- గత సంవత్సరం అరకొర
- ఈ ఏడాది ప్రణాళికలేవి..?
'సూక్ష్మంలో మోక్షం' అనే సామెత అందరికీ తెలిసిందే. అదేరీతిలో సూక్ష్మబిందు సేద్యంతో తక్కువ నీటి ఖర్చుతో ఎక్కువ పంట సాగు చేయవచ్చని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ విభాగాన్నే నెలకొల్పింది. అది ఇప్పుడు నీరుగారుతోంది. గతేడాది నామమాత్రపు ప్రణాళికలే అమలు చేయగా ఈ సంవత్సరం ఆ ప్రణాళికలు సైతం సిద్ధం చేయని వైనం నెలకొంది. దీంతో ఈ విభాగాన్ని కొనసాగిస్తారా.. లేదా అనే అనుమానాలకు దారి తీస్తోంది.
నవతెలంగాణ-కరీంనగర్ ప్రతినిధి
గతంలో ప్రత్యేకంగా సూక్ష్మ బిందు సేద్యం కోసం ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు సంబంధించి ఓ విభాగాన్నే ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఉద్యానవన శాఖ కూడా ఉండేది. ఇదేరీతిలో పట్టు పరిశ్రమకు చెందిన ప్రత్యేక విభాగం కూడా పని చేసేది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉన్నది ఉన్నట్టుగా కొనసాగించడం ప్రభుత్వానికి కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో మూడు విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చారు. ఇందులో భాగంగా ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమను సూక్ష్మబిందు సేద్యంలో విలీనం చేశారు. దీంతో ఆ శాఖ కూడా బలోపేతం కావడానికి బదులు నిధుల్లేక బలహీనపడింది. గత ఆర్థిక సంవత్సరం పరిశీలిస్తే ఈ శాఖ పరిధిలో కేవలం రూ.4 కోట్లా 4 లక్షలా 50 వేలతో 1630 ఎకరాలకు సూక్ష్మబిందు సేద్యం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో బిందు సేద్యానికి సంబంధించి 1120 ఎకరాలు, తుంపర సేద్యంలో 510 ఎకరాలున్నాయి. దీనికి గాను రూ.3 కోట్ల 58 లక్షలా 14 వేలతో 1772 ఎకరాలకు మాత్రమే పరిమితమ య్యారు. అందులో బిందు సేద్యానికి సంబంధించి 942 ఎకరాలు, తుంపర సేద్యంలో 830 ఎకరాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇంతవరకు ప్రణాళికలైనా రూపొందించలేదు. అసలు రూపొందిస్తారా.. లేదా తెలియని అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరానికి సంబంధించి విడిగా చూస్తే 6 వేల ఎకరాల్లో మామిడి, మరో 4 వేల ఎకరాల్లో కూరగా యలు సాగు చేశారు. 300 ఎకరాల్లో పట్టు, 400 ఎకరాల్లో ఇతర పంటలున్నాయి. రైతులపరంగా చూస్తే సూక్ష్మబిందు ద్వారా సేద్యం చేసిన రైతులు మొత్తంగా 3 వేల మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో అత్యధికంగా 1500 మంది కూరగాయలే పండించారు. పట్టుపరిశ్రమకు సంబంధించి ఎవరూ ముందుకు రావడం లేదు. గత సంవత్సరం కేవలం పదెకరాలకే పరిమితమైన పాలిహౌస్ ఈ ఏడాది ఊసే లేదు. పట్టుపరిశ్రమ సైతం ఈ సంవ త్సరం పదెకరాలకే పరిమితమైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పరిశీలిస్తే జిల్లాలో పట్టు పరిశ్రమ అంతరించిపోయిందని చెప్పొచ్చు. వర్షాభావం, మార్కెటింగ్ సౌకర్యాలు లేనికారణంగా ఈ పరిస్థి తికి దారి తీసింది. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం కరువైంది. ఈ క్రమంలో సూక్ష్మబిందు సేద్యంలో భాగంగా మామిడిలాంటి పండ్ల తోటలు, కూరగాయలు మినహా మరొకటి సాగు చేసుకునే వాతావరణం కొరవడింది. దీంతో ఈ పథకం ఉద్యానవన పంటల్లోనూ కొన్నింటికే పరిమితమవు తోంది.
ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా ముందుకు సాగే పరిస్థితి లేదు. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు మాసాలు గడుస్తున్నా ప్రణాళికల ఊసే లేదు. దీన్నిబట్టి ఈ పంటల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని బేరీజు వేసుకోవచ్చు. అందువల్ల ఇకముందు ఈ పథకాన్ని కొనసాగిస్తారా లేదా అనే అనుమానాలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
Authorization