నవతెలంగాణ-సుల్తానాబాద్
విద్యార్థినులు, విద్యార్థులు బాల్య దశలోనే సమాజ సేవా గుణం అలవర్చుకోవాలని సుల్తానాబాద్ మున్సిఫ్ మెజిస్ట్రేట్, మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ కే.పార్థసారధి రావు అన్నారు. శనివారం సుల్తానాబాద్ పట్టణంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెజిస్ట్రేట్ పార్థసారధి విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతూ ఉన్నతమైన వ్యక్తిత్వం, సేవా గుణం వల్లనే మనిషికి సమాజంలో గౌరవం పెరుగుతుందని అన్నారు. విద్యార్థి దశ నుండే విద్యార్థులు హక్కులు, చట్టాల గురించి తెలిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరడానికి మార్గం సులభం అవుతుందని అన్నారు. అనంతరం సీఐ మహేందర్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి నడవడిక అవలంభించుకోవాలని అన్నారు. సర్కిల్ పరిధిలో షీ టీంలతో పాటు ప్రత్యేకంగా సివిల్ డ్రెస్లలో పోలీస్ నిఘా ఏర్పాటు చేశామని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వెంటనే పోలీస్స్టేషన్లో తెలియజేయాలని అన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాంపెల్లి నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలల్లో ర్యాగింగ్లకు పాల్పడకూడదని, విద్యార్థినులు, విద్యార్థులు సోదర, సోదరీ భావం కలిగి ఉండి చక్కటి చదువుతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ సభ్యులు పల్లా కిషన్ విద్యార్థులకు క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించగా గెలిచిన విద్యార్థులకు మున్సిఫ్ మెజిస్ట్రేట్ పార్థసారధి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవీందర్, సీనియర్ న్యాయవాదులు బాలకిషన్ ప్రసాద్, మాడూరి ఆంజనేయులు, భూమయ్య, సరోత్తంరెడ్డి, సత్యనారాయణ, రమేష్, రాజేంద్రప్రసాద్, పూజిత, సుల్తానాబాద్ ఎస్సై రాజేష్, లోక్ అదాలత్ సభ్యులు ఆనందరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Authorization