శంకరపట్నం: ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఎన్నికల నియమ నిబంధనలను తప్పక పాటించాలని మోడల్కోడ్ అధికారి డీటీవో శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రంలోని మహిళా సంఘ భవనంలో శనివారం మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రెండో విడతలో భాగంగా ఈ నెల 25న జరుగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సదస్సులో అభ్యర్థుల ఖర్చు పర్యవేక్షకులు రాజేశ్వరరావు, ఆడిటర్ కనకమహాలక్ష్మి, మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచ్, వార్డులకు పోటీచేస్తున్న అభ్యర్థులు పాల్గొన్నారు.