Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
ఈ నెల 25న రెండవ విడతలో పోలింగ్ నిర్వహించనున్న కల్లూరు మండలంలోని అన్ని పంచాయతీల్లోనూ అభ్యర్థుల ప్రచార హోరు ఊపందుకుంది. కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో సర్పంచ్, వార్డు అభ్యర్థులు తమ పరిధిలో ప్రచారాలను ముమ్మరం చేశారు. కాగా టీఆర్ఎస్లో ఉన్న వర్గ విభేదాలు ఈ ఎన్నికల్లోనూ బహిర్గతమే రచ్చకెక్కుతున్నాయి. కల్లూరు మేజర్ పంచాయతీకి ఎంపీ వర్గం నుంచి లక్కినేని నీరజ పోటీలో ఉన్నారు. గతంలో తమ కుటుంబీకులు సర్పంచ్గా ఉండి కల్లూరును అభివృద్ధి చేశారనీ, తాను కూడా అదే బాటలో నడుస్తానని హామీ ఇస్తూ ఓట్లు అడుగుతున్నారు. తుమ్మల వర్గం నుంచి పసుమర్తి పద్మావతి పోటీలో ఉన్నారు. కల్లూరు దొరల పాలనకు పోనీయకుండా, నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రచారం చేస్తున్నారు. కొత్తగా పంచాయతీలుగా ఏర్పడిన హనుమతండా, కప్పలబంధం గ్రామాల్లోనూ టీఆర్ఎస్ వర్గాల మధ్యనే పోటీ నెలకొంది. హనుమాతండాలో టీఆర్ఎస్లో ఎంపీ వర్గం నుంచి బానోతు మోహన్, తుమ్మల వర్గం అభ్యర్థిగా హాతీరాం పోటీలో ఉన్నారు. కప్పలబంధం, పడమర లోకవరం గ్రామాల్లోనూ టీఆర్ఎస్ వర్గాల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది.
సీపీఐ(ఎం) అభ్యర్థి ప్రచారం : కల్లూరు మేజర్ పంచాయతీకి సీపీఐ(ఎం) తరుపున పోటీ చేస్తున్న తన్నీరు కృష్ణవేణి తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. తాను రాజకీయ చైతన్యం గల కార్యకర్తగా ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నాననీ, తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారమ వుతాయని హామీ ఇస్తున్నారు. తనకు కేటాయించిన గుర్తు ఉంగరాన్ని చూపుతూ ప్రచారం చేస్తున్నారు.