డీఆర్వో ఖిమ్యానాయక్
నవతెలంగాణ-సిరిసిల్ల
జిల్లాలో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ టీమ్ వర్కుగా పని చేయాలని డీఆర్వో ఎన్. ఖీమ్యా నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి తొలి విడత ఎన్నికలు జరగనున్న 5 మండలాల ఎన్నికల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలతో సెట్ కాన్ఫరెన్స్ ఎన్నికల సన్నద్ధతను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సజావుగా జరిగేందుకు డీఆర్వో పలు సూచనలు చేసారు. రూట్ల వారీగా బస్సులు సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరెలా ప్లాన్ చేసుకోవాలన్నారు. ఎన్నికల మెటీరియల్ పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరేలా చూడాలన్నారు. ఎన్నికల సిబ్బంది, మెటిరియల్ తగినంతా ఉన్నారా ? లేదా? ముందే సరి చూసుకోవాలని అన్నారు. ఆదివారం మధ్యాహ్నం కల్లా పోలింగ్ పర్సన్స్ కేటాయించిన పోలింగ్ కేంద్రంకు చేరుకొనేలా చూడాలన్నారు. 10 వార్డ్లకు మించి ఉన్న గ్రామపంచాయతీల్లో రెండు టేబుల్స్ ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేపట్టాలన్నారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సజావుగా జరిగేందుకు, అత్యవసర సూచనలు చేసేందుకు, సందేహాల నివృత్తి చేసేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పోలింగ్ రోజు ఎన్నికలకు సంబంధించిన రిపోర్ట్లను సకాలంలో కలెక్టరేట్, రాష్ట్ర ఎన్నికల సంఘంకు పంపాలన్నారు. అక్రిడేటెడ్ జర్నలిస్ట్ లకు సంబంధిత ఎంపీడీవోలే మీడియా పాస్లు జారీ చేయాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్చగా, సాఫీగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శేఖర్ పాల్గొన్నారు.
Authorization