నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట జంక్షన్లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ని ఎంపీ బండి సంజరు కుమార్ విజ్ఞప్తి చేశారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే తమ నియోజకవర్గవాసులు కాజీపేట, వరంగల్ స్టేషన్లకు వెళ్లి ఎక్కాల్సి వస్తుందని మంత్రికి వివరించారు. పార్లమెంట్లోని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ కార్యాలయంలో గురువారం కరీంనగర్ ఎంపీ బండి సంజరు ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ అంశంపై మంత్రికి ఎంపీ వినతి పత్రం అందజేశారు. అనంతరం బండి సంజరు మీడియాతో మాట్లాడారు. జమ్మికుంట మీదుగా వెళ్లే వివిధ రైళ్లు జమ్మికుంట స్టేషన్లో ఆగాలని మంత్రిని కోరినట్టు తెలిపారు. దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వివిధ రైళ్ల పునరుద్దీకరణ, నూతన రైళ్ల మంజూరు గురించి ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. మంత్రి స్పందిస్తారని తనకు విశ్వాసం ఉన్నట్టు సంజరు మీడియాకు తెలిపారు.