Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
- హక్కుపత్రాలు పొందే వరకు పోరు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-అశ్వారావుపేట
గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికొస్తే ఊరుకు నేది లేదని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అటవి అధికారులను హెచ్చరించారు. మండలంలోని పండువారి గూడెంలో మంగళ వారం గిరిజనులకు అటవీ అధికారులకు మధ్య జరిగిన భౌతిక దాడుల క్రమంలో గత మూడు రోజులుగా పోడు భూములకు వెళ్ళే మార్గంలో నిరవధిక నిరసన చేపడుతున్న నేపద్యంలో గురువారం ఆయన గిరిజనులకు మద్దతుగా మాట్లాడారు. గిరిజన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఇచ్చిన హామీకి విరుద్ధంగా అటవీ అధికారులు గిరిజనుల పట్ల వ్యవహరించే తీరు అన్యాయమని తెలిపారు. సాగు చేసుకునే పోడుకు హక్కు పత్రాలు ఇవ్వకపోగా చదును చేసి సాగుకు యోగ్యమైన భూములను అటవీ అభివృద్ధి పేరుతో ఆక్రమణలకు దిగడం ఏంటని ప్రశ్నించారు. గిరిజనులపై దాడులకు దిగితే వారంతా ఏకమై అధికారులను, ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరక్కుండా గెదుముతారని హెచ్చరించారు.
అంతకు ముందు సాగు దారులను ఉద్దెశించి సీపీఐ(ఎం) నాయకులు చిరంజీవి మాట్లాడుతూ హక్కు పత్రాలు పొందేవరకు అహింసాయుత పోరాటం సాగిస్తామని గిరిజనులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నారం రాజశేఖర్, తెదేపా మండల అధ్యక్షులు మందపాటి రాజమోహన్ రెడ్డి, గిరిజన నాయకులు మడకం గోవిందు, సున్నం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.