- గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల కసరత్తు
- జోరు కొనసాగించాలని టీఆర్ఎస్ ప్రయత్నాలు
-+ అంతర్గత సమావేశాలతో కాంగ్రెస్ సమాయత్తం
- సంతృప్తుల చూపు భాజపా వైపు
త్వరలో జరుగనున్న మున్సిపల్ పోరును ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పట్టణాభివృద్ధి పాలనలో అత్యంత కీలకమైన మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలపొందేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. వాార్డు కౌన్సిలర్గా బలమైన అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దృష్టిపెట్టాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం సామాజిక బలంతోపాటు ఆర్థిక అండ ఉన్నవారి కోసం అగ్ర నాయకులు అన్వేషణ ప్రారంభించారు. అయితే ఇప్పటికే ఆయా పార్టీల్లో ఉన్న ఆశావాహులు తాజా మాజీ కౌన్సిలర్లు నేతల ప్రసన్నం కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు.
నవతెలంగాణ-సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేయాలని ప్రధాన పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. ఒకవైపు అధికారులు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను వేగవంతం చేయగా మరోవైపు పార్టీలు సైతం అభ్యర్థులను వేటను వేగవంతం చేశాయి. తాజా మాజీ కౌన్సిలర్లు, ఆశావాహులు, యువత తెలంగాణ ఉద్యమ సమయంలో తమ వెంట ఉన్న వారందరి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మున్సిపల్ కేంద్రాల్లో ముఖ్య నాయకులతో సమాలోచనలు సాగిస్తున్నారు. వార్డుల విభజన నుండి రిజర్వేషన్లపై అంచనాకు వచ్చి అభ్యర్థుల పూర్తి జాబితాపై ఎంపికకు సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్ల వారీగా ఆయా వార్డుల్లో ఆశావాహుల జాబితా సిద్ధం చేసి రిజర్వేషన్ ప్రకటన అనంతరం ఖరారు చేయడానికి ఆయా రాజకీయ పార్టీలు సిద్ధమతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార నిర్వహణలో అధికార పార్టీ వేగంగా పావులు కదుపుతుంది. మున్సిపాలిటీల్లో ఏ వార్డులో ఎవరితో పోటీ ఉంటుంది వారిని తట్టుకుని విజయం సాధించడానికి బలమైన అభ్యర్థి ఎవరు అనే అంశాలను సామాజిక వర్గాల వారిగా పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ పార్టీని గెలిపిస్తాయని ధీమాతో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, వేములవాడ ఎమ్మెల్యే రమేష్బాబు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం వలసలతో అల్లాడుతుంది. ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడ కూడా మున్సిపల్ ఎన్నికలపై ఆ పార్టీ అగ్రనాయకులు ఎలాంటి సమావేశం కార్యక్రమాలు నిర్వహించలేదు. ఆశావాహులు మాత్రం పోటీ చేయడానికి సిద్ధపడుతున్నప్పటికీ వెనుక ఉండి భుజం తట్టే నాయకులు కనిపించక అయోమయానికి గురవుతున్నారు. కాంగ్రెస్లో ఇప్పుడిప్పుడే మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకుంది. అదే ఊపుతో మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భాజపా శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. అధికార పార్టీలో సీట్ల కోసం అధిక పోటీ ఉండటంతో సీటు దక్కని వారిపై దృష్టిపెట్టి వారిని తమ పార్టీ తరుపు పోటీ చేయించే విధంగా వ్యూహాలు రచిస్తుంది. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో కార్మికుల సమస్యలపై పోరాటాలు చేసే సీపీఐ(ఎం) పార్టీ తమకు పట్టు ఉన్న వార్డుల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. సీపీఐ కూడా మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ప్రధానంగా మున్సిపల్ చట్టం ఆమోదం కోసం ఈ నెల 18, 19వ తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల అనంతరం నోటిఫికేషన్ విడుదల కానుంది.
Authorization