Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాతబస్టాండ్ ఎత్తివేతతో అధోగతిపాలు
- దిక్కుతోచని స్థితిలో స్టాల్స్ నిర్వాహకులు
- గడువున్నా ఖాళీ చేయాలని నోటీసులు
- రూ.లక్షల్లో నష్టపోతున్నామని బాధితుల గోడు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
'' సారూ... మా బతుకులు ఆగం చేయకండి. అప్పూసప్పూ తెచ్చి పాతబస్టాండ్లో దుకాణాలు వేలంలో రూ.లక్షలు వెచ్చించి అద్దెలకు తీసుకున్నాం. ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పటికిప్పుడు షాపులు ఖాళీ చేయమంటే మా కుటుంబాలు రోడ్డున పడతాయి. ప్రత్యామ్నాయమైనా మాకు చూపించండి. కనీసం అడ్వాన్స్గా కట్టిన డబ్బులైనా ఇవ్వండి...'' అంటూ పాతబస్టాండ్లోని 15 షాపుల దుకాణాదారులు వాపోతున్నారు. ఇంకా 20 నెలల నుంచి నాలుగేళ్ల వరకూ సమయం ఉన్నా బస్టాండ్లోని దుకాణాలు ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు రావడంతో గోడువెళ్లబోసుకుంటున్నారు. తమ వరకు కొత్తబస్టాండ్లో దుకాణాలు కేటాయించాల్సిందిగా ఖమ్మం బస్స్టేషన్ అధికారులకు మొరపెట్టుకున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
దుకాణాదారులకు నోటీసులు
ఖమ్మం పాతబస్టాండ్ను 1975 సంవత్సరంలో జిల్లాకు చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించారు. మొత్తం 12 ప్లాట్ఫామ్లతో నిర్మించిన ఈ బస్స్టేషన్లో సైకిల్ స్టాండ్, మూత్రశాలలతో కలుపుకుని 16 షాప్స్ ఉన్నాయి. వీటిని ఐదేళ్ల కాలపరిమితితో వేలం నిర్వహించి కిరాయికి ఇస్తున్నారు. ఆయా షాప్స్ విస్తీర్ణం ఆధారంగా అద్దె నిర్ధారించారు. ప్రస్తుతం అంతరాష్ట్ర సర్వీసులు మొదలు పల్లె వెలుగు బస్సుల వరకు రోజుకు సుమారు 1,800 సర్వీసులు ఇక్కడి నుంచి నడుస్తున్నాయి. నిత్యం సుమారు లక్ష మంది వరకు ప్రయాణీకులు ఖమ్మం బస్టాండ్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీని ఆధారంగా వేలాదిమంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నారు. ఇక బస్టాండ్లోని దుకాణాదారులైతే కేవలం ఈ ప్రయాణీకుల నమ్ముకునే రూ.లక్షలు వెచ్చించి షాప్స్ కిరాయికి తీసుకున్నారు. విస్తీర్ణం ఆధారంగా ఒక్కో షాపుకు నెలకు రూ.25,000 నుంచి రూ.1,00,000పైగా అద్దె చెల్లిస్తున్నారు. ఇలా ప్రతినెలా దాదాపు రూ.కోటి వరకు టీఎస్ఆర్టీసీకి ఈ దుకాణాల ద్వారా ఆదాయం వస్తోంది. కానీ మార్చి 1వ తేదీ నుంచి బైపాస్రోడ్డులో నూతన బస్టాండ్ ప్రారంభం అవుతున్న దృష్ట్యా పాతబస్టాండ్ను ఖాళీ చేయాల్సిందిగా దుకాణాదారులకు నోటీసులు అందాయి.
ఆందోళనలో దుకాణాదారులు
బస్స్టేషన్లోని దుకాణాల అద్దెలకు సంబంధించి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం పలు నిబంధనలు విధించింది. దీనిలో రూల్ నంబర్ 19 ప్రకారం 'పాత బస్స్టేషన్ను వదిలివేసినప్పుడు పాతదాని నుంచి కొత్తబస్స్టేషన్కు దుకాణాలు మార్చడం అనుమతించబడవు. ఈ నిబంధన ప్రకారం అంతకుముందు చేసుకున్న ఒప్పందాలు (అగ్రిమెంట్లు) కూడా రద్దవుతాయి. కొత్తబస్స్టేషన్ వేలంలో అక్కడి రూల్స్ ప్రకారం ఇక్కడి దుకాణాదారులు కూడా పాల్గనవచ్చు'. కానీ అక్కడ వీరికి ప్రత్యేక వెసులుబాట్లు ఏవీ ఉండవు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ నిర్ణయం మేరకు మార్చి 1వ తేదీన బైపాస్రోడ్డులో కొత్తబస్టాండ్ను ప్రారంభిస్తున్నారు. కాబట్టి పాతబస్టాండ్లోని దుకాణాలను ఖాళీ చేయాల్సిందిగా ఫిబ్రవరి 2వ తేదీన టీఎస్ఆర్టీసీ ఎండీ ఖమ్మం ఆర్టీసీ రీజినల్ కార్యాలయానికి ఆదేశాలు ఇచ్చారు. ఫిబ్రవరి 23వ తేదీన ఖమ్మం రీజినల్ మేనేజర్ సాల్మన్రాజ్ వాటిని జారీ చేశారు. 27వ తేదీ నాటికి దుకాణాదారులకు నోటీసులు అందడంతో నాటి నుంచి గగ్గోలు పెడుతున్నా...ఆర్టీసీ అధికారుల చుట్టూ తిరిగి మొరపెట్టుకుంటున్నా వారి గోడు వినేవారు లేరు. పైపెచ్చు కిరాయిలు సరిగా కట్టడం లేదనే నింద దుకాణాదారులపై వేస్తున్నారు. అయితే ఖమ్మం-నల్లగొండ- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొత్తబస్టాండ్ ప్రారంభోత్సవం తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు కొత్తబస్టాండ్ ప్రారంభంతో పాతబస్టాండ్ దుకాణాదారుల జీవితాల్లో చీకట్లు అలుముకోనున్నాయి.
