నవతెలంగాణ-ముస్తాబాద్
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ నాయకులు ముస్తాబాద్ మండలకేంద్రంలో గురువారం రోడ్డుపై బైటాయించి ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఏళ్ల బాల్రెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫీ చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచిపోయినప్పటికీ రైతురుణమాఫీ చేయడం లేదని దుయ్యబట్టారు. రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని అన్నారు. మండలంలో 11 వేల మంది రైతులు ఉంటే 7 వేల మందికే రైతుబంధు అమలవుతుందని అన్నారు. మిగతా రైతులకు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్లోని అసెంబ్లీని కూలగొట్టి రూ. 500కోట్లతో కొత్త భవనాన్ని నిర్మించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు కాదా? అని ప్రశ్నించారు. రుణమాఫీ వెంటనే చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సభ్యులు మిర్యాల్కర్ శ్రీనివాస్, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ గజ్జెల రాజు, కేసుగాని రాజయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు అరుట్ల మహేష్రెడ్డి, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Authorization