- జలశక్తి అభియాన్ కేంద్ర బృందం నోడల్ అధికారి ఎస్. పి. సింగ్
నవతెలంగాణ - కరీంనగర్ టౌన్
ప్రజల భాగస్వామ్యంతోనే నీటి సంరక్షణ సాధ్యమవుతుందని జలశక్తి అభియాన్ కేంద్ర బృందం నోడల్ అధికారి ఎస్.పి. సింగ్ అన్నారు. ఆర్ అండ్ బీ గెస్ట్హౌజ్లో గురువారం జలశక్తి కేంద్ర బృందం నోడల్ అధికారి ఎస్.పి. సింగ్ బృందం సభ్యులతో కలిసి విలేకరుల సమా వేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జులై 1న జలశక్తి అభియాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రారంభించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలు 1600ల బ్లాక్లుగా గుర్తించారని ఆయన తెలిపారు. కరీంనగర్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి నీటి ఎద్దటి గల 5 బ్లాక్లను గన్నేరువరం, చిగురుమామిడి, రామడుగు, గంగాధర, చొప్పదండి మండలాలను గుర్తించారని ఆయన తెలిపారు. జిల్లా యంత్రాంగంతో కలిసి 4 బ్లాక్ల్లో పర్యటించామని ఆయా బ్లాక్ల్లో నీటి సంరక్షణకు జరుగుతున్న చెక్డ్యామ్ నిర్మాణ పనులు, ఫారమ్ పాండ్లు, రీచార్జీ బోర్వెల్స్, ఇంటింటికీ ఇంకుడు
గుంత, మొక్కలు నాటే కార్యక్రమం పనులను పరిశీలించినట్టు ఆయన తెలిపారు. నీటి వనరులను సంరక్షించుట, ప్రతి వర్షపు బొట్టును భూమిలో ఇంకింప జేసుడు, రీచార్జీ బోర్వెల్స్ ద్వారా నీటిని నిల్వ చేసుకొనే పనులపై అవగాహన కల్పించినట్టు ఆయన తెలిపారు. బావి తరాలకు నీటి కొరత రాకుండా నేటి నుంచే ముందు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. అన్ని గ్రామాల్లో నీటి సంరక్షణ ప్రణాళికలు తయారు చేసుకొని అమలు చేయాలన్నారు. వరి, చెరకు లాంటి అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని ప్రపంచంలో 25 శాతం జనాభా నీటి కొరతతో జీవిస్తుందన్నారు. ఈ సమావేశంలో జలశక్తి అభియాన్ కేంద్ర బృందం బ్లాక్ నోడల్ ఆఫీసర్, నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ ఉమ్రాసింగ్, టెక్నికల్ నోడల్ ఆఫీసర్ సెంట్రల్ వాటర్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ సౌరభ్ శరణ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్రావు, భూ గర్బ జలశాఖ ఉప సంచాలకులు హరి కుమార్, జిల్లా ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్రావు గుప్త, సమాచార ఉప సంచాలకులు పి. భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Authorization