Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
''జీవి ఏదైనా ప్రాణం ఒక్కటే..అది చిన్న జీవా..! పెద్ద జీవా..!! అనేది కాదు'' అని భావించిన ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి పావురాన్ని కాపాడారు. ఖమ్మంరూరల్ పరిధిలోని గురుదక్షిణ ఫౌండేషన్ వద్ద గల బ్రిడ్జి పై నుండి ఎన్నెస్పీ కాలువ నీటిలో పడి విలవిలలాడుతున్న పావురాన్ని నిత్యం ఆ కాలువలో ఈత కొట్టే ఖమ్మం నగరానికి చెందిన భీమవరపు రవికుమార్ అనే గ్రానైట్ వ్యాపారి గమనించారు. ఎలాగైనా ఆ పావురాన్ని కాపాడాలని ఒక్క ఉదుటున నీటిలో దూకారు. ప్రవాహ ఉధతికి వేగంగా కొట్టుకుపోతున్న పావురాన్ని ఎట్టకేలకు చేజిక్కించు కున్నారు. కానీ నీటి ఉధతి వేగంగా ఉండటంతో ఒడ్డుకు వచ్చే అవకాశం లేదు. అయినాసరే ఒక్క చేతితో పావురాన్ని నీటిలో తడవకుండా పైకెత్తి పట్టుకుని మరో చేతితో ఈదుతూ ఒడ్డుకు చేరారు. దాదాపు కిలో మీటర్ దూరం వరకు ఇలా ఈదుతూ పావురం ప్రాణాలు నిలిపిన రవికుమార్ ను సీఐలు గోపి, రాజిరెడ్డి, డాక్టర్ రవికుమార్ గౌడ్ తదితరులు అభినందించారు.