ఖమ్మం వచ్చి రూ.15 లక్షలు నష్టపోయాం
బలరాం, ఓల్డ్ బస్టాండ్ సైకిల్ స్టాండ్ నిర్వాహకుడు
మాది వరంగల్. ఖమ్మం బస్టాండ్లో సైకిల్స్టాండ్ నిర్వహించుకుని జీవనోపాధి పొందుదామని ఇక్కడికి వచ్చా. మొత్తం మా అగ్రిమెంట్ 48 నెలలు. ఒప్పందం ప్రకారం ఇంకా 20 నెలల సమయం ఉంది. ఇప్పుడు ఈ బస్టాండ్ను మూసి వేస్తామంటున్నారు. కొత్తబస్టాండ్లో మాకు అవకాశం ఇవ్వమని ఆర్ఎం గారికి మొరపెట్టుకున్నాం. కానీ కుదరదన్నారు. రూ.10లక్షలు పెట్టి ఈ కొత్త షెడ్డు వేశాను. ఇప్పుడు ఏమీ వస్తాయి. వరంగల్ నుంచి ఖమ్మం వచ్చి రూ.15 లక్షలు నష్టపోయా.
అగ్రిమెంట్ గడువు ఇంకా నాలుగేళ్లుంది
గంగాధర్, పాతబస్టాండ్ కాంప్లెక్స్ దుకాణాదారు
ఐదేళ్ల కాలపరిమితితో గత మార్చిలో అద్దెకు తీసుకున్నాను. ఇంకా నాలుగేళ్లు టైం ఉంది. కొత్తబస్టాండ్ స్టార్టవుతుంది కాబట్టి షాపు ఖాళీ చేయమన్నారు. మా సెక్యురిటీ డిపాజిట్ ఆర్నెళ్ల అడ్వాన్స్ కిరాయి రూ.7లక్షలు ఆర్టీసీ దగ్గర ఉంది. రెండునెలల తర్వాత దాన్ని ఇస్తామంటున్నారు. కానీ నాకు కొత్తబస్టాండ్లో దుకాణం కేటాయించమని అడిగా. అద్దె ఎక్కువైనా భరిస్తా అన్నా. టెండర్లు పిలుస్తాం...వస్తే తీసుకో అన్నారు. కానీ నాకు టెండర్ రాలేదు. మాకు ఆల్రెడీ ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. మా పరిస్థితి ఏంటంటే...పైకి అప్రూవల్ పెడతామన్నారు. అది వచ్చేదెప్పుడో..!
పాతబస్టాండ్తో పాటు దుకాణదారులను కొనసాగించాలి...
నున్నా నాగేశ్వరరావు, పాతబస్టాండ్ పరిరక్షణ కమిటీ నాయకులు
పాతబస్టాండ్ను సిటీ, పల్లెవెలుగు బస్టాండ్గా కొనసాగించాలి. దానిలోని దుకాణదారులనూ యథాతథంగా ఉంచాలి. ఒక్కొక్కరికి నాలుగేళ్లు, రెండేళ్ల వరకు ఒప్పంద సమయం ఉంది. కాబట్టి వారికి అన్యాయం జరగకుండా చూడాలి. బస్టాండ్ ఎత్తివేస్తే వీరు రూ.లక్షల్లో నష్టపోవాల్సి ఉంటుంది. జీవనోపాధి కోల్పోతారు. ఏ ఒక్కరూ నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
ఏమీ చేయలేం : సాల్మన్రాజ్, టీఎస్ఆర్టీసీ ఆర్ఎం, ఖమ్మం
కొత్తబస్టాండ్ ప్రారంభిస్తున్న దృష్ట్యా పాతబస్టాండ్ను క్లోజ్ చేయక తప్పదు. అందుకే పాతబస్టాండ్ కాంప్లెక్స్లో దుకాణాలు ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చాం. పాతబస్టాండ్కు బస్సులు రావు కాబట్టి వాళ్లు ఇక్కడున్నా ఉపయోగం లేదు. ఆర్నెళ్ల కిరాయి అడ్వాన్స్గా తీసుకున్నాం. కరోనా సమయంలో ఆర్నెళ్ల పాటు కిరాయి తీసుకోవద్దని సంస్థ యజమాన్యం ఆదేశాలతో తీసుకోలేదు. అక్టోబర్ నుంచే వారు అద్దె చెల్లిస్తున్నారు. కాబట్టి వారి అడ్వాన్స్ అంటూ ఏమీ లేదు. కొత్తబస్టాండ్లో విస్తీర్ణం ప్రకారం అద్దెలు నిర్ణయించాం. అందులోకి షాప్స్ షిఫ్ట్ చేసుకోమన్నాం. వారు కాదన్నాకే మేము టెండర్లకు వెళ్లాం. ఇప్పుడు మేము ఏమీ చేయలేం.