- ఏళ్ల నాటి సమస్యలు ఇకనైనా పరిష్కారమయ్యేనా..
- ఇరుకు రోడ్లు..కంపు కొడుతున్న మురికికాలువలు..
- పట్టణంలో కానరాని పచ్చదనం..
- నేటి నుంచి మార్చి 4వరకు కార్యక్రమం..
జగిత్యాల జిల్లా కేంద్రంలో లక్షకు పైగా జనాభా ఉండగా, 24వేల కుటుంబాలున్నాయి. పట్టణంలో 16 వేల నల్లా కనెక్షన్లు
ఉండగా నిత్యం 11 మిలియన్ లీటర్ల నీరు వినియోగిస్తున్నారు. తాగునీరు కోసం ధర్మసముద్రంతోపాటు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు సరఫరా చేస్తున్నారు. తాగునీటి పైపులు లైన్లు శిథిలమై పగిలిపోవడంతో తరచూ నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. చెత్త తరలింపు కోసం 17ఆటోలు, 8ట్రాక్టర్లు, ఒక డంపర్ను వినియోగిస్తున్నారు. 213మంది తాత్కాలిక ప్రాతిపదికన, 40మంది కార్మికులు శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్నారు.
కానరాని పచ్చదనం.. పారిశుధ్యం..
జగిత్యాల జిల్లా కేంద్రంలో పచ్చదనం, పారిశుధ్యం కానరావడం లేదు. నిత్యం 60 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తుండగా, వాహనాల కొరతతో పూర్తిస్థాయిలో పారిశుధ్య నిర్వహణ అమలు కావడం లేదు. సిబ్బంది కొరతతో వార్డుల్లో చెత్తాచెదారంతో ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో మురుగు కాల్వలు కంపు కొడుతున్నాయి. హరితహారంలో మొక్కలు నాటడంలో చూపిన శద్ధ్ర వాటిని సంరక్షించడంలో చూపకపోవడతో ఎక్కడిక్కడ మొక్కలు ఎండిపోయాయి. కేవలం పట్టణంలో రోడ్డుకిరువైపులా అలంకారప్రాయంగా నాటిన మొక్కలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. పట్టణంలోని వీధుల్లో, ఖిల్లాలో నాటిన మొక్కలను పట్టించుకునే వారు లేకపోవడంతో పూర్తిగా ఎండిపోయాయి. పట్టణంలో రోడ్డువైపు మొక్కలను అలంకారప్రాయంగా కనపడుతున్నాయి. వీధుల్లో మాత్రం మొక్కలు నాటినా, సంరక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారు.
పార్కు నిర్వహణపై అశ్రద్ధ..
పట్టణ వాసుల కోసం పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్కు నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడంతో పచ్చదనం కరువైంది. వారాంతంలో ఆహ్లాదం కోసం వెళ్లేందుకు కూర్చునే బెంచీలు విరిగిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. హౌసింగ్ బోర్డులో పార్కు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. దీంతో పట్టణవాసులు వారాంతంలో ఆటవిడుపు కోసం గ్రామాలకు తరలివెళ్తున్నారు. శారీర దృఢత్వం కోసం ఏర్పాటు చేసిన బహిరంగ వ్యాయామ శాల ప్రారంభానికి ముందే పరికరాలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
ఇరుకు రోడ్లు..ఆక్రమణలు..
పట్టణంలోని ఇరుకు రోడ్లను ఆక్రమించుకున్న అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగ స్థలం కేటాయించాలని వీధి వ్యాపారుల చట్టం చెబుతుండగా, అధికారులు పట్టించుకోవడం లేదు. బస్టాండు ప్రాంతాల్లో పండ్ల వ్యాపారులు రోడ్లపైనే దుకాణాలు పెడుతున్నారు. పాత బస్టాండు, మార్కెట్ యార్డు, గొల్లపల్లి రోడ్డు, కొత్తబస్టాండ్తో పాటు రద్దీ ప్రాంతాల్లో బండ్లు పెడుతుండడంతో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. రహదారుల విస్తరణపై అడుగు ముందుకు పడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుకాణాల ఎదుట పార్కింగ్ చేసేందుకు స్థలం లేకపోవడంతో వాహనాలు రోడ్డుపైనే పార్క్ చేస్తుండడతో తరచూ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణంలో ఏళ్ల నాటికి సమస్యలకు మోక్షం కలుగుతుందా.. పారిశుధ్య నిర్వహణ, హరితహారంతో అధికారులు రికార్డులు రాసుకుంటారా.. పట్టణ ప్రజల తీరుతాయా..పట్టణ ప్రగతి బాట పడుతుందా..వేచిచూడాలి.
నేటి నుంచి పట్టణ ప్రగతి
నవతెలంగాణ-జగిత్యాల టౌన్
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జగిత్యాల పట్టణంలోని అన్ని వార్డులలో ''పట్టణ ప్రగతి'' కార్యక్రమం నేటి నుంచి మార్చి 4వ తేదీ వరకు నిర్వహించనున్నామని జగిత్యాల మున్సిపాలిటీ కమిషనర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటలకు 8వ వార్డులో బుడిగే జంగాల కాలనీ వద్ద ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్, వార్డు సభ్యులు,వార్డు ప్రత్యేక అధికారి పాల్గొంటారని తెలిపారు.
Authorization