది విద్యార్థులను ట్రైనింగ్ ఇవ్వాలని, వంద కంపెనీలకు ప్రొడక్షన్ వర్క్ చేయాలని టార్గెట్ పెట్టు కున్నారు.
విస్తృతమైన అవకాశాలు
భవిష్యత్తులో నా అకాడమీని కాలేజీగా, ఓ యూనివర్సిటీగా అభివృద్ది చేయాలి. సాధ్యమైనంత వరకు కింద స్థాయి యువతకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే యువత నిర్భయంగా రావొచ్చు అనే నమ్మకాన్ని కలిగించాలి. ఇప్పటికీ చాలా మంది చదువంటే కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమే అనుకుంటున్నారు. మల్టీమీడియాలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అన్ని భాషల్లో కలిపి ఏడాదికి వేలల్లో సినిమాలు రిలేజ్ అవుతాయి. అలాగే అన్ని భాషల్లో కలిపి సుమారు రెండు వేల టీవీ ఛానల్స్ వుంటాయి. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే లక్షల్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటి ప్రచారానికి యాడ్స్ అవసరం. అలాగే సోషల్ మీడియా పేజెస్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సినిమాలు ఇలా అన్నింటికీ యానిమేషన్ అవరమే. అయితే వీటన్నింటికీ పని చేసేందుకు సరిపడా ఉద్యోగులు లేరు. మా లాంటి అకాడమీల్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకు ఆ కంపెనీల్లో పని దొరుకుతుంది. మల్టీమీడియాకు ఆస్కార్ లెవల్లో అవార్డులు ఉన్నాయంటే ఎంత ప్రాధాన్యం వుందో గుర్తించవచ్చు. మధ్యలో చదువు మానేసిన వారికి మల్టీమీడియా ఓ మంచి అవకాశం. మరో విషయం మిగతా ఫీల్డ్లో మాదిరిగా ఒకరిని ఒకరు తొక్కేసే అవకాశం ఈ ఫీల్డ్లో ఉండదు. ఎవరి టాలెంట్ను బట్టి వాళ్ళు స్వతంత్రంగా ఎదగొచ్చు. వారి నైపుణ్యాన్ని బట్టి పది వేల నుండి రెండు లక్షల వరకు జీతం తీసుకోవచ్చు.