- టైక్స్టైల్ పార్క్ కార్మికుల కూలి పెంపులో యజమానుల తీరు
- విద్యుత్ సబ్సిడీకి కూలి పెంపునకు లింక్
- ఒప్పందం ముగిసి ఏడాది.. కార్మికుల ఎదురుచూపులు
- సమస్య పరిష్కరించడంలో అధికారులు విఫలం
- కూలి పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్కు మొర
సుబ్బి పెండ్లి ఎంకి చావుకు వచ్చింది అన్న చందంగా ఉంది తంగళ్లపల్లి టెక్స్టైల్పార్క్ కార్మికుల పరిస్థితి. కూలి ఒప్పందం ముగిసి ఏడాదైనా కొత్త ఒప్పందం కుదరలేదు. జనవరిలో కార్మికులు సమ్మె బాట పట్టగా అధికారులు హామీతో విరమించారు. 9 నెలలు గడుస్తున్నా హామీ అమలుకు నోచుకోలేదు. మరోపక్క యజమానులు కూలి ఒప్పందంలో దాటవేసే ధోరణి అవలంభిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు విద్యుత్ సబ్సిడీ వస్తేనే కూలి పెంచుతామని కొత్త కిరికిరి పెడుతున్నారు. 13 నెలలుగా కూలి పెంపు కోసం కార్మికులు ఎదురుచూస్తుండగా యజమానుల తీరుతో వారు ఆందోళన చెందుతున్నారు.
నవతెలంగాణ-సిరిసిల్ల
తంగళ్ళపల్లి మండలంలోని టెక్స్టైల్పార్క్లో ప్రభుత్వం 230 యూనిట్లకు స్థలాలు కేటాయించగా 110 యూనిట్ల కన్స్స్ట్రక్షన్ పూర్తయింది. ఇందులో 70 యూనిట్లు నడుస్తున్నాయి. 70 యూనిట్లలో 1200 మరమగ్గాలు ఉండగా మొత్తం 800 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో మరమగ్గాల కార్మికులు 400 మంది ఉండగా ఇతర అనుబంధ రంగాలకు చెందిన కార్మికులు 400 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి 50 శాతం విద్యుత్ సబ్సీడీ ప్రకటించింది. దీంతో టెక్స్టైల్పార్క్ కార్మికులకు కూడా 50 శాతం విద్యుత్ సబ్సీడీ అందించాలని ప్రభుత్వాన్ని కోరగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం టెక్స్టైల్పార్క్లోని యూనిట్లకు 50 శాతం సబ్సిడీ అందిస్తుంది. ఇది 2011 నుంచి అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి 2015 వరకు రూ. 9కోట్లు 50 శాతం విద్యుత్ సబ్సిడీ కింద విడుదల అయ్యాయి. 2015 నుండి ఇప్పటివరకు దాదాపు రూ. 9 కోట్ల 50శాతం విద్యుత్ సబ్సిడీ యాజమానులకు రావాల్సి ఉంది. టెక్స్టైల్పార్క్లోని యూనిట్లకు ఒక్క యూనిట్కు రూ. 7.05పైసల చొప్పున అందిస్తున్నారు. ఈ సబ్సిడీ కోసం యాజమానులు కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్నారు. కార్మికుల కూలి ఒప్పందం రెండేండ్ల ఒకసారి ఉంటుంది. మొదటి సారి ఒప్పందం 2012లో జరుగగా, రెండవసారి 2014లో, మూడవసారి 29 జూన్ 2016న ఒప్పందం కుదరగా 29 జూన్ 2018న ఒప్పందం గడువు ముగిసింది. అప్పటి నుండి ఇప్పటివరకు కార్మికుల కూలి పెంచలేదు. దీంతో కార్మికులు కూలి పెంచాలని జనవరి నెలలో సమ్మె బాట పట్టారు. స్పందించిన అధికారులు నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మె విరమించారు. 9 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు కూలి సమస్య పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. యూనియన్ నాయకులు సదరు యాజమానులను కూలి పెంచాలని కోరగా 'మాకు ప్రభుత్వం నుండి 50 శాతం విద్యుత్ సబ్సిడీ కింద రూ. 9 కోట్లు రావాలి. ప్రభుత్వం ఇవ్వడం లేదు. అవి వచ్చినప్పుడే మీ కూలి పెంచుతాం' అని కొత్త మెలిక పెడుతున్నట్టు కార్మికులు తెలుపుతున్నారు. 'యజమానులకు ఇంకా ఆరు నెలలైన మొత్తం విద్యుత్ సబ్సిడీ అందుతుంది. కానీ తాము ఆరు నెలల కూలి నష్టపోవాల్సి వస్తుంది. సబ్సిడీ ఇస్తేనే కూలి పెంచతామని అనడం సరికాదు' అని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం కార్మికులకు 2016లో చేసుకున్న ఒప్పందం ప్రకారం పది పిక్కులకు 36 పైసలు మాత్రమే చెల్లిస్తున్నారు. పది పిక్కులకు 45 పైసలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై దృష్టిసారించి సమస్య పరిష్కరించాలని చేనేత జౌళిశాఖ అధికారులతో పాటు స్థానిక మంత్రి కేటీఆర్ను కార్మికులు కోరుతున్నారు.
Authorization