నవతెలంగాణ-జగిత్యాల టౌన్
కనీస మర్యాద పాటించకుండా జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవోలను తొలగించడం అవమానకర చర్య అని, తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని వైద్యులు గురువారం ఆస్పత్రిలో నోటికి నల్లగుడ్డ కట్టుకొని నిరసన చేపట్టారు. జగిత్యాల జిల్లా ఆస్పత్రిలోని వైద్యులు సకాలంలో రావడం లేదని ఓ దినపత్రికలో వచ్చిన వార్తపై విచారణకు జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ మెట్పల్లి సబ్కలెక్టర్ను ఆదేశించారు. బుధవారం జగిత్యాల ఆస్పత్రిలో విచారణ చేపట్టగా వైద్యులు కొందరు ఆలస్యంగా రావడం, అర్ఎంవో లేకపోవడంతో సబ్కలెక్టర్ గౌతం పోట్రు జిల్లా కలెక్టర్కు నివేదికను ఇచ్చారు.
దీంతో రాత్రికి రాత్రే ఆర్ఎంవోను, సూపరింటెండెంట్ను విధుల్లోంచి తొలగించి మరో ఇద్దరికి బాధ్యతలను అప్పగిస్తూ జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. దీంతో సూపరింటెండెంట్ కళ్యాణచక్రవర్తి, ఆర్ఎంవో సదామోహన్లను తొలగించడాన్ని అవమానంగా భావించిన ఆస్పత్రిలోని వైద్యులందరూ గురువారం ఉదయమే విధులకు హజరైన వెంటనే ఆస్పత్రి ఎదుట నోటికి నల్లగుడ్డ కట్టుకొని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రిలోని ఇద్దరికి జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, అకారణంగా తొలగించారని అన్నారు. సీనియర్ వైద్యులనే కనీస మర్యాద లేకుండా సింపుల్గా తొలగించడాన్ని వైద్యులు తప్పుపట్టారు. వైద్యులందరం ప్రజల కోసమే ఆలోచిస్తామని అలాంటిది వైద్యులపై ఒత్తిడి పెంచితే ఇది మరోవైపుకు దారితీస్తుందని ఆవేదనతో అన్నారు. తమ కంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్టు ఉందని దాన్ని కనీస స్థాయిలో ఆలోచించకుండా ఇలా వ్యవహరించడాన్ని వైద్యులు తప్పుపట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ సదామోహన్ బంధువుల సంవత్సరీకానికి వెళ్లాడని అదికూడా పరిగణనలోకి తీసుకోకుండా తొలగించడాన్ని వైద్యుల తప్పుపట్టారు. కొద్దిసేపు మాత్రమే ఈ నిరసనను చేపడతామని తిరిగి పేషంట్లకు తమ సర్వీసును అందించి తమ విధులను పూర్తి చేస్తామని వైద్యులు పేర్కోన్నారు. ఇందులో వైద్యులు ముదస్సర్, శ్రీధర్, శశికాంతరెడ్డి, పలువురు ఉన్నారు.
Authorization