- కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్
నవతెలంగాణ-వేములవాడ
మూలవాగును మురికివాగుగా మార్చిన ఘనత అధికార పార్టీ టీఆర్ఎస్దేనని కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు గురువారం మూలవాగును పరిశీలించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడను అభివృద్ధి చేస్తున్నామని టీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. రాజరాజేశ్వర స్వామి దర్శననానికి వచ్చే భక్తులు బ్రిడ్జిపై రావాలంటే ముక్కులు మూసుకుని రావాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ఎన్నికలు వస్తే మాత్రం టీఆర్ఎస్ నాయకులు భూమిపూజలు, అభివృద్ధి పనుల పేరిట శంకుస్థాపనలు చేస్తారని దుయ్యబట్టారు. వారికి ప్రజలు ఓట్లు దండుకోవడమే తెలుసునని పట్టణాభివృద్ధిపై వారికి ధ్యాస లేదని అన్నారు. మూలవాగులోకి మురికి నీరు రాకుండా ఉండేందుకు రూ. 40 కోట్లు వెచ్చించి పనులు చేస్తున్నామని చెబుతున్నారని, నాలుగేండ్లలో ఎం చేశారో ప్రజలకు చెప్పాలని అన్నారు. రూ.400 కోట్లతో ఆలయాభివృద్ధి చేస్తున్నానని పదేపదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న ఈ నాయకులు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని అన్నారు. ఎన్నికల హామీలు ఎటుపోతున్నాయో ప్రజలు ఆలోచించాలని అన్నారు. వేములవాడ మున్సిపాలిటీకి ప్రత్యేకాధికారిగా నియామకమైన రాజన్న సిరిసిల్ల జేసీ యాస్మిన్భాషా వెంటనే స్పందించి మూలవాగులోని మురికి నీటిని మల్లించే ప్రయత్నం చేయాలని కోరారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో దోమల వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంందన్నారు. మూలవాగు నుండి మురికినీరు స్వజలధార బావిలోకి వెళ్లడం వల్ల నీరు కలుషితమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. వెంటనే మురికినీటిని వేరేచోటకు తరలించే ప్రయత్నం చేయాలన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు సాగరం వెంకటస్వామి, గజ్జల రమేష్, తూం మధు, చిలుక రమేష్, గొడిసెల శ్రీనివాస్వాస్గౌడ్, చంద్రగిరి శ్రీనివాస్లతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Authorization