Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరితహారం పేరుతో ఇసుక దారిమళ్లింపు
- మండలంలో ఉపాధి హామీ సిబ్బంది తీరిది
- వలపన్ని పట్టుకున్న రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ-చింతకాని
హరితహారం మొక్కల పెంపకం పేరుతో ఉపాధి హామీ సిబ్బంది ఇసుక అక్రమ రవాణాకు పాల్పడ్డారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ఇసుక అక్రమ రవాణాదారులతో కుమ్మక్కై ఈ చర్యలకు పాల్పడ్డారు. గ్రామస్తుల సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బంది వలపన్ని అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను, ఒక జేసీబీని పట్టుకుని స్థానిక పొలీస్ స్టేషన్కు తరలించారు. తహాసీల్దార్ ఎం.భద్రకాళీ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని చిన్నమండవ గ్రామంలోని మున్నేరు నుంచి స్థానిక ఉపాధి సిబ్బంది హరితహరం మొక్కల పెంపకం కోసం గత రెండు రోజులుగా అనధికారకంగా ఇసుకను తరలిస్తున్నారు. దానికే గాక ఇసుక అక్రమ రవాణాదారులతో మమేకమై ఇసుకను జిల్లాలోని ఇతర ప్రాంతాలకు అక్రమంగా దారిమళ్లిస్తున్నారు. నిషేధిత ఆర్డబ్ల్యుఎస్ పరిధిలోని ఫ్లోరైడ్ ప్రాజెక్టుకు అతి సమీపంలో ఇసుకను జేసీబీల సహాయంతో వందల ట్రాక్టర్లలో నింపి జేబుల నింపుకుంటున్నట్టు గ్రామస్తులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది వలపన్ని 6 ఇసుక ట్రాక్టర్లను, ఒక జేసీబీని పట్టుకుని సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇదిలా ఉండగా అధికారులే ఈ విధంగా చేయడంతో మండల ప్రజలు అధికారుల తీరుపై చర్చించుకుంటున్నారు.
ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ ఎం భద్రకాళీ మాట్లాడుతూ జిల్లా స్థాయి ఇసుక పంపిణీ కమిటీ వారి ఆదేశాల ప్రకారం మండల పరిధిలోని మున్నేటిలో ఎటువంటి ఇసుకను తరలించడానికి వీలులేదనీ, ఉపాధిహమీ సిబ్బంది సొంత నిర్ణయం ప్రకారం జేసీబీ, ట్రాక్టర్ల సహయంతో ఇసుక తరలించారని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దావులూరి లలితకుమారి, ఈఓఆర్డీ మడూరి రామయ్య, వీఆర్ఓ మధు, వీఆర్ఏలు మీరావళి తదితరులు పాల్గొన్నారు.