- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యం
12 రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె
మెడకు ఉరితాళ్లతో వినూత్న నిరసన
నవతెలంగాణ-కరీంనగర్రూరల్
కొత్తపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 14 ప్రకారం వేతనాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు. కొత్తపల్లి మున్సిపల్ కార్మికులు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న సమ్మె శనివారానికి 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన సమ్మె దిక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులు మెడకు ఉరితాళ్లతో వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంఘం తరుపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు. స్వచ్ఛభారత్ పేరుతో కేవలం 5, 10 నిమిషాలు ఫొటోలకు ఫోజులిస్తున్నా ఎంపీ, ఎమ్మెల్యేలకు లక్షలాది రూపాయల జీతం పెంచారని గుర్తుచేశారు. నిరంతరం పట్టణంలో దుర్వాసన, దుర్గంధాలను భరిస్తూ డ్రెయినేజీలను శుభ్రం చేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచకపోవడం సిగ్గుచేటన్నారు. సమస్యలను పరిష్కరించం డంతో పాటు కార్మికుల పక్షాన ఉండాల్సిన ఎంపీపీ వాసాల రమేశ్ వారిని వెంటనే పనిలో చేరాలని లేదంటే పని నుంచి తొలగిస్తామని భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేదిలేదని, కార్మికుల వేతనాలు పెంచేవరకు పోరాటాన్ని ఆపేదిలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు ఇస్తుందని అలాంటప్పుడు కార్మికులకు వేతనాలు పెంచలేని స్థితిలో ఉన్నారా? అని ప్రశ్నించారు. కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు పెంచేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కవ్వంపల్లి అజరు, సీఐటీయూ నాయకుడు ఎర్రోల్ల సాయన్న, కవ్వంపల్లి మల్లేశం, ఎర్రోల్ల రాజయ్య, కె.లక్ష్మణ్, హన్మాండ్ల మల్లేశం, భరత్, పోచయ్య, కే.లత, జె.లచ్చమ్మ, రాజయ్య, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.
Authorization