- ఎంపీడీవో వంగ సురేందర్రెడ్డి
నవతెలంగాణ-గంభీరావుపేట
ఎన్నికల ప్రవర్తన నియమావళికి ఎవరూ అతీతులు కారని, నిబంధనలు అతిక్రమించిన వారు శిక్షార్హులేనని గంభీరావుపేట ఎంపీడీవో వంగ సురేందర్రెడ్డి అన్నారు. ఆయా గ్రామాల సర్పంచ్, వార్డులకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు మండలకేంద్రంలోని షాదీఖానాలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనలను ప్రతి అభ్యర్థి పాటించి తీరాల్సిందేనన్నారు. నిబంధనలననుసరించి ప్రతి ఖర్చుకూ తప్పనిసరిగా రశీదులు సమర్పించాలని స్పష్టం చేశారు. సర్పంచ్ అభ్యర్థులు రూ. 2లక్షల 50 వేలు, వార్డు సభ్యులు రూ. 50 వేలకు మించి ఖర్చు చేయరాదని సూచించారు.
అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థులు ఫ్లెక్సీలు, వాహనాలు, పోస్టర్లు, మైక్లు తదితరాల కోసం తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని తెలిపారు. పోటీలో నిలిచిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా 45 రోజులలోపు ఖర్చుల వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు. అంతకుముందుగా ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైండింగ్ అధికారులకు ఎన్నికల్లో నెరవేర్చాల్సిన బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ సురేశ్, తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ కార్తీక్లతోపాటు సంబంధిత అధికారులు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
Authorization