Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
ఉపాధి అవకాశాలకు యువత ఉద్యమించాల్సిన తరణం ఆసన్నమైందని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పొడకంటి రాంబాబు పిలుపునిచ్చారు. ఆదివారం కారేపల్లి మండల మహాసభ రాచర్ల రణదీర్ అధ్యక్షతన కారేపల్లి భాగం రామనర్సయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ, కేసీఆర్లు యువత ఆశలను ఆవిరి చేశారన్నారు. మోడీ ఏడాదికి కోటి, కేసీఆర్ ఏడాది లక్ష ఉద్యోగాలంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో యువతకు ఆశల పల్లకిలో ఎక్కించారన్నారు. నేడు దేశాన్ని మోడీ ఆర్థిక మాంద్యంలో నెట్టి కార్మికులు, ఉద్యోగుల మెడపై కత్తి పెట్టారన్నారు. పాలకుల చర్యలతో దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని, ప్రజల బాగోగులు చూడాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు దాసోహంగా పని చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనలే తప్ప నియామక పక్రియ సాగటం లేదన్నారు. ప్రభుత్వానికి కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా మార్పు రావటం లేదన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకోసం పోరాటాలను సిద్దం కావాలి యువతను కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు భూక్యా పవన్, బానోత్ బన్సీలాల్, అరవింద్, కే.సురేష్, సోమేశ్వరరావు, లాకావత్ వినోద్కుమార్, ప్రసాద్. డేగటి రాజు, దారావత్ రవి తదితరులు పాల్గొన్నారు.