- రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్
నవతెలంగాణ-సిరిసిల్ల
అన్నార్థుల కోసమే 'ఫీడ్ ది నీడ్' అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ తెలిపారు. ఆహారం వృథాను అరికట్టడానికి సిరిసిల్ల మున్సిపల్ 'ఫీడ్ ది నీడ్' అనే పథకాన్ని రూపొందించింది. ఈ పథకాన్ని గురువారం జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పట్టణంలోని గాంధీ కూడలి వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆహార నిల్వ కంటైనర్లో తన వెంట తెచ్చిన పండ్లను అన్నార్థుల కోసం ఉంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజల ఆకలీ తీర్చేందుకు ఫీడ్ ద నీడ్ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. వృథా అవుతున్న పండ్లు, ఆహార పదార్థాలను అన్నార్థులకు అందించేందుకు ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు.
ఆకలితో బాధపడుతున్న పేద ప్రజల పట్ల పట్టణ ప్రజలు ప్రేమ చూపించాలని కోరారు. అనంతరం కమిషనర్ రమణాచారి మాట్లాడుతూ ఎవరైనా తిండి లేక అలమటిస్తుంటే, వారికి ఆహారం అందించి వారిని ఆదుకోవాలని హోటల్ యాజమానులు, స్వచ్చంద సంస్థలకు పిలుపునిచ్చారు. పట్టణంలో ఆహార పదార్థాల వృథా చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. చాలా మంది తాము తినగా మిగిలిపోయిన ఆహారాన్ని చెత్తలో పడవేస్తుంటారని, ఇక నుంచి అలా చేయకుండా 'ఫీడ్ ది నీడ్ ' ద్వారా ఆకలితో ఉన్నవారికి ఆ ఆహారం అందించాలని కోరారు. ఎవరైనా పుట్టిన రోజులు, శుభకార్యాలు ఉన్న సమయంలో ఆహారం మిగిలిపోతే మున్సిపాలిటీ అధికారులకు సమాచారం అందివ్వాలని కోరారు.
Authorization