- సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్
నవతెలంగాణ-జమ్మికుంట
జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 23న హైదరాబాద్లోని ప్రగతిభవన్ను ముట్టడికి కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని సీఐటీయూ కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ పిలుపునిచ్చారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో గందెసిరి సంపత్ అధ్యక్షతన జమ్మికుంట ఉమ్మడి మండల కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల శంకర్ మాట్లాడుతూ.. జీపీ కార్మికులకు సీఎం కేసీఆర్ రూ.8,500 వేతనాలు ఇస్తానని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదని ఆరోపించాచరు.
పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించే విధంగా కలెక్టర్ల ద్వారా అన్ని మండలాల ఎంపీడీఓలకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. గత ప్రభుత్వాల మాదిరిగానే నేడు తెలంగాణ ప్రభుత్వమూ పంచాయతీ కార్మిక, ఉద్యోగులను శ్రమ దోపిడీకి గురి చేస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోనైనా జీపీ కార్మికుల బతుకులు మారడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ స్థాయి నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి వరకు జీతాలు పెంచుతుందని, కానీ కింది స్థాయి కార్మికులు వేతనాలు మాత్రం పెంచడం లేదని మండిపడ్డారు. గ్రామాలను శుభ్రం చేస్తూ వారి ప్రాణాలను పనంగా పెట్టి పని చేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించడంలో మాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కార్యక్రమంలో మండలాధ్యక్ష, కార్యదర్శులు రామంచ రాంచందర్, ఎండిగ రవీందర్రావు, నాయకులు మల్లయ్య, అశోక్, రాజయ్య, బాబు, తిరుపతి, సంపత్, తదితరులు ఉన్నారు.
Authorization