- తహశీల్దార్ ఎదుట తుర్కాశిపల్లివాసుల నిరసన నవతెలంగాణ, గంభీరావుపేట : 'మేము 40ఏండ్లుగా గుడిసెల్లో నివసిస్తున్నాం. మాకూ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించాలి' అని మండలంలోని సముద్రలింగాపూర్ అనుబంధ గ్రామం తుర్కాశిపల్లివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. అంతకు ముందు అమరవీరుల స్థూపం నుండి ర్యాలీ వచ్చిన వారు తహశీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. చలికి వణుకుతూ, వానకు నానుతూ, ఎండలకు ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు తాము అర్హులమని, తమకు వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీరికి స్థానిక సీపీఐ నాయకులు జంగంపల్లి లచ్చయ్య, వడ్డెపల్లి లక్ష్మణ్, బాషుమియా, షాదుల్లా, సీఐటీయూ మండలాధ్యక్షుడు ముద్రకోల ఆంజనేయులు తమ సంఘీభావం తెలిపారు.