- రెండేండ్లుగా సీనరేజ్ లేదు
- బీఆర్జీఎఫ్, 13 ఫైనాన్స్ నిధులు నిలిపివేత
- నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం
ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి బదులు నీరుగారుస్తోంది. రెండేండ్లుగా నిధుల్లేక విధులు నిర్వహించడం కష్టతరంగా మారింది. సీనరేజ్తోపాటు బీఆర్జీఎఫ్, 13వ ఫైనాన్స్ నిధులు కూడా నిలిపివేశారు. దీంతో ఏఒక్క పని కూడా ముందుకు కదలడం లేదు. గత సంవత్సరం ప్రజాప్రతినిధులకు సైతం జీతాలు కరువయ్యాయి. ఈ పరిస్థితుల్లో మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనుంది.
నవతెలంగాణ, కరీంనగర్ ప్రతినిధి
జిల్లా పరిషత్... స్థానిక సంస్థల్లో అత్యున్నత పీఠం. అలాంటిది ఇప్పుడు జవసత్వాలు ఊడిగిపోయాయి. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి మూడేం డ్లు దాటింది. కేవలం మొదటి సంవత్సరమే అప్పటికే కేటాయించిన నిధులతో వెళ్లదీశారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోనూ స్థానిక సంస్థలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రెండు చోట్ల కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పటి నుంచి నిధులు కరువయ్యాయి. స్థానికంగా ఈ సంస్థలకు సీనరేజ్ నిధులు అందించడం అనవాయితీగా వస్తోంది. జిల్లాలోని గనుల శాఖకు వచ్చే రాబడిలో కొంత కేటాయింపు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో జిల్లా పరిషత్కు, గ్రామపంచాయతీలకు 25శాతం చొప్పున, మండలాలకు 50శాతం చొప్పున కేటాయిస్తారు. 2015-16లో జిల్లా నుంచి గనులశాఖకు రూ.135కోట్లా 64లక్షల ఆదాయం వచ్చింది. ఈ క్రమంలో అప్పుడు జిల్లా పరిషత్కు రూ.2కోట్లు, మండల పరిషత్లకు రూ.3.5కోట్లు కేటాయించారు. 2016-17న రూ.181కోట్లా 52లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో నుంచి కేవలం మండల పరిషత్లకు మాత్రమే రూ.కోటీ 20లక్షలు కేటాయించారు. జిల్లా పరిషత్కు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక కేంద్రం నుంచి వచ్చిన బీఆర్జిఎఫ్ నిధులు 2015-16తో ఆపేశారు. అంతకు ముందు సంవత్సరం రూ.36కోట్లు వచ్చాయి. 2016-17 నుంచి 13వ ఫైనాన్స్ నిధులు ఆపారు. అంతకు ముందు సంవత్సరం రూ.27కోట్లు ఇచ్చారు. అనంతరం నేరుగా గ్రామపంచాయతీలకు మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో మండల పరిషత్లు సగం డీలా పడగా జిల్లా పరిషత్ నిర్వీర్యం అయింది. గత సంవత్సరం జడ్పీటీసీ ఎంపీపీలకు జీతాలు కూడా కరువయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం జరగనుంది. నిధుల లేమివల్ల శాఖల పనితీరుపై సమీక్ష మినహా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు లేకుండా పోయాయి.
Authorization