- పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
- సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు చేరనున్న సిబ్బంది
- నేడు మధ్యాహ్నం నుంచి ఎన్నికల సామగ్రి పంపిణీ
నవతెలంగాణ- కలెక్టరేట్
కరీంనగర్ జిల్లాలో మొదటి విడతగా నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సోమవారం జరుగబోయే పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా, నేటి మధ్యాహ్నం నుంచి ఎన్నికల సామగ్రి పోలింగ్ సిబ్బందికి అందజేయనున్నారు. జిల్లాలోని 5 మండలాల్లో 97 గ్రామపంచాయితీలకు గాను 2 ఏకగ్రీవమయ్యాయి. మరో రెండు చోట్ల సర్పంచ్ పదవులకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. 93 సర్పంచ్, 728 వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగబోతున్నాయి. 928 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 40 రూట్లతో 13జోన్లుగా విభజించారు. ఒక్కో రూటుకు ఒక్కో రూట్ ఆఫీసర్, ఒక్కో జోనుకు ఒక్కో జోనల్ అధికారిని నియమించారు. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు 15మంది సూక్ష్మ పరిశీలకులను, వివాదాస్పదమైన పోలింగ్ కేంద్రాల్లో 331 వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే 922మంది ప్రిసైడింగ్ అధికారులు, 1236 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు విధులు కేటాయించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగనుండగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు.
ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తిచేసేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నేటి సాయంత్రమే తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చేరుకుని, పోలింగ్ నిర్వహించేందుకు అనువైన ఏర్పాట్లు చేసుకోనున్నారు.
Authorization