Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
మండలంలో ఏ పంచాయతీలో చూసిన విచిత్రమైన ఇండ్ల నిర్మాణాల ఊపు జోరందుకుంది. ఇండ్ల అన్లైన్ పక్రియ జరుగుతుండటంతో ఖాళీగా ఉన్న స్థలాలలో ఎవరికి తోచినట్టుగా వారు నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంటి పన్ను అవశ్యకత పెరుగుతుండటంతో కేవలం ఇండ్లు ఉంటేనే ఇంటి పన్నులు ఇస్తామని పంచాయతీ అధికారులు తేల్చి చెప్పడంతో ఇంటి స్థలం ఉన్న ప్రతీ ఒక్కరూ నాలుగు సిమెంట్ పోళ్ళను పాతుకుని రేకులు వేస్తున్నారు. అందులో నివాసం ఉన్నా లేకున్నప్పటికీ ఇంటిపన్ను తీసుకోవడమే లక్ష్యంగా నిర్మాణాలు చేసుకుంటున్నారు. గతంలో ఖాళీ స్థలాకు కూడా ఇంటి పన్నులు సంపాదించుకున్నావారు అనేక మంది ఉన్నారు.
పంచాయతీ అధికారులపై పెరుగుతున్న పైరవీలు
ఇంటి పన్నుకోసం తాత్కాలికంగా ఇండ్లు వేసినవారికి ఇంటి పన్నులు ఇప్పించేందుకు స్థానికంగా ఉన్న పలు రాజకీయపార్టీల నాయకులను కొందరు ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆయా పంచాయతీలపై పట్టున్న వారు తమ వారి ఇంటిని నమోదు చేసుకుని ఇంటి పన్నులు ఇవ్వాలని పంచాయతీ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆయా పంచాయతీలలో పనిచేసే సిబ్బంది తలమునకలవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.