Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు రోజులుగా ప్రారంభం కాని పెసర కొనుగోళ్లు
- ప్రయివేటును ఆశ్రయించి నష్టపోతున్న రైతులు
- క్వింటాకు సుమారు రూ.2వేలు దోపిడీ
'ఈ చిత్రంలో పెసల బస్తాలపై కూర్చున్న వ్యక్తి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్తండా రైతు విజయపాల్ రెడ్డి. క్వింటా పెసళ్లకు రూ.7,050 మద్దతు ధర చెల్లిస్తామని మార్క్ఫెడ్ ప్రకటించడంతో సుమారు 60 క్వింటాళ్ల పెసర పంటను మార్కెట్కు తీసుకొచ్చాడు. పెసలను పరిశీలించి తేమ 35శాతం ఉందని కొనకుండా తిరస్కరించారు. రైతు గట్టిగా ప్రశ్నించడంతో తెల్లారే కొంటామని చెప్పి వెళ్లిపోయారు. రాత్రి అక్కడే నిద్రించిన రైతు.. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఎదురుచూసినా ఎవరూ రాలేదు. అక్కడే ఉన్న ప్రయివేటు వ్యాపారులకు క్వింటా 5600 రూపాయలకు అమ్ముకుని ఉసూరుమంటూ ఇంటిదారి పట్టాడు'
నవతెలంగాణ-ఖమ్మంప్రతినిధి
ఖమ్మం, వైరా, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కేంద్రాల్లో పెసల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్నా.. వాటి నిర్వాహణ మాత్రం గాలికొదిలేశారు. ఆరుగాలం శ్రమించి పంట తీసుకొస్తే ఏదో ఒక సాకు చూపుతూ మార్కె ట్లో తిరస్కరించి ఇబ్బందులకు గురిచేస్తు న్నారు. దీనికితోడు నాలుగురోజులుగా మార్క్ఫెడ్ లో కొనుగోళ్లు లేక వ్యాపారులకు అమ్ముకుంటూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ మూడు కేంద్రాల్లోనూ పీఏసీఎస్ సిబ్బంది అందుబాటులో లేరు. కాటా వేసేందుకు గన్నీ సంచులు, తేమశాతం యంత్రాలు కూడా సరిపోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఇదీ లెక్క..
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్లో 21వేల ఎకరాల్లో పెసర పంట సాగుచేశారు. సగటున ఎకరానికి మూడు క్వింటాళ్లు దిగుబడి లెక్కన 63వేల క్వింటాళ్ల పెసలు మార్కెట్కు వచ్చే వీలుంది. మార్క్ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కేవలం 10,300 క్వింటాళ్లు మాత్రమే కొంటామని చెప్పడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది కూడా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో కేవలం 6,975 క్వింటాళ్లే కొన్నారు. వ్యాపారులు మాత్రం అందుకు రెట్టింపుగా 15,300 క్వింటాళ్లు కొనుగోలు చేయడం పరిస్థితికి అద్దంపడుతున్నది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సుమారు 2,500 క్వింటాళ్ల పెసలను ప్రయివేటు వ్యాపారులు క్వింటా 5వేల రూపాయలకే కొనుగోలు చేశారు. ఈ లెక్కన క్వింటాకు రూ.2,050 చొప్పున జిల్లా రైతులు రూ. 51.25లక్షలు నష్టపోయారు. ఇంత జరుగుతున్నా మార్క్ఫెడ్ అధికారులు స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు.
రైతులకు ఇబ్బంది రానివ్వం.. : మద్దినేని వెంకటరమణ (ఖమ్మం మార్కెట్ చైర్మన్)
తొలిరెండు రోజుల్లో రైతులు ఇబ్బందిపడ్డారు. అందుకే పరిస్థితిని మంత్రి అజరుకుమార్ దృష్టికి తీసుకెళ్లాను. వెంటనే మార్క్ఫెడ్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రితో నేరుగా మాట్లాడి విషయాన్ని వివరించారు. రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం. ప్రస్తుతం నిర్దేశించిన లక్ష్యాన్ని పెంచేలా కృషిచేస్తాం.
సమస్య రాకుండా చూస్తాం.. : వాణి (మార్క్ఫెడ్, డీఎం ఖమ్మం జిల్లా)
జిల్లాలో మూడు మార్కెట్లలో ఏర్పాటుచేసిన పెసల కొనుగోలు కేంద్రాల్లో హడావిడిగా ఆరంభించడంతో గందరగోళం ఏర్పడింది. రైతులు ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమే. ఈ సమస్యను అధిగమిస్తాం. ప్రతీ రైతుకూ న్యాయం చేస్తాం.
ప్రయివేటు దళారులదే దందా.. : మాదినేని రమేష్ (రైతు సంఘం జిల్లా కార్యదర్శి)
మార్క్ఫెడ్ పెట్టినా, పెట్టకపోయినా అంతిమ లక్ష్యం మాత్రం ప్రయివేటు దళారులకు కొమ్ముకాసేందుకు జరుగుతున్న ప్రయత్నాలే. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం దారుణం. రైతును మరోలా మోసం చేయడమే. మార్కెట్కు తెచ్చిన సరుకును కూడా ప్రయివేటు వ్యాపారులకు అమ్ముకునేలా చేయడం దారుణం.