Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లిటౌన్
మరో ఐదు రోజుల్లో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల గడవు ముగుస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో ఉత్కంఠ రేగుతున్నది. తమ గెలుపునకు ఎంత డబ్బు, మద్యం పంచడానికైనా సిద్ధపడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఏ గ్రామంలో చూసిన డబ్బు, మద్యం ముచ్చటనే కనిపిస్తుంది. అదేవిధంగా ఒక్కపార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులే తర్జన పడుతున్నారు. మరో వైపు స్వతంత్య్ర అభ్యర్థులు ఏ పార్టీకీ సంబంధం లేకుండా ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంతో గ్రామాల్లో ఓటర్లకు విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు తమ గెలుపుకోసం ఖర్చుకు వెనకాడటం లేదు. ఇదే అదను చేసుకొని వైన్స్ యజమానులు తమ ఇష్టానుసారంగా మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఒక్కో బాటిల్పై ఎంఆర్పీ ధరకంటే ఎక్కువగా మద్యం బాటిళ్లను విక్రయిస్తున్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎంత ధరకైనా మద్యం బాటిళ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో వైన్స్ యజమానులు అందినకాడికి దండుకుంటున్నారు.
ఇంత ధర ఎందుకని ప్రశ్నిస్తే ఎన్నికలు కాబట్టి ఎక్కువ ధరకు విక్రయిస్తాం. లేదంటే మద్యం కొరత ఉందని సమాధానం చెబుతున్నారు. ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఓటర్లు డబ్బు, మద్యానికి తమ ఓటుహక్కును అమ్ముకోకూడదని పోలీస్ అధికారులు ప్రతి గ్రామంలో అవగాహన కల్పిస్తున్నారు. ఎంత అవగాహన కల్పించినా డబ్బు, మద్యం పంపిణీ జోరుగా కొనసాగుతూనే ఉంది. డబ్బు, మద్యంతో పాటు గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలకు అవసరాలను ఆసరగా వస్తురూపంలోనూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధులకు దుప్పట్లు, పేదలకు వస్త్రాలు, యువతకు క్రికెట్, వాలీబాల్ కిట్లు, ప్రార్థనా మందిరాల్లో అవసరమైన సామాగ్రి అందిస్తున్నారు. ఇవేవీ ఎలక్షన్ కోడ్ కింద కానరా వా అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.
వైన్స్ యజమానులపై చర్యలు తీసుకోవాలి...
వైన్స్ యజమానులు మద్యాన్ని తమకు ఇష్టం వచ్చిన ధరకు విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే ఎన్నికల సమయం కాబట్టి మందు కొరత ఉండటంతో ఇలా చేస్తున్నామని సమాధానం చెబుతున్నట్టు మద్యంబాబులు ఆరోపిస్తున్నారు. నీ ఇష్టం ఉంటే తీసుకో లేకుంటే లేదని సమాధానం ఇస్తున్నారు. వైన్స్ యజమా నులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మద్యం, డబ్బులు పంచితే కఠిన చర్యలు... తాటిపాముల సురేష్, పట్టణ సీఐ, సత్తుపల్లి
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు ఎవరైనా మద్యం, డబ్బులు పంపిణీ చేసినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఓటర్లు తమ ఓటుహక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవచ్చు. ఎవరైనా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తే 100కు కానీ పోలీస్ స్టేషన్కు కాల్చేసి చెప్పండి.
ఎమ్మార్పీ ధరకే మద్యం విక్రయించాలి... బీ.రాంప్రసాద్, ఎక్సైజ్ సీఐ, సత్తుపల్లి
వైన్స్ యజమానులు ఎమ్మార్పీ ధరకే మద్యాన్ని విక్రయించాలి. ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయించినట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవు. వైన్స్ల లైసెన్సు రద్దు చేయబడుతుంది. ఎవరికైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వండి. ఎక్కువ రేట్లకు విక్రయించినట్టు మా దృష్టికి వస్తే విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుని లైసెన్సును రద్దుచేస్తాం.