Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంటౌన్
ఏజెన్సీ ప్రాంతానికి చెందిన 93 మంది కేజీబీవీ పీజీ సీఆర్టీలకు కౌన్సెలింగ్ నిర్వహించి వెంటనే నియామక పత్రాలు అందజేయాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.వి. నాగమ ల్లేశ్వరరావు, నెల్లూరి వీరబాబు, టీఎస్ టీటీఎఫ్ అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం డీఈవో కార్యాలయం ఎదుట ఈ మేరకు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌన్సెలింగ్ ఉందని వ్యక్తిగత సమాచారం పంపించి తీరా వాయిదావేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తాజా ఏజెన్సీ ధృవ పత్రాలు అందరి వద్ద లేవనే కారణంతో కౌన్సెలింగ్ వాయిదా వేయడం సరికాదన్నారు. పది మంది అభ్యర్థుల వద్ద మాత్రమే లేవని మిగిలిన వారి వద్ద తాజా ధృవ పత్రాలు ఉన్నాయని తెలిపారు. కొద్ది మంది కోసం కౌన్సెలింగ్ ఆపాల్సిన అవసరం లేదన్నారు. దీనివల్ల అర్హులైన అనేక మంది నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇతర జిల్లాల్లో కౌన్సెలింగ్ పూర్తయినా మన జిల్లాలో అధికారుల అలసత్వం కారణంగా కౌన్సెలింగ్ నిర్వహించలేకపోతున్నారని వారు విమర్శించారు. ఇప్పటికైనా డీఈవో వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందించారు.