Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాయింట్ కలెక్టర్కు సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ-ఖమ్మం
వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం అందజేసి రైతులను వెంటనే ఆదుకోవాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ, అతి భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలోని వ్యవసాయ పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. జిల్లాలో లక్షకుపైగా ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయన్నారు. అధిక వర్షాలకు పెట్టుబడి సాధారణం కంటే ఎక్కువైందన్నారు. ఆగస్టులో కురిసిన వర్షాలకు కోతకు వచ్చిన పెసర పంట పూర్తిగా దెబ్బతిని రైతులు 100కోట్ల రూపాయలు కోల్పోయారన్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంటలు కోల్పోయి, వచ్చే ఆదాయం పోవడమే కాకుండా, పెట్టుబడి అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఇప్పటికే ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడినారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెట్టుబడి పరిహారం ఇవ్వాలని కోరారు. రైతులకు భరోసా కల్పించే విధంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలన్నారు. దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మత్తులు చేయాలని, ఇండ్లు, భూములు దెబ్బతిన్న వారికి పరిహారం ఇవ్వాలన్నారు. వరదలతో, కరెంట్ షాక్తో మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, బండి రమేష్, జిల్లా కమిటి సభ్యులు వై.విక్రమ్, జబ్బార్లు పాల్గొన్నారు.