Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామ్నగర్ గోదావరిలో రాత్రంతా ట్రాక్టర్ల మోత
- మారుమూల కావడంతో అక్రమార్కులకు అనువుగా మారిన గోదావరి
- ఊరికింత అంటు ముట్టజెప్పిన వైనం
- పట్టించుకోని రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ-అశ్వాపురం
మండల పరిధిలోని బట్టీలగుంపు మారుమూల ప్రాంతానికి చెందిన పంచాయతీ. ఈ పంచాయతీ మండల కేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మిట్టగూడెం ఆర్అండ్బి ప్రధాన రహదారికి గోదావరి నదికి సుమారు 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పంచాయతీ శివారులోని రామ్నగర్ గ్రామ సమీపంలోగల ఆనకట్టకు ఎగువబాగంలో కొందరు అక్రమార్కులు బ్రహ్మండమైన ఇసుక ర్యాంపును తయారుచేసి అక్రమంగా ఇసుకను తరలిస్తు సొమ్ముచేసుకుంటున్నారు. ఈ తతంగమంతా సుమారు రెండు నెలలుగా కొనసాగుతున్న పట్టించుకున్న నాథుడే లేకపోవడంతో ఆక్రమణదారులు ఆడిందే ఆట పాడిందే పాటగా చలామని అవుతున్నారు.
గోదావరిలో మరెక్కడ లేనంత నాణ్యతగా ఉన్న ఇసుక నిల్వలు :
రామ్నగర్ గోదావరిలో ఉన్న ఇసుక ఆనకట్ట దిగువప్రాంతాలలో మరెక్కడలేదు. ఇక్కడ ర్యాంపు నుండి తరులుతున్న ఇసుక ఒకే సైలులో చక్కెరను తలపించే విధంగా ఉంది. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి ఇసుకలో మచ్చుకైన గవ్వ కనిపించకపోవడం నాణ్యతకు మరో పేరుగా చెప్పవచ్చును. ఈ ర్యాంపులో దొరికే ఇసుక కట్టుబడి, స్లాబులతోపాటు ముఖ్యంగా ప్లాస్టింగ్ చేసుకునేందుకు బాగా ఉపయోగపడుతోంది. అందుచేత ఇసుకకు మంచి గిరాకీ ఉండటంతో రాత్రి అయ్యిందంటే చాలు వారి వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లేలా కొనసాగిస్తున్నారు.
మూడు గ్రామాల ప్రజలతో బేరం కుదుర్చుకున్న ఇసుక వ్యాపారులు :
రామ్నగర్ గోదావరి నుండి ఇసుకను తరలించాలంటే రామ్నగర్, బట్టామల్లయ్యగుంపు, బట్టీలగుంపు, పాములపాల్లి అనే నాలుగు గుంపులను దాటాల్సి ఉంది. మొదట్లో ఈ గ్రామం గుండా ఇసుక ట్రాక్టర్లు తిరుగుతున్న సమయంలో గ్రామస్తులు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తంచేసారని పలువురు అంటున్నారు. గ్రామస్తులను కాదని ఇసుక రవాణా చేయలేమని భావించిన అక్రమ ట్రాక్టర్ల నిర్వహకులు వారితో బేరం కుదుర్చుకుని గ్రామానికి ఇంత అని ఒప్పందం చేసుకున్న తర్వాత ఇసుక రవాణకు అడ్డులేకుండా పోయిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్న మండల ప్రజలు :
గోదావరి ఆనకట్ట ఎగువబాగంలో నిల్వఉన్న విలువైన ఇసుకను ఆక్రమట్రాక్టర్ల పాలు కాకుండా రెవెన్యూ అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. మారుమూల ప్రాంత కావడంతో అధికారుల నిఘా కాస్త సన్నగిల్లినందున అక్రమార్కులకు అడ్డుఅదుపు లేకుండా పోతోందని, ఇప్పటికైన రెవెన్యూ అధికారులతోపాటు సంబంధిత శాఖ జిల్లా ఉన్నతాధికారులు పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేసి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.