Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీరోలు గ్రామ రైతు ఆవేదన
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
రైతువేదిక నిర్మాణం కోసం ఓ రైతు దగ్గర భూమిని తీసుకొని, ఆ రైతువేదిక నిర్మాణం పూర్తి కావస్తున్నా అతనికి నష్టపరిహారం చెల్లించకుండా తిప్పుతున్న సంఘటన మండలంలోని బీరోలు గ్రామంలో చోటు చేసుకుంది. బీరోలు గ్రామానికి చెందిన సన్నకారు రైతు బర్ల నారాయణకి ఉన్న ఎకరం ముప్పై ఎనిమిది కుంటల భూమిలో రైతు వేదిక నిర్మాణం కోసమని 15కుంటల భూమిని అధికారులు తీసుకున్నారు. ఆ భూమికి బదులుగా 20 కుంటల ప్రభుత్వ భూమిని అతని పేరు మీద పట్టా చేయించిన తరువాతనే నిర్మాణం చేపడతామని అధికారులు, స్థానిక నాయకులు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని విస్మరించి రైతు భూమిలో నిర్మాణం చేపట్టారు. అది ఈ దసరా పండుగ నాడు ప్రారంభోత్సవానికి సిద్ధమౌతోంది. తనకు ఇస్తానన్న భూమి గురించి కలెక్టర్కి దరఖాస్తు చేసుకున్నా ప్రతి రోజు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వద్ద రైతు బర్ల నారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు తనను నమ్మించి భూమిని లాక్కున్నారని ఆరోపి స్తున్నాడు. తనకు ఇస్తానన్న భూమిని ఇచ్చి న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.